బిగ్ డీల్ : జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ విలీనం.. కంపెనీ ఎండి & సిఈఓగా..
వినోద రంగంలో ఒక పెద్ద విలీన ఒప్పందం చోటు చేసుకుంది. తాజాగా జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEE entertainment) సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాలో(SONY pictures) విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విలీనానికి జీ ఎంటర్టైన్మెంట్ బోర్డ్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంటే జీ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు సోనీ పిక్చర్స్తో విలీనం అవుతుంది.
విలీనం తర్వాత సోనీ 1.57 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ .11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుందని, అలాగే 52.93 శాతం వాటాను కలిగి ఉంటుందని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలియజేసింది. మరోవైపు, జీ లిమిటెడ్ వాటాదారులు 47.07 శాతం వాటాను కలిగి ఉంటారు.
మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఈఓగా పునీత్ గోయెంకా
పునీత్ గోయెంకా ఇప్పుడు విలీన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈఓ) గా కొనసాగుతారు. రెండు కంపెనీల టీవీ వ్యాపారం, డిజిటల్ ఆస్తులు, ఉత్పత్తి కార్యకలాపాలు, ప్రోగ్రామ్ లైబ్రరీ కూడా విలీనం చేయబడతాయి. రాబోయే 90 రోజుల్లో ఈ డీల్ పూర్తవుతుంది. ప్రస్తుతం ఉన్న ప్రమోటర్ ఫ్యామిలీ జి వాటాను 4 శాతం నుండి 20 శాతానికి పెంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటుంది.
ఈ ఒప్పందంలో భాగంగా లీనియర్ నెట్వర్క్లు, డిజిటల్ ఆస్తులు, ఉత్పత్తి కార్యకలాపాలు, ప్రోగ్రామ్ లైబ్రరీలను కలపడానికి రెండు కంపెనీలు అంగీకరించాయి. జీ బోర్డు "డీల్ కోసం ఆర్థిక పారామితులను మాత్రమే కాకుండా, కొత్త భాగస్వామి ఎంట్రీ నుండి వచ్చే వ్యూహాత్మక విలువను కూడా అంచనా వేసింది" అని తెలిపింది.
జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్లో బలమైన జంప్
విలీన వార్తాతో నేడు షేర్ మార్కెట్లో జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ వృద్ధి చెందుతోంది. ఈ రోజు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ 281.20 స్థాయిలో ప్రారంభమైంది. ఉదయం 10.11 గంటలకు 62.10 పాయింట్ల (24.29 శాతం) బలమైన జంప్తో 317.75 స్థాయికి చేరుకుంది. నిన్న జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ 255.65 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .29972.89 కోట్లు.
"జెడ్ఈఈఎల్ లో డైరెక్టర్ల బోర్డు ఎస్పిఎన్ఐ, జెడ్ఈఈఎల్ ల మధ్య విలీన ప్రతిపాదనపై వ్యూహాత్మక సమీక్షను నిర్వహించింది. విభిన్న రంగాలలో గొప్ప నైపుణ్యం కలిగిన అత్యంత నిష్ణాతులైన నిపుణుల సమ్మేళనాన్ని కలిగి ఉన్న బోర్డుగా మేము ఎల్లప్పుడూ వాటాదారులు, కంపెనీ ఉత్తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుతాము. మేము ఏకగ్రీవంగా ప్రతిపాదనకు ఇన్-ప్రిన్సిపల్ ఆమోదాన్ని అందించాము, తగిన ప్రక్రియను ప్రారంభించాలని నిర్వహణకు సూచించాము. ఈ విలీనం కంపెనీకి మరింత ప్రయోజనం చేకూరుస్తుందని బోర్డు దృఢంగా విశ్వసిస్తుంది. " అని జి ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఛైర్మన్ ఆర్.గోపాలన్ అన్నారు.