నీ దగ్గర డబ్బులెందుకన్న.. ఉండనియి.. ఇండియాను ఓడించావ్, అది చాలు.. భారత్ను ఓడించాక రిజ్వాన్కు అన్నీ ఫ్రీ
INDvsPAK: గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడింది. కోహ్లీ సారథ్యంలోని టీమిండియాను బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది.
భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. రెండు దేశాల ప్రజల జీవితాలలో క్రికెట్ కూడా ఓ భాగమైంది. ఇరు దేశాల్లో క్రికెటర్లకు ప్రత్యేక ఆదరణ ఉంది. సచిన్, ధోని, కోహ్లీని భారత్ లో ఆరాదిస్తే ఇమ్రాన్, వసీమ్ అక్రమ్, బాబర్ ఆజమ్ లు పాక్ లో అదే అభిమానం పొందుతున్నారు.
రెండు దేశాల మధ్య ఉన్న వైరం కారణంగా దాయాది దేశాల మధ్య మ్యాచ్ అంటేనే హై ఓల్జేట్ ప్రెషర్ ఉంటుంది. ఇటువంటి మ్యాచ్ లలో గెలిచిన జట్టుపై ప్రశంసలు, ఓడిన జట్టుపై విమర్శలు రావడం సర్వ సాధరణమే. గతంలో అంతగా లేవుగానీ గత ఏడాదికాలంలో భారత్ - పాక్ లు నాలుగు సందర్భాల్లో తలపడ్డాయి. 2021 టీ20 ప్రపంచకప్ లో భారత్ - పాక్ మ్యాచ్ తర్వాత ఆసియా కప్ లో రెండుసార్లు మళ్లీ 2022 టీ20 ప్రపంచకప్ లో మరోసారి దాయాది జట్లు తలపడ్డాయి.
2021 ప్రపంచకప్ లో భారత్ - పాక్ మ్యాచ్ జరుగగా ఈ మ్యాచ్ లో టీమిండియా చిత్తుగా ఓడింది. పాక్ బౌలింగ్ ధాటికి భారత్ 152 పరుగులకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయాన్ని అందుకుంది. ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్ తో పాటు మహ్మద్ రిజ్వాన్ లు భారత్ బౌలింగ్ ను ఆటాడుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో విజయం తర్వాత పాకిస్తాన్ లో తన జీవితమే మారిపోయిందంటున్నాడు పాక్ వికెట్ కీపర్ రిజ్వాన్.
ఇటీవల ముగిసిన ముల్తాన్ టెస్టు తర్వాత స్కై స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘మేం భారత్ పై మ్యాచ్ గెలవగానే నేను అది అప్పుడు జస్ట్ ఒక మ్యాచ్ మాత్రమే అనుకున్నా. ఎందుకంటే ఆ మ్యాచ్ లో మేం ఈజీగా గెలిచాం. కానీ నేను పాకిస్తాన్ కు వచ్చాకే అసలు విషయం అర్థమైంది..
నేను ఏదైనా షాప్ కు కొనుక్కోవడానికి వెళ్లినా, షాపింగ్ కు పోయినా అందరూ నన్ను ప్రత్యేకంగా చూసేవాళ్లు. నా దగ్గర డబ్బులు తీసుకోకపోయేవాళ్లు. నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తే.. ‘వద్దు, వద్దు నువ్వెళ్లన్నా. డబ్బులేమొద్దు. నీ దగ్గర మేం డబ్బులు తీసుకోం. మీకు ఇక్కడ ఏం తీసుకున్నా ఫ్రీ. మీరు ఇండియా పై గెలిచారు. అంతకన్నా ఇంకేం కావాలి అని అనేవాళ్లు..’అని తెలిపాడు.