UPI: ఫోన్పేలో ఎక్కువ సార్లు బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.? మారనున్న నిబంధనలు..
దేశంలో యూపీఐ సేవలు భారీగా విస్తరిస్తున్నాయి. ప్రతీ చిన్న లావాదేవీకి ఫోన్పే, గూగుల్పేలను ఉపయోగిస్తున్నారు. తాజాగా యూపీఐ పేమెంట్స్ సేవల్లో నిబంధనలను సవరించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

కొత్త పరిమితులు
యూపీఐ ఆధారిత చెల్లింపులు మన జీవితంలో భాగమయ్యాయి. ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా లావాదేవీలు పెరిగిపోయాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా తీసుకున్న కీలక నిర్ణయాలతో బ్యాలెన్స్ చెక్ విధానంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు
NPCI ప్రకారం, ఈ మార్పులు ఆగస్టు 1, 2025 నుంచి అమలులోకి వస్తాయి. యూపీఐ నెట్వర్క్పై భారం తగ్గించే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నిరంతర సేవలు అందించనున్నారు. దీంతో ఇకపై యూజర్లు రోజు మొత్తంలో బ్యాలెన్స్ చెక్ చేసే ప్రక్రియపై కొన్ని పరిమితులు విధించనున్నారు.
రోజుకి గరిష్టంగా 50 సార్లు మాత్రమే
కొత్త నిబంధనల ప్రకారం, మీరు రోజులో గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలరు. ఒకటి కంటే ఎక్కువ యూపీఐ యాప్లను ఉపయోగిస్తున్నవారైతే (ఉదాహరణకు: ఫోన్పే + గూగుల్ పే), ఒక్కో యాప్లో 50 సార్లు చొప్పున అంటే మొత్తం 100 సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
అలానే, ప్రతీ లావాదేవీ అనంతరం బ్యాంకులు ఖాతా బ్యాలెన్స్ను యూజర్కి తెలియజేయాల్సిందిగా NPCI స్పష్టంగా ఆదేశించింది. దీని వల్ల తరచూ బ్యాలెన్స్ చెక్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది.
API లావాదేవీలకు పీక్ అవర్స్ పరిమితులు
యూపీఐలో బ్యాక్ఎండ్లో జరిగే API లావాదేవీలు (ఆటోమెటెడ్ సర్వీసులు, బ్యాంకింగ్ అప్లికేషన్లు మొదలైనవి)పై కూడా కొత్త పరిమితులు అమలుకానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు API ట్రాన్సాక్షన్స్ చేయాలంటే వినియోగదారుల అనుమతి అవసరం అవుతుంది. ఈ సమయాల్లో సిస్టమ్ ఇనిషియేటెడ్ కాల్స్ తగ్గించాలని సూచించారు.
ఆటోపేమెంట్స్కి రద్దీ లేని సమయాల్లో ప్రాసెసింగ్
SIP లావాదేవీలు, ఓటీటీ చెల్లింపులు, తదితర ఆటోమెటెడ్ పేమెంట్లు ఇకపై పీక్ టైమ్లో కాకుండా ఇతర సమయాల్లో ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీరు సాయంత్రం ఆటోపేమెంట్ సెట్ చేసినా అది ప్రాసెస్ అయ్యేది రద్దీ లేని సమయంలోనే. ఇది నెట్వర్క్ ట్రాఫిక్ను సమర్థంగా నిర్వహించేందుకు తీసుకున్న కీలక చర్య.
యూజర్లకు ఉపయోగం ఏంటి.?
ఈ మార్పులు డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచడమే కాకుండా, వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు దోహదపడతాయి. వినియోగదారులు తమ యాప్లు, బ్యాంకింగ్ అలర్ట్స్ సరిగా పనిచేస్తున్నాయో చూసుకోవాలి. ముఖ్యంగా, అవసరానికి మించిన బ్యాలెన్స్ చెక్ చేయకుండా ఉండటం మంచిది.