చాట్లోనే షాపింగ్, చెల్లింపులు ! ChatGPT UPI పైలట్ స్టార్ట్.. ఏంటో తెలుసా?
ChatGPT–UPI Pilot: భారత్ లో చాట్ జీపీటీ యూపీఐ (ChatGPT–UPI) పైలట్ ప్రారంభమైంది. యూజర్ల ఇప్పుడు చాట్ జీపీటీ ద్వారా నేరుగా షాపింగ్ చేసి, చెల్లింపులు చేయవచ్చు.

ఫ్యూచర్ ఆఫ్ చాట్కామర్స్ : చాట్ జీపీటీతో షాపింగ్ + యూపీఐ పేమెంట్స్
భారతదేశం డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో పెద్ద ముందడుగు వేసింది. చాట్లోనే షాపింగ్ చేసి చెల్లింపులు చేసే చాట్ జీపీటీ యూపీఐ (ChatGPT–UPI) పైలట్ ప్రోగ్రామ్ను అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా వినియోగదారులు ఇప్పుడు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీలో వస్తువులను బ్రౌజ్ చేసి, ఆర్డర్ చేయడం, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
ఈ ప్రాజెక్ట్ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), ఫిన్టెక్ సంస్థ రోజర్ పే (Razorpay), ఓపెన్ ఏఐ (OpenAI) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ను ప్రారంభ దశలో పరీక్షించేందుకు బిగ్ బాస్కేట్ (Bigbasket) మొదటి ఈ కామర్స్ సంస్థగా ఎంపికైంది.
చాట్ జీపీటీ యూపీఐ పైలట్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి?
ఈ పైలట్ ప్రోగ్రామ్లో వినియోగదారులు చాట్ జీపీటీ చాట్లోనే ఉత్పత్తులను వెతకవచ్చు, ధరలు పోల్చవచ్చు, ఆర్డర్ చేయవచ్చు. అక్కడే చెల్లింపులను యూపీఐ ద్వారా పూర్తి చేయవచ్చు. మొత్తం ప్రక్రియ ఒకే చాట్ విండోలో జరుగుతుంది. ఇది వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, డిజిటల్ కొనుగోళ్లను మరింత సులభతరం చేస్తుంది.
ఎన్పీసీఐ ప్రకారం, ఈ వ్యవస్థ యూపీఐ రియల్ టైమ్ నెట్వర్క్ను ఉపయోగించి సురక్షితమైన, వేగవంతమైన ట్రాన్సాక్షన్ అనుభవాన్ని అందిస్తుంది.
ChatGPT–UPI Pilot: భాగస్వామ్య సంస్థలు
ఈ పైలట్ ప్రాజెక్ట్లో ఎన్పీసీఐ, రోజర్ పే, ఓపెన్ ఏఐ సాంకేతిక భాగస్వామ్య సంస్థలుగా పనిచేస్తున్నాయి. చెల్లింపుల భాగంలో యాక్సిస్ బ్యాంకు, ఎయిర్ టెట్ పేమెంట్ బ్యాంకు భాగస్వామ్యంగా ఉన్నాయి. బిగ్ బాస్కేట్ వినియోగదారులు చాట్ జీపీటీలో ఉత్పత్తులను కొనుగోలు చేసే మొదటి ఈ కామర్స్ వేదికగా ఉంది.
ఓపెన్ ఏఐ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ఆలివర్ జే (Oliver Jay) మాట్లాడుతూ.. “ఎన్పీసీఐ తో కలిసి పనిచేయడం మాకు ఆనందంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన చెల్లింపు వ్యవస్థ అయిన యూపీఐ సేవలను చాట్ జీపీటీలోకి తీసుకురావడంతో భవిష్యత్ డిజిటల్ వాణిజ్యానికి కొత్త దిశ చూపగలమని ఆశిస్తున్నాం” అని తెలిపారు.
చాట్ జీపీటీ యూపీఐ పైలట్ ఎలా పనిచేస్తుంది?
వినియోగదారులు చాట్ జీపీటీలో ఏవైనా ఉత్పత్తుల గురించి వివరాలు అడిగితే.. వివిధ ఆన్లైన్ స్టోర్ల నుండి ఉత్పత్తుల వివరాలు, ధరలు చూపిస్తుంది. మీకు కావాల్సిన బ్రాండ్, ధరలను పోల్చుకుని మీరు అక్కడే వాటిని కొనుగోలు చేయవచ్చు. అలాగే, యూపీఐ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.
ఈ చెల్లింపులు రోజర్ పే అందించే మర్చంట్ ఇంటిగ్రేషన్ లేయర్ ద్వారా ప్రాసెస్ అవుతాయి. అంటే యూపీఐ రిజర్వ్ పే ఫీచర్ ద్వారా సురక్షితమైన చెల్లింపులు రియల్ టైమ్లో పూర్తవుతాయి.
వినియోగదారుల అనుమతితోనే చెల్లింపులు
ఈ ప్రోగ్రామ్లో ఏఐ ఏజెంట్లు వినియోగదారుల అనుమతితో మాత్రమే ట్రాన్సాక్షన్లు జరుపుతాయి. ఎన్పీసీఐ, రోజర్ పే భద్రతా ప్రోటోకాల్స్ను బలోపేతం చేశాయి. వినియోగదారుల డేటా లేదా చెల్లింపు వివరాలు చాట్ జీపీటీలో సేవ్ కాకుండా చర్యలు తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో మన డేటా బయటకు వస్తుందనే భయం లేదు.
ప్రస్తుతం ఈ ఫీచర్ పరిమితంగా కొద్దిమందికే అందుబాటులో ఉంది. పైలట్ ప్రోగ్రామ్ విజయవంతమైతే ఎన్పీసీఐ ఈ సేవలను మరిన్ని ఈ కామర్స్ వేదికలకు విస్తరించాలనే యోచనలో ఉంది.
బిగ్ బాస్కేట్ తర్వాత ఇతర కామర్స్, డిజిటల్ సేవా సంస్థలతో కలిసి ఈ ఫీచర్ను అందించే అవకాశం ఉంది. ఎన్పీసీఐ ఇప్పటికే IoT పరికరాల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే ప్రాజెక్ట్పై పనిచేస్తోంది. ఇది స్మార్ట్వాచ్లు, కనెక్టెడ్ గ్యాడ్జెట్స్ వంటి పరికరాల్లో కూడా చాట్ జీపీటీ ద్వారా చెల్లింపులను సాధ్యమయ్యేలా చేస్తుంది.
ఈ ఏఐ యూపీఐ మోడల్ భవిష్యత్తులో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లను పూర్తిగా ఆటోమేటెడ్ చేసే దిశగా ఒక పెద్ద ముందడుగు అవుతుందని ఎన్పీసీఐ పేర్కొంది. ఏఐ, యూపీఐ కలయికతో భారతీయ డిజిటల్ ఎకోసిస్టమ్ మరింత సమగ్రంగా, సులభంగా, భద్రంగా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు.