Financial Planning: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన ఆర్థిక పనులు పూర్తి చేయడం చాలా అవసరం. మార్చి 31కు ముందే కొన్ని పనులు తప్పకుండా చేయాలి. లేదంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి
చాలా మంది ఉద్యోగులు సంవత్సరం ప్రారంభంలో పన్ను ఆదా చేసేందుకు వివిధ పెట్టుబడులు పెట్టాలని తమ సంస్థలకు తెలియజేస్తారు. ఆ వివరాలకు సంబంధించిన ఆధార పత్రాలు ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సమర్పించాలి. సాధారణంగా మార్చి 31కు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఉద్యోగి పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు సమయానికి ఇవ్వకపోతే కంపెనీ జీతం నుంచి ఎక్కువ మొత్తంలో TDS కట్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థికంగా నష్టం కలగవచ్చు.
అడ్వాన్స్ ట్యాక్స్ను సమయానికి చెల్లించాలి
మొత్తం పన్ను బాధ్యత రూ.10,000 కంటే ఎక్కువగా ఉన్నవారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం తప్పనిసరి. దీనికి చివరి తేదీ సాధారణంగా మార్చి 15గా నిర్ణయిస్తారు. ఈ గడువులోపు పన్ను చెల్లించకపోతే తర్వాత అదనపు వడ్డీ, పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. అందుకే ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ బాధ్యతను పూర్తి చేయడం చాలా అవసరం.
పన్ను ఆదా చేసే పెట్టుబడి పథకాలు
పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నవారు కొన్ని ప్రత్యేక పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్నులో రాయితీ పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొన్ని స్కీమ్స్లో పెట్టిన పెట్టుబడులకు మినహాయింపు ఉంటుంది. ఉదాహరణకు పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి పథకాలలో పెట్టుబడి పెడితే పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఈ ఖాతాలు చురుకుగా కొనసాగేందుకు ప్రతి సంవత్సరం కనీస మొత్తాన్ని జమ చేయడం కూడా అవసరం.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు
ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం చెల్లించినప్పుడు కూడా పన్నులో రాయితీ పొందే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80D ప్రకారం వ్యక్తి తనకు, కుటుంబ సభ్యులకు చెల్లించిన ప్రీమియంపై మినహాయింపు పొందవచ్చు. సాధారణంగా గరిష్టంగా రూ.25,000 వరకు మినహాయింపు ఉంటుంది. బీమా పొందిన వ్యక్తి వయస్సు 60 సంవత్సరాలకు పైబడితే ఈ పరిమితి రూ.50,000 వరకు పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య బీమాపై కూడా అదనపు మినహాయింపు లభిస్తుంది.
చివరి తేదీకి ముందే ఆర్థిక ప్రణాళిక చేయడం మంచిది
ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందు ఈ అన్ని విషయాలను ఒకసారి పరిశీలించడం చాలా అవసరం. పెట్టుబడులు, పన్ను చెల్లింపులు, బీమా ప్రీమియాలు వంటి అంశాలను సమయానికి పూర్తి చేస్తే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు తలెత్తవు. ముందుగానే సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే పన్ను భారం తగ్గడంతో పాటు అదనపు వడ్డీ, పెనాల్టీలను కూడా సులభంగా తప్పించుకోవచ్చు.


