రికార్డుల బ్లాక్బస్టర్! హిస్టారికల్ హైట్స్కి స్టాక్స్ మార్కెట్లు...
స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ వసంతం 2019. 2019లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 15, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 13 శాతం లాభ పడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 41 వేల పై మార్కుకు చేరుకుంది. దేశీయ ఆర్థిక మందగమనం కొనసాగినా, చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఇంకా కొలిక్కి రాకున్నా.. స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లడం ఆసక్తికర పరిణామం.
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లకు 2019 ఏడాది లాభాల నామ వసంతం కానున్నది. బుల్ పరుగు పందెంలో గత రికార్డులన్నీ తుడిచి పెట్టుకు పోయాయి. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన సూచీలు ఈ ఏడాది మరో చరిత్ర సృష్టించాయి.భారత ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయినా, అంతర్జాతీయంగా చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం, ఉగ్రదాడులు జరిగినా మార్కెట్లు మాత్రం వాయువేగంతో దూసుకెళ్లాయి. స్టాక్ మార్కెట్ తన చరిత్రను 2019ని సువర్ణాక్షరాలతో లిఖించుకున్నది.
ఈ ఏడాదిలోనే బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారిగా 40వేల మార్క్ను దాటగా, జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా 12,000 దాటి మరో చరిత్రను లిఖించింది. మధ్య, చిన్న స్థాయి స్టాకులు నిరాశాజనక పనితీరు కనబరిచినా మదుపరులు బ్లూచిప్ సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం విశేషం.
ఈ ఏడాది 36,254.57 పాయింట్ల వద్ద ప్రారంభమైన 30 షేర్ల ఇండెక్స్ సూచీ.. ప్రస్తుతం 41,575 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. అంటే 15 శాతం మేరకు పెరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్టాక్ మార్కెట్లు నిలకడగా ఉన్నాయి. కేవలం నాలుగు నెలల్లోనే ఏప్రిల్ రెండో తేదీ నాటికి 39 వేల మార్క్ను చేరుకున్నది.
పార్లమెంట్కు తొలి విడుత జరిగిన ఎన్నికల నాటికి సూచీలు 39 వేల స్థాయికి చేరుకున్నాయి. నరేంద్ర మోదీ సర్కార్ రెండో విడుత అధికారం చేజిక్కించుకున్న నాటి నుంచి ఆకాశమే హద్దుగా స్టాక్ మార్కెట్ దూసుకుపోయింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మే 23న పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్కు పాల్పడినా ఆ తర్వాత రోజుల్లో భారీగా నిధులు కుమ్మరించారు.
జూన్ రెండో తేదీన తొలిసారిగా 40 వేల మార్క్ను దాటింది. నిఫ్టీ కూడా 12 వేల దాటి ముగిసింది. ప్రస్తుత సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో జరిగిన అంశాలు క్లుప్తంగా పరిశీలిద్దాం..కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్ స్టాక్ మార్కెట్లలో ప్రకంపనాలు సృష్టించింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐఎస్), సంపన్న వర్గాలు, పబ్లిక్ షేర్ హోల్డింగ్లపై సర్ చార్జి విధిస్తున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లు కుప్పకూలాయి.
విత్త మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయాలతో మదుపర్లు నిరుత్సాహానికి గురయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు 400 పాయింట్లకు పైగా, ఆ మరునాడు జూలై ఎనిమిదో తేదీన ఏకంగా 793 పాయింట్లు కోల్పోయింది. 2019లో ఒక రోజులో భారీస్థాయిలో సెన్సెక్స్ పతనమవడం ఇదే తొలిసారి.సర్ చార్జి దెబ్బతో విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడిదారులు ఆందోళనకు గురి కావడంతో జూలై నెలలో ఏకంగా రూ.12,500 కోట్ల పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు.
