టీ20 వరల్డ్కప్ కూడా యూఏఈకి వెళ్లినట్టేనా... భారత్ వేదికగా నిర్వహించడం కష్టమేనంటూ...
భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సిన టీ20 వరల్డ్కప్ 2021 మెగా టోర్నీ, తటస్థ వేదిక యూఏఈ వేదికగా జరగడం ఖాయమైనట్టు వార్తలు వస్తున్నాయి. భారత్లో సెకండ్ వేవ్ కేసులు ఇంకా పూర్తిగా తగ్గకపోవడం, టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో వేదికను తరలించడానికే మొగ్గుచూపుతున్నాయి బీసీసీఐ, ఐసీసీ...
భారత్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్కి మధ్యలోనే బ్రేక్ పడింది. దేశంలో కరోనా ఎంత విజృంభిస్తున్నా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ఉంటే, భారత్ ఐసీసీ టీ20 వరల్డ్కప్కి ఆతిథ్యం ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు ఉండేవి కావు.
అయితే బయో బబుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం, ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడడంతో పరిస్థితి మారిపోయింది. దీంతో టీ20 వరల్డ్కప్ నిర్వహణపై వేదిక, నిర్వహణ విధానాలను ఖరారు చేయాల్సిందిగా ఐసీసీ ఒత్తిడి చేయడం మొదలెట్టింది.
ఇప్పటికే ఈ పొట్టి ఫార్మాట్ విశ్వకప్కి ఆతిథ్యమిచ్చే విషయం తేల్చేందుకు నెల రోజుల గడువు కోరిన బీసీసీఐ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ మ్యాచులు నిర్వహించడం అతి ఈజీ పని కాదని, యూఏఈ వేదికగానే టోర్నీ నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది.
యూఏఈతో పాటు ఒమన్ వేదికగా ఈ మెగా టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు, త్వరలోని దీనిపై ప్రకటన రాబోతున్నట్టు సమాచారం....
యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జాలతో పాటు ఒమన్ రాజధాని మస్కట్లో అక్టోబర్- నవంబర్ మాసాల్లో టీ20 వరల్డ్కప్ మ్యాచులు నిర్వహించబోతున్నట్టు సమాచారం...
‘అవును, బీసీసీఐ... భారత్లో టీ20 వరల్డ్కప్ నిర్వహించేందుకు వీలు అవుతుందా? లేదా? తేల్చేందుకు నాలుగు వారాల గడువు కోరింది. ఒకవేళ భారత్లో నిర్వహించలేకపోతే బీసీసీఐ ఆధ్వర్యంలోనే యూఏఈ, ఓమన్లలో టోర్నీ నిర్వహిస్తామని ఐసీసీకి తెలియచేసింది’ అంటూ బీసీసీఐ సీనియర్ అధికారి తెలియచేశారు.
16 దేశాలు పాల్గొనే ఐసీసీ టీ20 వరల్డ్కప్కి ప్రాక్టీస్గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారట బీసీసీఐ అధికారులు.
ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్కప్కి మూడు వారాల సమయం ఉంటుంది. ఈ సమయంలో టీ20 వరల్డ్కప్కి ఆతిథ్యం ఇచ్చే విధంగా స్టేడియాలు తయారుచేస్తారు..
భారత్ ఆతిథ్యం ఇచ్చే టీ20 వరల్డ్కప్కి వచ్చేందుకు పాకిస్తాన్ అయిష్టం వ్యక్తం చేసింది. తమ క్రికెటర్లతో అభిమానులకు భారత్ వీసాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుందని అనుమానాలు వ్యక్తం చేసింది.
అయితే యూఏఈలో టోర్నీ జరిగితే పాక్ జట్టు కంటే ఎక్కువగా ఎవ్వరూ సంతోషించరేమో. ఎందుకంటే తటస్థ వేదికగా పాకిస్తాన్, యూఏఈలోనే ఎక్కువ మ్యాచులు ఆడింది. అక్కడి పిచ్ల గురించి వారికి పూర్తి అవగాహన ఉంది.