- Home
- Sports
- Cricket
- ఏడుగురు కెప్టెన్లు, 4 అవమానాలు, 2 విజయాలు! గాయాలు, ఓటములు... టీమిండియాకి అస్సలు కలిసిరాని 2022...
ఏడుగురు కెప్టెన్లు, 4 అవమానాలు, 2 విజయాలు! గాయాలు, ఓటములు... టీమిండియాకి అస్సలు కలిసిరాని 2022...
2022 ఏడాదిలో టీమిండియా క్రికెట్ ముగిసింది. సౌతాఫ్రికా టూర్తో మొదలైన 2022 ఏడాది, బంగ్లాదేశ్ టూర్తో ముగిసింది. ఈ ఏడాది టీమిండియాకి ఏదీ కలిసి రాలేదు. గత ఏడాది చివర్లో వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించడంతో మొదలైన చిచ్చు, ఈ ఏడాది మొత్తం కొనసాగింది...

సెంచూరియన్లో టెస్టు మ్యాచ్ గెలిచి, గత ఏడాదిని ఘనంగా ముగించింది భారత జట్టు. అయితే సౌతాఫ్రికా టూర్లో వన్డే సిరీస్కి రోహిత్ని కెప్టెన్గా ప్రకటించడం, టీమిండియాలో చిచ్చు రేపింది. బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో మనస్థాపం చెందిన విరాట్ కోహ్లీ, జోహన్బర్గ్ టెస్టుకి దూరంగా ఉన్నాడు...
కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో రెండో టెస్టు ఆడిన భారత జట్టు, జోహన్బర్గ్లో మొట్టమొదటి టెస్టు పరాజయాన్ని చవిచూసింది. ఈ ఏడాదిలో టీమిండియా ఆడిన మొట్టమొదటి మ్యాచ్ ఇదే. ఆ తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో కేప్టౌన్ టెస్టు ఆడడం, అందులో ఓడడం... విరాట్ టెస్టు కెప్టెన్సీకి కూడా రాజీనామా ఇవ్వడం జరిగిపోయాయి...
సౌతాఫ్రికా టూర్లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో వన్డే సిరీస్ ఆడి 3-0 తేడాతో వైట్ వాష్ అయ్యింది భారత జట్టు. సఫారీ టూర్ తర్వాత స్వదేశంలో శ్రీలంక, వెస్టిండీస్లతో జరిగిన సిరీస్లకు కెప్టెన్సీ చేశాడు రోహిత్ శర్మ. ఈ సిరీసుల్లో ఘన విజయాలు అందుకున్నాడు...
నెల రోజుల గ్యాప్లో టీమిండియా ముగ్గురు కెప్టెన్లను చూసింది. ఆ తర్వాత రోహిత్ శర్మ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతూ ఉండడం, సిరీస్కో కెప్టెన్ని మారుస్తూ ఉండడం జరిగిపోయాయి. 12 నెలల గ్యాప్లో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్, శిఖర్ ధావన్... ఇలా ఏడుగురు కెప్టెన్లను మార్చింది బీసీసీఐ...
స్వదేశంలో వరుసగా ద్వైపాక్షిక సిరీసులు గెలుస్తూ వచ్చిన భారత జట్టు, ఆసియా కప్ 2022 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగింది. అయితే సూపర్ 4 రౌండ్లో పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడి ఫైనల్ కూడా చేరలేకపోయింది టీమిండియా...
India vs Pakistan
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్గా నిలిచిన భారత జట్టు, సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏడాది గ్యాప్లో టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో రెండోసారి 10 వికెట్ల తేడాతో ఓడింది భారత జట్టు...
టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్లో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు, రోహిత్ శర్మ కెప్టెన్సీలో బంగ్లాదేశ్లో వన్డే సిరీస్ని చేజార్చుకుంది. ఈ ఏడాది 7 టెస్టు మ్యాచులు ఆడిన టీమిండియా.. 4 విజయాలు అందుకుని, 3 పరాజయాలు చవిచూసింది. బంగ్లాదేశ్తో గెలిచిన రెండు టెస్టులు మినహా ఇస్తే, స్వదేశంలో శ్రీలంకపై 2 టెస్టులు గెలిచింది టీమిండియా...
ద్వైపాక్షిక టీ20 సిరీసుల్లో మంచి ప్రదర్శన ఇచ్చినా వన్డే సిరీసుల విషయానికి వచ్చేసరికి ఓటమితో మొదలెట్టి ఓటమితోనే ముగించింది. అంతేకాకుండా ఈ ఏడాది ఆరంభంలో విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ తప్పించి, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...
Image credit: PTI
విరాట్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన కొన్ని రోజులకే సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్ష పదవిని కోల్పోవాల్సి వచ్చింది. విరాట్పై వేటు వేయడానికి ప్రధాన కారణంగా నిలిచిన ఛేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీపై వేటు వేసింది బీసీసీఐ...
Jasprit Bumrah
అన్నింటికీ మించి ఈ ఏడాది ఆటగాళ్ల గాయాలు టీమిండియా తీవ్రంగా వెంటాడాయి. రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, దీపక్ చాహార్... ఇలా సగానికి పైగా ప్లేయర్లు మెజారిటీ మ్యాచుల్లో గాయాలతో జట్టుకి దూరమయ్యారు.
గత రెండేళ్లుగా ఫెయిల్ అయిన విరాట్ కోహ్లీ ఫామ్లో రావడం, ఛతేశ్వర్ పూజారా టీమ్లోకి రీఎంట్రీ ఇచ్చి సెంచరీ చేయడం, సూర్యకుమార్ యాదవ్ రికార్డు లెవెల్లో పరుగులు చేయడం, టెస్టుల్లో రిషబ్ పంత్ తన ఫామ్ని కొనసాగించడం, ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ వంటి విషయాలు అభిమానులకు సంతోషాన్ని నింపాయి.
అనవసర వివాదాలు, కెప్టెన్ల మార్పులు, ఘోర ఓటములతో 2022 ఏడాదిలో టీమిండియాకి పెద్దగా ఏదీ కలిసి రాలేదు. మొత్తానికి ఈ ఏడాది టీమిండియా పంచాంగం ఏడుగురు కెప్టెన్లు, 4 అవమానాలు, రెండు విజయాలు, లెక్కకుమించి గాయాలు, ఓటములతో సాగింది..