ఐపీఎల్ 2021 మినీ వేలంలో 1094 మంది క్రికెటర్లు... పూజారా, అర్జున్ టెండూల్కర్తో సహా...
ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో 1094 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి బయటికి వచ్చిన ఆటగాళ్ల దరఖాస్తులు విపరీతంగా పెరిగాయి. మినీ వేలంలో పాల్గొనేవారిలో 814 మంది స్వదేశీ క్రికెటర్లు కాగా, 15 దేశాలకు చెందిన 283 మంది విదేశీ ప్లేయర్లు 2021 ఐపీఎల్ సీజన్ వేలంలో పాల్గొనబోతున్నారు...
ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా జరగనున్న ఐపీఎల్ 2021 మినీ వేలం మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానుంది. ప్రస్తుతం 8 ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో కలిపి కేవలం 61 స్లాట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి... అంటే ఒక్కో ప్లేస్ కోసం దాదాపు 18 మంది వేలంలో పోటీపడబోతున్నారు...
భారత టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా కూడా ఈసారి మినీ వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. ఇంతకుముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడిన ఛతేశ్వర్ పూజారా... 30 ఐపీఎల్ మ్యాచుల్లో 390 పరుగులు చేశాడు. చివరగా 2014లో బరిలో దిగిన పూజారా... బేస్ ప్రైజ్ రూ.50 లక్షలు. టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ను ఏ జట్టు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుందో అనేది ఆసక్తికరంగా మారింది...
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నెం.1 స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలాన్ కూడా ఐపీఎల్ 2021 మినీ వేలానికి రిజిస్టర్ చేయించుకున్నాడు. డేవిడ్ మలాన్ బేస్ ప్రైజ్ రూ. కోటీ 50 లక్షలు. 2021 ఐపీఎల్ వేలంలో డేవిడ్ మలాన్ అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్గా నిలిచే అవకాశం ఎక్కువగానే ఉంది...
ఏడేళ్ల బ్యాన్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన భారత క్రికెటర్ శ్రీశాంత్ కూడా ఐపీఎల్ 2021 మినీ వేలానికి రిజిస్టర్ చేయించుకున్నాడు. అతని బేస్ ప్రైజ్ రూ.75 లక్షలు. రీఎంట్రీ తర్వాత సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ఆడిన శ్రీశాంత్ను కొన్ని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు సంప్రదించాయని చెప్పుకొచ్చాడు...
ఏడాది నిషేధం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన బంగ్లా స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఐపీఎల్ 2021 మినీ వేలంలో పాల్గొనబోతున్నాడు. షకీల్ అల్ హసన్ బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు. కొత్తగా లిస్టులో చేరిన ప్లేయర్లలో అత్యధిక బేస్ ప్రైజ్ కలిగిన ప్లేయర్ షకీబ్ అల్ హసన్.
వీరితో పాటు కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్, గ్లెన్ మ్యాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మొయిన్ ఆలీ, సామ్ బిల్లింగ్స్, లియమ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్, కోలిన్ ఇన్గ్రామ్ బేస్ ప్రైజ్ కూడా 2 కోట్ల రూపాయలు. వీరిలో కేదార్ జాదవ్ని ఇంత మొత్తానికి ఏ జట్టు కొనుగోలు చేయడానికి ఇష్టపడకపోవచ్చు.
ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, ఇంగ్లాండ్ ప్లేయర్ హారీ గుర్రే ఐపీఎల్ 2021 సీజన్లో పాల్గొనడం లేదు. వీరితో పాటు గత ఏడాది కేకేఆర్ తరుపున ఆడి, ఎక్కువ మ్యాచుల్లో రిజర్వు బెంచ్కే పరిమితమైన టాప్ బాంటన్ కూడా ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్నాడు. 2020 సీజన్లో రెండు మ్యాచులు మాత్రమే ఆడి 18 పరుగులు చేసిన టామ్ బాంటన్ను 2021 మినీ వేలానికి విడుదల చేసింది కేకేఆర్.
ముజీబ్ వుర్ రెహ్మాన్, అలెక్స్ క్యారీ, నాథన్ కౌంటర్ నీల్, జో రిచర్డ్సన్, మిచెల్ స్వీప్సన్, టామ్ కుర్రాన్, లూయిస్ గ్రేగోరీ, అలెక్స్ క్యారీ, ఆడమ్ లిత్, అదిల్ రషీద్, డేవిడ్ విల్లీ బేస్ ప్రైజ్ రూ.కోటిన్నర... వీరిలో చాలామంది బీబీఎల్10 సీజన్లో అదరగొట్టడంతో ఐపీఎల్లో మంచి ధర దక్కించుకునే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా టెస్టు స్పెషలిస్ట్ యంగ్ ప్లేయర్ మార్కస్ లబుషేన్ కూడా ఐపీఎల్ 2021 సీజన్కి రిజిస్టర్ చేయించుకున్నాడు. లబుషేన్ బేస్ ప్రైజ్ రూ.1 కోటి. అతనితో పాటు ఆరోన్ ఫించ్, ఉమేశ్ యాదవ్, హనుమ విహరి, షెల్డన్ కాంట్రెల్ రూ.కోటి బేస్ ప్రైజ్ కలిగిన ప్లేయర్ల జాబితాలో ఉన్నారు.
సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలానికి రిజిస్టర్ చేయించుకున్నాడు. అర్జున్ టెండూల్కర్ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు. ఏ ఫ్రాంచైజీ కొన్నా కొనకపోయినా సచిన్ సొంత జట్టులాంటి ముంబై ఇండియన్స్లోకి అర్జున్ టెండూల్కర్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. వేరే జట్టు అర్జున్ కోసం పోటీపడితే, బుల్లి టెండూల్కర్కి కోట్లలో ధర పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు...
టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ బాదిన బ్యాట్స్మెన్ కరణ్ నాయర్తో పాటు శివమ్ దూబే, వరుణ్ అరోన్ బేస్ ప్రైజ్ రూ.50 లక్షల జాబితాలో ఉన్నారు. వీరితో పాటు సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో 5 వికెట్లు తీసిన 41 ఏళ్ల శాంతమూర్తి కూడా ఐపీఎల్ 2021 మినీ వేలంలో పాల్గొనబోతున్నాడు...
16 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ లకన్వాలా... ఐపీఎల్ 2021 సీజన్లో పాల్గొంటున్న అతి పిన్న వయస్కుడు. ఇతని బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు. అత్యధికంగా వెస్టిండీస్ నుంచి 56 మంది ప్లేయర్లు ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో పాల్గొంటున్నారు.
ఆస్ట్రేలియా నుంచి 42 మంది, సౌతాఫ్రికా నుంచి 38 మంది, శ్రీలంక నుంచి 31, ఆఫ్ఘనిస్థాన్ 30, న్యూజిలాండ్ 29, ఇంగ్లాండ్ 21, బంగ్లాదేశ్ 5, జింబాబ్వే నుంచి ఇద్దరు ఐపీఎల్ 2021 మినీ వేలంలో పాల్గొంటున్నారు. వీరితో పాటు అసోసియేట్ దేశాలైన నేపాల్ 8, నెదర్లాండ్స్ 1, ఐర్లాండ్ 2, స్కాట్లాండ్ 7, యూఏఈ 9, యూఎస్ఏ నుంచి ఇద్దరు ఐపీఎల్ వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.