ఆస్తుల పంపకంపై ముకేశ్ అంబానీ సీరియస్.. రిలయన్స్ సామ్రాజ్యం ఎవరి చేతుల్లోకి..
ఆసియా అత్యంత ధనవంతుడు, బిలియనీర్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్(reliance industries) అధినేత ముఖేష్ అంబానీ(mukesh ambani) తన సంపదను పంచడంపై సీరియస్ గా తీసుకున్నారు. ఒక నివేదిక ప్రకారం ఆస్తి విషయంలో కుమారులు, కుమార్తెల మధ్య ఎటువంటి వివాదాలు రాకుండా చూసేందుకు ముఖేష్ అంబానీ కొన్ని విధానాలను పరిశీలిస్తున్నారు.
దీని కోసం ముఖేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ధనవంతుల ఆస్తుల పంపిణీ విషయాలను పరిశీలించారు. అన్నింటికంటే అతను వాల్టన్ ఫ్యామిలీ(walton family) ఆస్తుల పంపిణీ విధానాన్ని ఉత్తమమైనదిగా పరిగణించారు.
ముఖేష్ అంబానీ సంపద
ముకేశ్ అంబానీ సంపద దాదాపు 208 బిలియన్ డాలర్లు. ఇంత భారీ సంపద పంపిణీ విషయంలో తన ముగ్గురు పిల్లల మధ్య ఎలాంటి వివాదం రాకుండా ఉండేలా చూసుకుంటున్నారు. 2002లో ధీరూభాయ్ అంబానీ (dhirubhai ambani)మరణానంతరం ఆస్తుల పంపకాల విషయంలో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య వివాదం తలెత్తడం గమనార్హం. కొన్నేళ్లుగా సాగిన ఈ వివాదంలో అతని తల్లి ఆనందీబెన్ చివరకు ఇద్దరు సోదరులకు ఆస్తులను విభజించారు అలాగే వాటాదారుల వ్యతిరేకత ఉన్నప్పటికీ బాంబే హైకోర్టు ఆ విభజనను ఆమోదించింది.
వాల్టన్ ఫ్యామిలీ
నివేదిక ప్రకారం, 1992లో వాల్మార్ట్ ఇంక్. వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ (sam walton)మరణించిన తర్వాత ముఖేష్ అంబానీ అతని వ్యాపార విభజనను నిర్వహించే విధానాన్ని ఇష్టపడ్డారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటైన వాల్టన్ కుటుంబం 1988 నుండి కంపెనీ వ్యాపారాన్ని నిర్వాహకులకు అప్పగించింది అలాగే దానిని పర్యవేక్షించడానికి ఒక బోర్డును ఏర్పాటు చేసింది. సామ్ వాల్టన్ పెద్ద కుమారుడు రాబ్ వాల్టన్, అతని మేనల్లుడు వాల్మార్ట్ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. సామ్ వాల్టన్ మరణానికి 40 సంవత్సరాల ముందు 1953లో వారసత్వ ప్రణాళికపై పని చేయడం ప్రారంభించాడు. అతను తన కుటుంబ వ్యాపారంలో 80 శాతం తన నలుగురు పిల్లలకు ఇచ్చాడు.
అంబానీ సంపద ట్రస్టుకు బదిలీ
నివేదిక ప్రకారం, ముఖేష్ అంబానీ తన సంపదను ట్రస్ట్కు బదిలీ చేస్తారని భావిస్తున్నారు. ఈ ట్రస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంటుంది. ఇందులో ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ముగ్గురు పిల్లలు ఆకాష్, అనంత్, ఇషాలకు వాటా ఉంటుంది. అంటే, 64 ఏళ్ల భారతీయ వ్యాపారవేత్త ఇష్టమైన విధానం వాల్మార్ట్ ఇంక్ వాల్టన్ కుటుంబం అంశాలను అనుసరిస్తుంది. ముఖేష్ అంబానీకి చెందిన కొంతమంది ప్రత్యేక వ్యక్తులను ట్రస్ట్ సలహాదారుగా నియమించనున్నారు. బోర్డు నిర్వహణ బయటి నుంచి నియమితులైన నిపుణుల చేతుల్లోనే ఉంటుందని భావిస్తున్నారు.