వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్..! ఇకపై ఎక్కడి నుండైన సిలిండర్ పొందవచ్చు..
కరోనా కాలంలో వినియోగదారుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది. ఇప్పుడు ఎల్పిజి కస్టమర్లు ఏ డిస్ట్రిబ్యూటర్ నుంచి గ్యాస్ సిలిండర్ పొందాలనుకుంటున్నారో నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ పథకాన్ని త్వరలో పైలట్ దశలో ప్రారంభించనున్నారు. ప్రారంభంలో చండీఘడ్, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీలలో నివసించే వినియోగదారులు ఈ సద్వినియోగం చేసుకోవచ్చు. మొబైల్ యాప్ లేదా కస్టమర్ పోర్టల్ ద్వారా ఎల్పిజి రీఫిల్ బుక్ చేసుకునేటప్పుడు వినియోగదారులకు ఈ ఆప్షన్ లభిస్తుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్ పనితీరు రేటింగ్ను కూడా చూపుతుంది.
ఎల్పిజి రీఫిల్ డెలివరీ పొందడానికి కస్టమర్ నివసించే ప్రాంతానికి చెందిన జాబితా నుండి ఏదైనా డిస్ట్రిబ్యూటర్ ని ఎంచుకోవచ్చు. దీని వల్ల వినియోగదారులకు ఉత్తమమైన సేవలను అందించడానికి డిస్ట్రిబూటర్ మధ్య పోటీ పెరగనుంది. త్వరలోనే ఈ సదుపాయం దేశవ్యాప్తంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా అడ్రస్ ప్రూఫ్ లేకుండా సిలిండర్లు పొందడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటనలు జారీ చేస్తోంది. ఇటీవల దేశ ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్) అడ్రస్ ప్రూఫ్ లేకుండా కూడా ఎల్పిజి సిలిండర్లను తీసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అంతకుముందు అడ్రస్ ప్రూఫ్ లేని వ్యక్తులకు ఎల్పిజి సిలిండర్లు లభించేది కాదు. తాజాగా సామాన్య ప్రజలకు ఉపశమనం ఇస్తూ ఐఓసిఎల్ ఎల్పిజిపై అడ్రస్ ప్రూఫ్ నియమాన్ని తొలగించింది.
ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలైన బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఒసీలతో జతకట్టి రాష్ట్రాలలో 21,000 ఇప్పటివరకు ఎల్పిజి కేంద్రాలను తెరిచినట్లు సీఎస్సీ ఎస్పీవీ డైరక్టర్ దినేష్ త్యాగి ఒక ప్రకటనలో తెలిపారు.అంతేకాకుండా దేశవ్యాప్తంగా మార్చి 2022 నాటికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించి సుమారు ఒక లక్ష ఎల్పీజీ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
ధర
ఈ నెలలో దేశీయ ఎల్పిజి సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢీల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్పిజి సిలిండర్ ధర రూ .809. దీని ధర కోల్కతాలో రూ .835.50, ముంబైలో రూ .809, చెన్నైలో రూ .825. ఢీల్లీలో 19 కిలోల ఎల్పిజి సిలిండర్ గత నెలలో రూ.1595.50 తో పోల్చితే ఈ నెలలో రూ .122 తగ్గి 1473.50లకు చేరుకుంది. దీని ధర కోల్కతాలో రూ.1544.50, ముంబైలో రూ.1422.50, చెన్నైలో రూ .1603.
వంటగ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేసుకోవాలి
గ్యాస్ సిలిండర్ బుకింగ్ కోసం 8454955555 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీరు దేశంలోని ఏ మూల నుంచైనా సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు వాట్సాప్ ద్వారా కూడా సిలిండర్లను కూడా బుక్ చేసుకోవచ్చు. రీఫిల్ అని టైప్ చేసి మీరు 7588888824 నంబర్కు మెసేక్ పంపితే మీ సిలిండర్ వెంటనే బుక్ అవుతుంది.