Gold Price Hike: ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..రూ.3 వేలు పెరిగి షాక్ ఇచ్చిన పసిడి
Gold Price Hike: బంగారం ఒక్కసారిగా భారీ బాంబ్ పేల్చింది. ధరలు ఊహించని రీతిలో తారాజువ్వలా దూసుకుపోయాయి. రూ.లక్షా యాభైవేలకు చేరడంతో చూసి పసిడి ప్రియుల గుండె గుబేల్మంటోంది. ఇక తగ్గడం కష్టమే అంటున్నారు నిపుణులు.

రూ.3 వేలు పెరిగి షాక్ ఇచ్చిన పసిడి
దేశంలో బంగారం ధరలు మళ్లీ బిగ్ షాకిచ్చాయి. ఈ మధ్య కొంచెం కొంచెంగా పెరిగి ఈసారిగా ఏకంగా దాదాపు రూ.3వేలు పెరిగిపోయింది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు ఇప్పుడు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలోని అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలను మరింత పైకి తీసుకెళ్తున్నాయి. ఇక రూ.1.50 లక్షల మార్క్ను కూడా చేరిపోయింది.
రూ.1,49,730కు చేరిన తులం బంగారం
ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,890 పెరిగి రూ.1,49,730కు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,650 పెరిగి రూ.1,37,250 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరు, కోల్కతా, తిరువనంతపురం వంటి నగరాల్లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ధరలకు అదనంగా జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుందని జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు కిలో వెండి ధర రూ.2.40 లక్షల వద్ద కొనసాగుతోంది.
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ మాటల యుద్ధం
బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలను మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ డిమాండ్ పెరిగి, దాని ప్రభావం దేశీయ ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఇరాన్కు ట్రంప్ వార్నింగ్
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి కఠిన హెచ్చరికలు చేశారు. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని, పరిస్థితి మరింత దిగజారితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఆ దేశం చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని కూడా వ్యాఖ్యానించారు. అణ్వాయుధాల అభివృద్ధికి అమెరికా ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబోదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
చర్చలు జరుగుతున్నాయి: ఇరాన్
మరోవైపు హర్మూజ్ జలసంధికి సంబంధించిన అంశాలపై ఇరాన్, ఒమన్తో చర్చలు జరుగుతున్నాయని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాయి. అయితే అమెరికా ఈ చర్చల్లో భాగస్వామి కాదని, సముద్ర రవాణా భద్రతకు సంబంధించిన అంశాలపైనే తమ చర్చలు జరుగుతున్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో ప్రాంతీయ పరిస్థితులపై మరింత ఉత్కంఠ నెలకొంది.
ప్రపంచ మార్కెట్లో ఉద్రిక్తతలు తగ్గే వరకు బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్, పెట్టుబడి డిమాండ్, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కలిసి బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు రోజువారీ ధరల మార్పులను గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

