- Home
- Business
- బిల్డర్ తప్పు చేస్తే ఇంటి యజమాని ఎందుకు నష్టపోవాలి.? SBI చర్యలను తప్పుపట్టిన రెరా
బిల్డర్ తప్పు చేస్తే ఇంటి యజమాని ఎందుకు నష్టపోవాలి.? SBI చర్యలను తప్పుపట్టిన రెరా
Home Loan: బిల్డర్కు హోమ్ లోన్ మొత్తాన్ని విడుదల చేసిన తర్వాత అతడు రుణం చెల్లించడంలో విఫలమైతే, ఆ భారాన్ని నేరుగా ఇంటి కొనుగోలుదారులపై మోపడం సరైంది కాదని రాజస్థాన్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా) స్పష్టం చేసింది.

అసలు వివాదం ఏంటి?
ఈ కేసు రాజస్థాన్లోని శివరాజ్ రెసిడెన్సీ ప్రాజెక్టుకు సంబంధించినది. ఇద్దరు ఫ్లాట్ల కొనుగోలుదారులు మొత్తం రూ.98.44 లక్షలకు రెండు ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం వారు ఎస్బీఐ నుంచి హోమ్ లోన్ తీసుకున్నారు. బ్యాంకు రూ.72.48 లక్షల రుణాన్ని నేరుగా బిల్డర్ ఖాతాలో జమ చేసింది. కొనుగోలుదారుల వాదన ప్రకారం, బ్యాంకు, బిల్డర్, కొనుగోలుదారుల నడుమ జరిగిన త్రైపాక్షిక ఒప్పందంలో ఒక కీలక నిబంధన ఉంది. ప్రాజెక్టు నిలిచిపోతే లేదా పూర్తి కాకపోతే, బ్యాంకుకు రుణం తిరిగి చెల్లించే బాధ్యత పూర్తిగా బిల్డర్దేనని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.
బిల్డర్ డిఫాల్ట్.. రంగంలోకి దిగిన ఎస్బీఐ
ప్రారంభంలో బిల్డర్ రుణంపై వడ్డీ చెల్లించినప్పటికీ, తర్వాత చెల్లింపులు నిలిపివేశాడు. దీంతో ఎస్బీఐ జైపూర్ డెబ్ట్స్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)లో కేసు దాఖలు చేసింది. రుణ బకాయిలను బిల్డర్తో పాటు ఫ్లాట్ల కొనుగోలుదారుల నుంచి కూడా వసూలు చేయాలని కోరింది. దీంతో ఆందోళనకు గురైన కొనుగోలుదారులు రాజస్థాన్ రేరాను ఆశ్రయించారు. తమపై ఎలాంటి బలవంతపు రికవరీ చర్యలు తీసుకోకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
రేరా పరిశీలనలో బయటపడ్డ కీలక అంశం
ఈ కేసును విచారించిన రేరా సభ్యుడు సుధీర్ కుమార్ శర్మ పలు పత్రాలను పరిశీలించారు. డీఆర్టీలో ఎస్బీఐ సమర్పించిన వివరాల్లోనే ఒక ముఖ్యమైన విషయం ఉందని రేరా గుర్తించింది. రుణం బిల్డర్కే విడుదల చేశామని, ఇంకా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ జరగలేదని, అలాగే త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం రుణ బాధ్యత బిల్డర్పైనే ఉంటుందని ఎస్బీఐ తన వాదనలో పేర్కొన్నట్లు రేరా గమనించింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న రేరా, కొనుగోలుదారుల వాదనలో బలం ఉందని అభిప్రాయపడింది.
కొనుగోలుదారులకు తాత్కాలిక ఊరట
విచారణ అనంతరం రేరా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్లాట్ల విషయంలో కొనుగోలుదారుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలు ప్రతివాదులు తీసుకోవద్దని ఆదేశించింది. అలాగే బిల్డర్కు విడుదల చేసిన హోమ్ లోన్ మొత్తాన్ని వసూలు చేసేందుకు కొనుగోలుదారులపై ఎస్బీఐ ఎలాంటి బలవంతపు రికవరీ చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది.
తదుపరి విచారణ ఆగస్టు 20న
ఈ కేసులో తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. పూర్తి విచారణ కోసం తదుపరి విచారణను 2026 ఆగస్టు 20కి రాజస్థాన్ రేరా వాయిదా వేసింది. అప్పటి వరకు కొనుగోలుదారులపై బలవంతపు రికవరీ చర్యలు నిలిపివేయాలని ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఈ నిర్ణయం, బిల్డర్ తప్పిదాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంటి కొనుగోలుదారులకు తాత్కాలిక ఉపశమనం కల్పించిన కీలక ఆదేశంగా భావిస్తున్నారు.

