ట్విట్టర్ మాజీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇస్తున్న మేడిన్ ఇండియా కూ యాప్..త్వరలోనే అమెరికాలోనూ కూ యాప్ ఎంట్రీ
ఎలాన్ మస్క్ ఎప్పుడైతే ట్విటర్ ను సొంతం చేసుకున్నాడు అప్పటినుంచి ప్రతిరోజు ట్విట్టర్లో వస్తున్నటువంటి మార్పులు పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపుపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్టే మస్క్ సైతం ఉద్యోగులను ఎడాపెడా తీసేస్తున్నాడు.
ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా చాలా మంది భారతీయులతో పాటు సుమారు 7500 మంది ఉద్యోగులను ట్విట్టర్ నుంచి తొలగించారు. అయితే దీన్నే తాజాగా ‘కూ’ అనే భారతీయ యాప్ అవకాశంగా మలుచుకుంటోంది. అంతే కాదు ట్విట్టర్ కు పోటీగా నిలుస్తోంది. ట్విట్టర్ గందరగోళం నెలకొనడంతో, యూజర్లు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కూ యాప్ వైపు చూస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా డౌన్లోడ్స్ పుంజుకుంది.
తాజాగా ట్విట్టర్ ద్వారా తొలగించబడిన ఉద్యోగులను నియమించుకోవడానికి Koo యాప్ తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. దీంతో సరికొత్త ఫీచర్లతో అతి త్వరలోనే కూ యాప్ మరింత సౌకర్యవంతంగా అందుబాటులోకి తెస్తోంది.
కూ యాప్ సీఈవో పితావత్కా తాజాగా ట్విట్టర్లో కొత్త పోస్ట్ను పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ #RIPTwitter కు అంనుబంధంగా ట్వీట్ చేశారు. అందులో. మేము ట్విట్టర్లో తీసేసిన కొంతమంది మాజీ ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నాము. అంటూ ట్వీట్ చేశాడు.
అంతేకాదు ట్విట్టర్ లో తొలగించిన మాజీ ఉద్యోగుల ప్రతిభకు మా సంస్థ ఒక వేదికగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వారితో మరింతగా విస్తరించి యాప్ అభివృద్ధిలో ఉన్నత స్థాయికి చేరుకుంటామని ట్వీట్లో పేర్కొన్నారు.
వివిధ దేశాల్లో 'కూ'ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక:
స్వదేశీ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ కూడా చాలా అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉంది. ఈ వారం ప్రారంభంలో, కూ సహ వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ అప్రమేయ రాధాకృష్ణ త్వరలో USలో కూడా KOO యాప్ ప్రారంభిస్తామని ధృవీకరించారు. అలాగే బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మిడిల్ ఈస్ట్ , ఆఫ్రికాతో సహా పలు దేశాల్లో ఈ యాప్ను ప్రారంభించాలని కూ నిర్ణయించుకుంది.
50 మిలియన్ డౌన్లోడ్లు:
Koo యాప్ 2020లో ప్రారంభించారు. Koo యాప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల డౌన్లోడ్లను అధిగమించింది. ప్రస్తుతం హిందీ, కన్నడ, మరాఠీ, బంగ్లా, తమిళం, తెలుగు , గుజరాతీతో సహా దేశంలోని 10 ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉందని కంపెనీ ఈ నెల ప్రారంభంలో ఒక ప్రకటనలో తెలిపింది.
మరోవైపు ప్రస్తుతం ట్విట్టర్లో జరుగుతున్న పరిణామాలను కూ యాప్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. ఈ యాప్లో 7,500 మంది సెలబ్రిటీలు యాక్టివ్గా ఉన్నారు. క్లాడియా లీట్, రచయిత రోసన్నా హెర్మన్, న్యూస్ పోర్టల్ హోస్ట్ చోకీ వంటి బ్రెజిల్ సెలబ్రిటీలు ఇటీవల 'కూ' యాప్లో చేరారు. సెలబ్రిటీ ఫెలిపే నెటో 'కూ' ప్లాట్ఫారమ్లో చేరిన రెండు రోజుల్లోనే 450,000 మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. దీంతో 'కూ' యాప్లో అత్యధిక ఫాలోవర్స్తో బ్రెజిల్ లో అతి పెద్ద సోషల్ మీడియా ప్లాట్ ఫాంగా అవతరించింది.