- Home
- Business
- WhatsApp: ఇండియా డిజిటల్ మార్కెట్లో ప్రకంపనలు.. వాట్సాప్ చేతికి CRED.. అసలు మ్యాటర్ ఏంటి?
WhatsApp: ఇండియా డిజిటల్ మార్కెట్లో ప్రకంపనలు.. వాట్సాప్ చేతికి CRED.. అసలు మ్యాటర్ ఏంటి?
WhatsApp: మెటా సంస్థ క్రెడ్లో 900 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. క్రెడ్ ఫౌండర్ కునాల్ షా వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్నారని సమాచారం. అయితే, మార్క్ జూకర్ బర్గ్ సంస్థ మెటా ఏం ప్లాన్ చేస్తోంది? ఈ బిగ్ డీల్ అసలు మ్యాటర్ ఏంటి?

క్రెడ్లోకి మెటా ₹8,550 కోట్ల పెట్టుబడి: వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా ప్లాట్ఫార్మ్స్ ఇంక్ ఇండియాలో ఒక భారీ డీల్ కుదుర్చుకుంది. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిన్టెక్ స్టార్టప్ 'క్రెడ్' (CRED) లో మెటా ఏకంగా సుమారు ₹8,550 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో క్రెడ్ కంపెనీలో మెటాకు దాదాపు 20 శాతం మైనారిటీ వాటా దక్కనుంది.
ఈ డీల్ తర్వాత క్రెడ్ కంపెనీ మొత్తం విలువ సుమారు ₹38,000 కోట్లు చేరినట్లు అధికారిక ప్రెస్ నోట్ ద్వారా తెలిసింది. ఈ ఇన్వెస్ట్మెంట్తో పాటు మరో క్రేజీ అప్డేట్ ఏంటంటే.. క్రెడ్ ఫౌండర్ కునాల్ షా ఇప్పుడు వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటివరకు ఈ పొజిషన్లో ఉన్న విల్ క్యాథ్కార్ట్ స్థానంలో కునాల్ షా రానున్నారు.
వాట్సాప్ బాస్గా కునాల్ షా
క్రెడ్ కంపెనీని 2018లో కునాల్ షా స్టార్ట్ చేశారు. టైమ్కి క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టే కస్టమర్లకు రివార్డులు ఇచ్చే కాన్సెప్ట్తో వచ్చిన ఈ యాప్, ఆ తర్వాత లోన్లు, యూపీఐ పేమెంట్స్, రెంట్ పేమెంట్స్, బిల్ పేమెంట్స్, వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటూ చాలా స్పీడ్గా దూసుకెళ్లింది. ప్రస్తుతం క్రెడ్కు 1.7 కోట్ల మంది మెంబర్స్ ఉన్నారు. ఇండియాలో జరిగే మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్లుల పేమెంట్స్లో 40 శాతం కంటే ఎక్కువ క్రెడ్ యాప్ ద్వారానే జరుగుతున్నాయి.
అందుకే ఇది దేశంలోనే అత్యంత విలువైన ఫైనాన్షియల్ డేటా ప్లాట్ఫామ్గా మారింది. ఈ డీల్ ప్రకారం కునాల్ షా క్రెడ్ కంపెనీ రోజువారీ బాధ్యతల నుండి తప్పుకుని, కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్లో ఉన్న మెటా హెడ్క్వార్టర్స్కు షిఫ్ట్ అవుతారు. అక్కడ నుండి వాట్సాప్ను గ్లోబల్గా లీడ్ చేస్తారు.
మెటా అసలు ప్లాన్ ఏంటి?
మెటాకు ప్రపంచవ్యాప్తంగా ఇండియానే అతిపెద్ద మార్కెట్. ఇక్కడ వాట్సాప్కు 50 కోట్ల కంటే ఎక్కువ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా నెలకు 300 కోట్ల మంది యూజర్లను దాటేసింది. అయితే మెటా వాట్సాప్ను కేవలం ఒక మెసేజింగ్ యాప్లా ఉంచాలనుకోవడం లేదు. దీనిని బిజినెస్ మెసేజింగ్, డిజిటల్ కామర్స్, పేమెంట్స్ ప్లాట్ఫామ్గా మార్చాలని చూస్తోంది. ఇండియాలో యూపీఐ ఎకోసిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, తమ ప్లాన్ను టెస్ట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని మెటా భావిస్తోంది.
