- Home
- Sports
- Cricket
- ఇరానీ కప్లో సర్ఫరాజ్కు దక్కని చోటు.. బీసీసీఐ పెద్దలపై నోరు పారేసుకున్న ఫలితమేనా..?
ఇరానీ కప్లో సర్ఫరాజ్కు దక్కని చోటు.. బీసీసీఐ పెద్దలపై నోరు పారేసుకున్న ఫలితమేనా..?
ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కు సెలక్టర్లు షాకిచ్చారు. గతేడాది బంగ్లాదేశ్ టూర్ లో సర్ఫరాజ్ ఖాన్ కు ప్లేస్ గ్యారెంటీ అనుకుంటే తాజాగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా సెలక్టర్లు అతడికి మొండిచేయే చూపారు. ఇప్పుడు దేశవాళీలో ప్రతిష్టాత్మక టోర్నీలో కూడా...

దేశవాళీలో మహారాష్ట్ర తరఫున అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ జాతీయ జట్టులో రావడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఎన్ని గొప్ప ఇన్నింగ్స్ లు ఆడినా సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసినా.. ఆస్ట్రేలియా దిగ్గజం సర్ బ్రాడ్మన్ తర్వాత అంతటి సగటు కలిగి ఉన్నా భారత జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు.
గతేడాది బంగ్లాదేశ్ టూర్ లో సర్ఫరాజ్ ఖాన్ కు ప్లేస్ గ్యారెంటీ అనుకుంటే తాజాగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా సెలక్టర్లు అతడికి మొండిచేయే చూపారు. దీంతో అతడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారానే గాక నేరుగా పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చి సెలక్టర్లు, ముఖ్యంగా మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మపై, బీసీసీఐపై తన అసహనాన్ని వెళ్లగక్కాడు. సెలక్టర్లు తనను మోసం చేశారని కూడా వాపోయాడు.
వెంకటేశ్ ప్రసాద్ వంటి మాజీ క్రికెటర్లు సర్ఫరాజ్ కు మద్దతుగా నిలిచారు. వరుసగా విఫలమవుతున్న కెఎల్ రాహుల్ ప్లేస్ లో సర్ఫరాజ్ కు అవకాశమివ్వాలని డిమాండ్ చేశాడు. కాగా బీసీసీఐ, సెలక్టర్లపై నోరు పారేసుకున్న ఫలితమో మరేం కారణమో గానీ ఇప్పుడు సర్ఫరాజ్ కు మరో షాక్ తాకింది. మార్చి 1 నుంచి జరుగబోయే ఇరానీ కప్ లో రెస్టాఫ్ ఇండియా టీమ్ నుంచి కూడా అతడిని పక్కనబెట్టినట్టు సమాచారం.
స్పోర్ట్స్ స్టార్ లో వచ్చిన కథనం మేరకు సర్ఫరాజ్ కు రెస్టాఫ్ ఇండియా టీమ్ లో చోటు దక్కలేదు. దేశవాళీలో రాణిస్తున్న కర్నాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్, ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, సౌరాష్ట్ర బ్యాటర్ హర్విక్ దేశాయ్ లను ఎంపిక చేసిన సెలక్టర్లు.. సర్ఫరాజ్ ను పక్కకుబెట్టేశారు.
వాస్తవానికి గత కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్.. ఈ ఏడాది రంజీ సీజన్ లో కూడా మెరిశాడు. ఇటీవలే ముగిసిన సీజన్ లో అతడు.. ఆరు మ్యాచ్ లలో 92.66 సగటుతో 556 రన్స్ సాధించాడు. తాజాగా అతడిని రెస్టాఫ్ ఇండియా టీమ్ నుంచి తొటగించడానికి కారణం అతడు సెలక్టర్లు, బీసీసీఐపై నోరు పారేసుకోవడమేనని టీమిండియా ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మార్చి 1 నుంచి మధ్యప్రదేశ్ తో గ్వాలియర్ వేదికగా ఇరానీ కప్ జరుగుతుంది. రెస్టాఫ్ ఇండియా జట్టు ఇదే (స్పోర్ట్స్ స్టార్ కథనం ప్రకారం) : మయాంక్ అగర్వాల్, సుదీప్ కుమార్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, హర్విక్ దేశాయ్, ముఖేశ్ కుమార్, అతిత్ షేత్, చేతన్ సకారియా, నవదీప్ సైనీ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), మయాంక్ మార్ఖండే, సౌరభ్ కుమార్, ఆకాశ్ దీప్, బాబా ఇంద్రజీత్, పుల్కిత్ నారంగ్, యశ్ ధుల్