- Home
- Business
- ఆఫర్ లో వస్తున్నాయని ఆన్ లైన్ లో తెగ షాపింగ్ చేస్తున్నారా? అయితే మీరు ఈ వార్త పక్కా చదవాల్సిందే
ఆఫర్ లో వస్తున్నాయని ఆన్ లైన్ లో తెగ షాపింగ్ చేస్తున్నారా? అయితే మీరు ఈ వార్త పక్కా చదవాల్సిందే
మంచి ఆఫర్ ఉందనో, తక్కువ ధరకే వస్తుందనో మీరు ఇ-కామర్స్ యాప్స్ లో తెగ షాపింగ్ చేస్తున్నారా? అయితే మీరు మోసపోయే అవకాశాలున్నాయి. ఎందుకో ఈ వార్త చదివితే అర్థమవుతుంది....

Amazon,Flipkart
Amazon,Flipkart : ఒకప్పుడు షాపింగ్ అంటే పది షాపులు తిరిగి ఎందుతో నాణ్యమైన వస్తువులు తక్కువధరకు లభిస్తున్నాయో తెలుసుకుని కొనుగోలు చేసేవాళ్లు. కానీ ఈ టెక్ జమానాలో వస్తువును చూడకుండానే ఇ-కామర్స్ సంస్థలపై నమ్మకంతో కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తూ కొన్ని ఇ-కామర్స్ సంస్థలు నాణ్యతా ప్రమాణాలు పాటించని వస్తువులను అంటగడుతున్నాయి. తాజాగా ఇ-కామర్స్ సంస్థల వేర్ హౌస్ లపై జరిపిన దాడిలో ఈ విషయం వెలుగుచూసింది.
Amazon,Flipkart
అమెజాన్, ప్లిఫ్ కార్ట్ వేర్ హౌస్ లపై బిఐఎస్ దాడులు :
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇ-కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థల వేర్ హౌస్ లపై దాడులు నిర్వహించింది. దేశంలో ఈ సంస్థలకు చెందిన చాలా గోదాంలలో సోదాలు జరిగాయి... ఇందులో నిబంధనలను ఉల్లంఘించి నాణ్యతలేని నాసిరకం వస్తువులను గుర్తించారు. దేశ రాజధాని డిల్లీతో సహా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోనూ ఇటీవల బిఐఎస్ సోదాలు జరిగాయి.
డిల్లీలోని మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలో అమెజాన్ గోదాంలో దాదాపు 15 గంటలపాటు BIS అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వేలాదిగా ISI (ఇండియన్ స్టాండార్డ్ ఇన్స్టిట్యూట్) గుర్తింపులేని నాసిరకం విద్యుత్ ఉపకరణాలు, గీజర్లు, మిక్సర్లు వంటి గృహోపకరణాలు గుర్తించారు. అలాగే నకిలీ ఐఎస్ఐ స్టిక్కర్లు కలిగిన వస్తువులను కూడా అధికారులు గుర్తించారు.
ఇలా ఇటీవల డిల్లీలోని అమెజాన్ గోదాంలో నిర్వహించిన దాడుల్లో బిఐఎస్ అధికారులు 3,500 పైగా నాసిరకం వస్తువులను గుర్తించి జప్తు చేసినట్లు తెలుస్తోంది. వీటివిలువ దాదాపు రూ.70 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వినియోగదారులను మోసం చేసేలా వ్యవహరిస్తున్న ఇ-కామర్స్ సంస్థలపై ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని BIS అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల తమిళనాడులో కూడా ఇలాగే మరో ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిక్ కార్ట్ గోదాంపై BIS దాడులు నిర్వహించింది. తిరువళ్లూరు జిల్లాలోని పుదవోయల్ లో గల అమెజాన్ గోదాంలో కూడా ఇలాగే ఐఎస్ఐ నిబంధనలు పాటించని 3,376 కు పైగా వస్తువులను జప్తు చేసారు. వీటివిలువ రూ.36 లక్షలు ఉంటుందని అంచనా.
ఇక కొడువల్లిలోని ఫ్లిప్ కార్ట్ గోదాంపై కూడా దాడులు నిర్వహించారు. ఇందులోనూ నిబంధనలు పాటించకుండా తయారుచేసిన వస్తువులను అమ్మకానికి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఇలా అమెజాన్, ప్లిఫ్ కార్ట్ సంస్థల్లో వరుస దాడులు, అందులో నాసిరకం వస్తువులు గుర్తించడం వినియోగదారుల్లో ఆందోళన పెంచింది. ఈ సంస్థలపై నమ్మకంతో తాము వస్తువులు కొంటున్నామని... అలాంటిది ఇక్కడ నాసిరకం వస్తువులు అమ్ముతుండటం ఏమిటని అంటున్నారు.
e commerce
హైదరాబాద్ లోనూ ఇదే పరిస్థితి :
హైదరాబాద్ లో కూడా ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ గోదాంపై బిఐఎస్ అధికారులు సోదాలు నిర్వహించారు. శంషాబాద్ లోని అమెజాన్ గోదాంలోని వస్తువులను అధికారులు తనిఖీ చేసారు. ఇందులో బిఐఎస్ నిబంధనలు పాటించకుండా అమ్మకానికి సిద్దంగా ఉంచిన వస్తువులను గుర్తించారు.
బిఐఎస్ సోదాల్లో స్మార్ట్ వాచ్ లు, ఎలక్ట్రికల్ వాటర్ హీటర్లు, సిసి కెమెరాలు, మిక్సర్లు, ప్రెజర్ కుక్కర్లు, స్టీల్ వాటర్ బాటిల్స్, ఇయర్ బడ్స్, మొబైల్ ఛార్జర్లు, బొమ్మలు... ఇలా మొత్తం 2783 వస్తువులు బిఐఎస్ సర్టిఫికేషన్ లేనివి గుర్తించారు. వీటిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీటివిలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
BIS Act 2016 ప్రకారం 769 ఉత్పత్తులను బిఐఎస్ ప్రమాణాల ప్రకారం తయారుచేయాల్సి ఉంటుంది. వీటిని నిబంధనలకు విరుద్దంగా ఉత్పత్తి చేయడం, విక్రయించడం నిషేదం. లేదంటే ఈ యాక్ట్ లోని సెక్షన్ 17 ప్రకారం ఇలాంటి వస్తువుల అమ్మకం, నిల్వచేయడంపై చర్యలు తీసుకోవచ్చు. రెండేళ్లే జైలుశిక్ష, రెండు లక్షల కంటే తక్కువ కాకుండా జరిమానా విధించవచ్చు. ఇలాగే తరచూ నిబంధనలు ఉళ్లంఘిస్తే శిక్ష పెరగడంతో పాటు రూ.5 లక్షలకు పైగా జరిమానా విధించవచ్చు.
అమెజాన్ వివరణ :
తమ వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందించాలన్నదే తమ లక్ష్యమని అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో ఏదయినా ఉత్పత్తి సంస్థ నిబంధలకు విరుద్దంగా తమకు వస్తువులు సరఫరా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టాలు, నిబంధనలు పాటించి తయారుచేసిన వస్తువులను అమ్మడమే తమ విధానమని అమెజాన్ స్పష్టం చేసింది.