Savings Schemes: రూ.1 లక్ష పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో ఎంత వస్తుంది? ఏ పథకంలో ఎంతంటే.?
Savings Schemes: కష్టపడి సంపాదించిన డబ్బును పొదుపు చేయాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఏ పథకంలో పొదుపు చేస్తే ఎక్కువ లాభం వస్తుందన్న విషయం తెలియదు. మరి రూ. 1 లక్ష పెట్టుబడిపై 5 ఏళ్లలో ఏ పథకంలో ఎంత రాబడి వస్తుందో చూద్దాం.

రూ.1 లక్ష పెట్టుబడిపై 5 ఏళ్లలో ఎంత రాబడి?
ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం రూ.1 లక్షను ఒకేసారి పెట్టుబడిగా పెడితే ఐదేళ్ల తర్వాత వచ్చే అంచనా రాబడి ఇలా ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజనలో 8.2 శాతం వడ్డీ ప్రకారం దాదాపు రూ.48,300 వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో కూడా 8.2 శాతం వడ్డీ ఉన్నప్పటికీ, ఇందులో వడ్డీని త్రైమాసికాల వారీగా చెల్లిస్తారు. ఐదేళ్లలో మొత్తం సుమారు రూ.41,000 వరకు వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)లో 7.7 శాతం వడ్డీ ప్రకారం రూ.1 లక్ష పెట్టుబడి ఐదేళ్లకు సుమారు రూ.1,44,900కు చేరుతుంది. అంటే దాదాపు రూ.44,900 వడ్డీ లభిస్తుంది. కిసాన్ వికాస్ పత్ర (KVP)లో 7.5 శాతం వడ్డీ ప్రకారం సుమారు రూ.43,560 వడ్డీ వస్తుంది. పోస్టాఫీస్ 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్ (FD)లో కూడా 7.5 శాతం వడ్డీతో కంపౌండింగ్ ప్రయోజనం కారణంగా దాదాపు రూ.44,990 వరకు వడ్డీ పొందవచ్చు.
PPF, పోస్టాఫీస్ పథకాలలో ఎంత లాభం?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ కొనసాగుతోంది. ఈ రేటు ప్రకారం రూ.1 లక్ష పెట్టుబడి ఐదేళ్ల తర్వాత సుమారు రూ.1,40,900కు పెరుగుతుంది. అంటే దాదాపు రూ.40,900 వడ్డీ లభిస్తుంది.
పోస్టాఫీస్ 3 సంవత్సరాల టైమ్ డిపాజిట్పై కూడా 7.1 శాతం వడ్డీ ఉంది. అదే విధంగా 2 సంవత్సరాల టైమ్ డిపాజిట్పై 7 శాతం, 1 సంవత్సరం టైమ్ డిపాజిట్పై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ రేట్ల ప్రకారం ఐదేళ్ల కాలానికి అంచనా వేస్తే వరుసగా సుమారు రూ.40,900, రూ.40,250, రూ.39,600 వరకు వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS)లో 7.4 శాతం వడ్డీతో ప్రతి నెలా ఆదాయం లభిస్తుంది. ఐదేళ్లలో మొత్తం సుమారు రూ.37,000 వరకు వడ్డీ వస్తుంది. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD)లో 6.7 శాతం వడ్డీతో ఐదేళ్లలో సుమారు రూ.38,300 వరకు రాబడి లభించవచ్చు.
ఈ ప్రభుత్వ పథకాల ప్రత్యేకత ఏంటి?
ఈ చిన్న పొదుపు పథకాలన్నింటికీ కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. అందువల్ల పెట్టుబడిపై ఎలాంటి రిస్క్ ఉండదు. స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు వచ్చినా ఈ పథకాలపై ప్రభావం ఉండదు. పెట్టుబడి చేసిన మొత్తం, వడ్డీ రెండూ సురక్షితంగా ఉంటాయి. అలాగే సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి పథకాలలో పెట్టుబడి పెడితే ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందే అవకాశం ఉంది. అందుకే దీర్ఘకాలిక పొదుపు చేయాలనుకునే వారు ఈ పథకాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
వడ్డీ రేట్లను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది?
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. ప్రభుత్వ బాండ్లపై లభిస్తున్న యీల్డ్, బ్యాంకుల వడ్డీ రేట్లు, దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే కొత్త వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది.