క్రెడ్ యూజర్లు అందరూ ఫైనాన్షియల్గా యాక్టివ్గా ఉండే హై-వాల్యూ కస్టమర్స్. మెటా తన వాట్సాప్ పే, రాబోయే కామర్స్ ఫీచర్స్ కోసం ఇలాంటి యూజర్లనే టార్గెట్ చేయాలని చూస్తోంది. పేమెంట్స్, మెసేజింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూడింటినీ కలిపి ఒకే సూపర్ యాప్గా మార్చడమే మెటా గేమ్ ప్లాన్.
డిజిటల్ పేమెంట్స్పై దీని ఇంపాక్ట్ ఏమిటి?
ప్రస్తుతం ఇండియాలో యూపీఐ మార్కెట్ చాలా పెద్దది. ఇందులో ఫోన్ పే, గూగుల్ పేలదే హవా. సింహభాగం లావాదేవీలు వీటి ద్వారానే జరుగుతున్నాయి. పేటీఎం, అమెజాన్ పే, వాట్సాప్ పే, క్రెడ్ కూడా రేసులో ఉన్నాయి. అయితే ఈ మెటా-క్రెడ్ డీల్తో ఇండియన్ ఫిన్టెక్ రంగంలో విదేశీ కంపెనీల కంట్రోల్ మరింత పెరుగుతుందనే చర్చ నడుస్తోంది. ఆధార్, యూపీఐ, ఇండియా స్టాక్ లాంటి ప్రభుత్వ మౌలిక వసతులతో క్రియేట్ అయిన ఈ మార్కెట్ను అమెరికన్ కార్పొరేట్ కంపెనీలైన వాల్మార్ట్ (ఫోన్ పే), గూగుల్ (గూగుల్ పే), ఇప్పుడు మెటా (వాట్సాప్ పే + క్రెడ్) శాసించే పరిస్థితి వస్తోంది. మెటా గ్లోబల్ రీచ్, క్రెడ్ కస్టమర్ బేస్ కలిస్తే ఫోన్ పే, గూగుల్ పేలకు గట్టి పోటీ ఇవ్వొచ్చని కొందరు అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే వాట్సాప్ పే, క్రెడ్ ల మధ్య ఎలాంటి ప్రొడక్ట్ ఇంటిగ్రేషన్ ఉంటుందనేది ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు.
డేటా భద్రత, నిబంధనలు
ఈ డీల్ వల్ల కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇండియన్ టాక్స్ పేయర్స్ డబ్బుతో, ప్రభుత్వ పాలసీలతో బిల్డ్ చేసిన పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై విదేశీ టెక్ దిగ్గజాల కంట్రోల్ పెరుగుతోందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇండియన్ స్టార్టప్స్ లాంగ్ టర్మ్ కంపెనీలుగా ఎదగడం కంటే, విదేశీ కంపెనీలకు అమ్ముడుపోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇక డేటా విషయానికి వస్తే, ప్రస్తుతానికి మెటాకు కస్టమర్ డేటా యాక్సెస్ ఉండదని, బోర్డులో సీటు కూడా ఉండదని క్రెడ్ క్లారిటీ ఇచ్చింది.
కానీ ఫ్యూచర్లో 1.7 కోట్ల మంది యూజర్ల క్రెడిట్ కార్డ్ బిహేవియర్, స్పెండింగ్ ప్యాటర్న్స్ డేటా మెటాకు దొరికితే, దాన్ని వాళ్లు ఏఐ మోడల్స్ ట్రైన్ చేయడానికి లేదా యాడ్స్ కోసం వాడే ఛాన్స్ ఉందనే డౌట్స్ ఉన్నాయి. ఇండియాలోని డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ప్రకారం దీనిపై నిఘా ఉంటుంది. అలాగే ఈ 20% వాటా కొనుగోలుపై ఆర్బీఐ, సెబీ నిబంధనలు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతులు కూడా కీలకం కానున్నాయి.

