ఆర్బీఐ నిబంధనల్లో మార్పులు.. గడువు తీరినా డిపాజిట్ తీసుకోకపోతే తక్కువ రేటు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా మిగిలి ఉన్న డిపాజిట్లకు వర్తించే వడ్డీరేట్లపై నిబంధనలను సవరించింది. డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ శుక్రవారం ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అలాగే అన్ని బ్యాంకులకు ఈ సవరణ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం టర్మ్ డిపాజిట్లను కాల వ్యవధి ముగిసిన తర్వాత కూడా డిపాజిటర్ వెనక్కి తీసుకోకపోతే తర్వాత నుంచి ఆ మొత్తంపై సేవింగ్స్ డిపాజిట్ రేటు అమలవుతోంది అయితే ఇక మీదట అలా ఉండదు.‘‘టర్మ్ డిపాజిట్ గడువు తీరిన క్లెయిమ్ చేసుకోకుండా బ్యాంకులోనే ఉండిపోతే ఆ మొత్తంపై సేవింగ్స్ ఖాతా రేటు లేదా టర్మ్ డిపాజిట్ ఒప్పంద రేటు ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది అమలవుతుంది’’ అంటూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని వాణిజ్య బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులకు ఈ కొత్త ఆదేశాలు వర్తిస్తాయి.
టర్మ్ డిపాజిట్ అనేది ఒక నిర్దిష్ట కాలానికి బ్యాంక్ అందుకున్న వడ్డీ డిపాజిట్ను సూచిస్తుంది. ఇందులో రీకరింగ్, కుములేటివ్, యాన్యుటీ, రీఇన్వెస్ట్మెంట్ డిపాజిట్లు, నగదు ధృవీకరణ పత్రాలు కూడా ఉన్నాయి.