అంతకుముందు ఐదు నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం కొనసాగించారు.వ్యాపారవర్గాలు, ఎఫ్పీఐల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో కేంద్రం వెంటనే విధించిన సర్ చార్జీని ఉపసంహరించుకుంటున్నట్లు ఆ తర్వాత ఆగస్టు నెలలో ప్రకటించింది. కార్పొరేట్ వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి సెప్టెంబర్ నెలలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఉద్దీపన చర్యలు చేపట్టారు.
కార్పొరేట్ ట్యాక్స్ను 22 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. సెప్టెంబర్ 20వ తేదీన ఏకంగా 1,921 పాయింట్లు లాభపడింది. గత పదేళ్లలో ఒకేరోజు సెన్సెక్స్ ఇంత భారీ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి. కొనుగోళ్లతో కళకళలాడిన దలాల్ స్ట్రీట్ నవంబర్ 27వ తేదీన చారిత్రక గరిష్ఠ స్థాయి 41 వేల పాయింట్ల మార్క్ను అధిగమించింది. డిసెంబర్ 27వ తేదీతో ముగిసిన ఏడాదికాలంలో సెన్సెక్స్ 15.26 శాతం, నిఫ్టీ 12.73 శాతం లాభపడ్డాయి.
ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ 27 వరకు సెన్సెక్స్ లోని 30 - స్టాక్స్ ఇండెక్స్ నిష్పత్తి 29 స్థాయిని తాకడం 20 ఏళ్లలో గరిష్ఠం. మాంద్యం గుప్పిట్లో అంతర్జాతీయ దేశాలు జారుకుంటున్నట్లు వచ్చిన సంకేతాలు మార్కెట్ల భారీ ర్యాలీకి బ్రేక్వేశాయి. ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 4.5 శాతానికి పడిపోయిన వృద్ధికి ఊతమివ్వడానికి భారతీయ రిజర్వుబ్యాంక్ (ఆర్బీఐ) వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
దేశీయ ఈక్విటీలపై నమ్మకాన్ని వ్యక్తంచేసిన విదేశీ పోర్ట్ ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్పీఐ) ఈ ఏడాది రూ.97,250 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. గడిచిన ఆరేళ్లలో ఇదే గరిష్ఠం. గతవారంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలోనూ కోలుకునే అవకాశాలు కనిపించడం లేదని దలాల్స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటుండటం, మరోవైపు ఈవారంలోనే ఎనిమిది కీలక రంగాల గణాంకాలు విడుదల కానుండటం, గత నెలకు ఆటోమొబైల్ సంస్థలు తమ విక్రయాలను ప్రకటించడం కూడా మార్కెట్లపై తీవ్రంగా ప్రభావం చూపే అంశాలని పేర్కొన్నాయి.
బుధవారం డిసెంబర్కు ఆటోమొబైల్ కంపెనీల తమ విక్రయాలను ప్రకటించనుండటంతో ఈ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురి కావచ్చునని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ హెడ్ దీపక్ జసానీ తెలిపారు. అలాగే నవంబర్ నెలకు కీలక రంగాల పనితీరు, పీఎంఐ తయారీ సూచీ మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయనున్నదన్నారు.
2019లో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్న స్టాక్ మార్కెట్లు నూతన సంవత్సరంపై గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడి దారులు భారీగా నిధులు కుమ్మరిస్తుండటం, కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు మొగ్గుచూపిస్తే రికార్డుల మీద రికార్డుల బద్దలు కొట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) నుంచి క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్)లో ప్రతి నెలా స్టాక్ మార్కెట్లో రూ.8000 కోట్లకు పైగా వచ్చాయి. దేశీయ రుణ మార్కెట్ల నుంచి రూ.6.2 లక్షల కోట్లు, విదేశీ బాండ్ల నుంచి రూ.1.2 లక్సల కోట్లు, మిగిలినా రూ.1.25 లక్షల కోట్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి దేశీయ కంపెనీలు పెట్టుబడులు సేకరించాయి.
కార్పొరేట్ల ఆశాజనక ఫలితాలు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితే 45 వేల పాయింట్లకు చేరుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ పైనే 2020లో స్టాక్ మార్కెట్ల గమనం ఆధార పడి ఉందని తెలుస్తోంది.