Retirement Age: ఆ ఉద్యోగులకు బంపరాఫర్.. రిటైర్మెంట్ ఏజ్ 65 ఏళ్లకు పెంపు
ప్రముఖ సంస్థ తమ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. రిటైర్మైంట్ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు 65 ఏళ్ల వరకు ఉద్యోగంలో ఉండొచ్చు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిరిండియాలో రిటైర్మెంట్ వయస్సు పెంపు
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా సంస్థలో పైలట్లు, నాన్-ఫ్లయింగ్ సిబ్బందికి రిటైర్మెంట్ వయస్సు పెంచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు పైలట్లు, ఇతర సిబ్బంది 58 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసేవారు. అయితే తాజా నిర్ణయంతో పైలట్లకు గరిష్ట వయస్సు 65 ఏళ్లు, నాన్-ఫ్లయింగ్ సిబ్బందికి 60 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ విషయాన్ని ఎయిరిండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్బెల్ విల్సన్ ఉద్యోగుల టౌన్హాల్ సమావేశంలో వెల్లడించారు.
KNOW
వారికి కూడా వర్తిస్తుందా.?
ప్రస్తుతం ఎయిరిండియాలో సుమారు 24,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 3,600 పైలట్లు, 9,500 కేబిన్ క్రూ సిబ్బంది ఉండగా, మిగతా వారు గ్రౌండ్ సపోర్ట్ విభాగాల్లో ఉన్నారు. అయితే కేబిన్ క్రూ సిబ్బందికి ఈ వయస్సు పెంపు వర్తిస్తుందా అనే అంశంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
విస్తారా విలీనంతో వచ్చిన మార్పులు
ఈ నిర్ణయానికి పునాది 2024 నవంబర్లో విస్తారా ఎయిర్లైన్స్ ఎయిరిండియాలో విలీనం కావడంతో పడింది. విస్తారాలో అప్పటికే పైలట్ల రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లు, నాన్-ఫ్లయింగ్ సిబ్బంది 60 ఏళ్లుగా ఉండేది. ఒకే సంస్థ కింద పని చేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సులో తేడా అన్యాయమని కొంతమంది పైలట్లు ఆ సమయంలో అభిప్రాయపడ్డారు.
అనుభవజ్ఞుల సేవల అవసరం
ఇటీవల అనేక అనుభవం కలిగిన పైలట్లు, కేబిన్ క్రూ సభ్యులు ఉద్యోగాలు వదిలి వెళ్లడం సంస్థకు సవాలుగా మారింది. పైలట్ల వయస్సు పరిమితిని పెంచడం ద్వారా అనుభవజ్ఞులైన మానవ వనరులను నిలుపుకోవచ్చు. ఇది భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిర్దేశించిన వాణిజ్య పైలట్ల గరిష్ట వయస్సుతో (65 ఏళ్లు) సరిపోతుంది.
వ్యూహాత్మక లాభాలు
ఈ చర్యతో పైలట్ల కొరతను తగ్గించడమే కాకుండా, కొత్త పైలట్ల శిక్షణపై ఖర్చు, సమయం ఆదా అవుతుందని, అనుభవం, నైపుణ్యం, భద్రతా ప్రమాణాలు నిలుపుకోవడంలో ఈ నిర్ణయం కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఎయిరిండియా దీన్ని తమ భవిష్యత్తు వృద్ధి వ్యూహంలో భాగంగా చూస్తోంది.