జియో నుంచి 'సౌండ్ పే' ఫీచర్.. దీని ఉపయోగం ఏంటో తెలుసా?
యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న జియో తాజాగా 'జియో సౌండ్ పే' పేరుతో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఏంటీ ఫీచర్.? ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం..

టెలికం రంగంలో జియో ఒక సంచలనమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జియో రాకతో టెలికం రంగం రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. మొబైల్ నెట్ వర్క్ మొదలు, ఫైబర్ వరకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన జియో మార్కెట్లో పోటీనిచ్చింది. జియో భారత్ ఫోన్ పేరుతో తక్కువ బడ్జెట్లో అన్ని రకాల ఫీచర్లను కోరుకునే వారి కోసం ఫోన్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫోన్లో సూపర్ ఫీచర్ను ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం ఈ చిన్న దుకాణానికి వెళ్లినా అక్కడే ఫోన్పే, పేటీఎంకు చెందిన సౌండ్ బాక్స్లు కనిపిస్తున్నాయి. ఎవరైనే పేమెంట్ చేయగానే అమౌంట్ వచ్చిన విషయాన్ని తెలియజేస్తాయి ఈ బాక్స్లు. యూపీఐ పేమెంట్స్లో కచ్చితత్వం కోసం ఈ సౌండ్ బాక్స్లు ఉపయోగపడతాయి. అయితే వీటిని ఉపయోగించుకోవాలంటే కస్టమర్లు ప్రతీ నెలా రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూపాయి కూడా చెల్లించకుండా ఈ సేవలను అందించేందుకు జియో ముందుకొచ్చింది.
జియో భారత్ ఫోన్లలో జియో సౌండ్ పే పేరుతో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్తో యూజర్లు తమ ఫోన్లోనే పేమెంట్ రిసీవ్కు సంబంధించిన మెసేజ్ను వినొచ్చు. అయితే జియో ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందించడం విశేషం. అంతేకాకుండా తాము ఎంచుకున్న భాషలో వినే అవకాశాన్ని జియో కల్పించింది. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయమై జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ సునీల్ మాట్లాడుతూ.. 'టెక్నాలజీని మరింత అందిపుచ్చుకుంటూ ప్రతి భారతీయుడి సాధికారతే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నాం' అని చెప్పుకొచ్చారు.
జియో సౌండ్ పే ఫీచర్తో ఎలాంటి సౌండ్ బాక్సులు అవసరం లేకుండానే ఫోన్లోనే కన్ఫర్మేషన్ మెసేజ్ వినొచ్చు. ఈ ఫీచర్ సహాయంతో వ్యాపారులకు ఏడాదికి రూ. 1500 వరకు ఆదా అవుతుందని జియో తెలిపింది. ఇదిలా ఉంటే 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జియోసౌండ్పేలో "వందేమాతరం" ఆధునిక సంస్కరణలను కూడా ప్రారంభించింది. దీంతో యూజర్లు మైజియో యాప్ లేదా జియో సావన్ ద్వారా ఈ రెండిషన్లను వారి జియోట్యూన్లుగా సెట్ చేసుకోవచ్చు.