దసరా పండగ తెల్లారే షాక్.. రోజురోజుకి ఆకాశానికి పెట్రోల్, డీజిల్ ధరలు..
ఇంధన ధరలు పెంపు కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజూ కూడా శనివారం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ఇంధన ధరలు నేడు లీటర్కు 35 పైసలకు పైగా పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు 18 సార్లు పెరగ్గా పెట్రోల్ ధరలు 15 సార్లు సవరించారు.
తాజాగా భారతీయ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలు దసరా పండుగ మరుసటి రోజు శనివారం పెట్రోల్ ధరపై 36 పైసలు, డీజిల్ ధర పై 38 పైసలు పెరిగాయి. అక్టోబర్ నెలలో పెట్రోల్ ధర రూ. 3.85 పెరిగగా డీజిల్ ధరలు రూ .4 పైగా పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్లో అక్టోబర్ 16, శనివారం రోజున లీటర్ డీజిల్ ధర రూ. 102.80, పెట్రోల్ ధర రూ.109.73కు చేరుకుంది.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 105.49 కి చేరుకుంది, ముంబైలో అత్యధికంగా లీటరుకు రూ. 111.43 గా ఉంది. ముంబైలో డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు రూ.102.15కి, ఢిల్లీలో ధర . 94.22 చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు రూ.109,73, డీజెల్ ధర లీటరు రూ.102,80గా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజల జీవితాన్ని కష్టతరం చేస్తున్నాయి.
నగరం పెట్రోల్ డీజిల్
ఢిల్లీ 105.49 94.22
ముంబై 111.43 102.15
కోల్కతా 106.10 97.33
చెన్నై 102.70 98.59
దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే లీటరుకు రూ.100దాటింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్తో సహా చాలా రాష్ట్రాల్లో డీజిల్ ధరలు కూడా సెంచరీకి చేరువలో ఉన్నాయి. అయితే స్థానిక పన్నుల బట్టి ధరలు రాష్ట్రం నుండి రాష్ట్రానికి భిన్నంగా ఉంటాయి.
ఇంతకుముందు మే 4 నుండి జూలై 17 మధ్య పెట్రోల్ ధర లీటరుకు రూ.11.44 పెరగగా, డీజిల్ ధర రూ. 9.14 పెరిగింది. అంతర్జాతీయ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఏడు సంవత్సరాలలో మొదటిసారిగా బ్యారెల్కు $ 84.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక నెల క్రితం బ్రెంట్ $ 73.51 వద్ద ట్రేడైంది. దేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ సవరిస్తుంటారు.