- Home
- Business
- New Financial Rules: జూలై 1 నుంచి కొత్త రూల్స్.. అలర్ట్ అవ్వకపోతే మీరు మనీ లాస్ అవ్వడం ఖాయం !
New Financial Rules: జూలై 1 నుంచి కొత్త రూల్స్.. అలర్ట్ అవ్వకపోతే మీరు మనీ లాస్ అవ్వడం ఖాయం !
1 July 2026 New Rules : ఈ ఏడాది జూలై 1 నుంచి ఐటీఆర్, ఆధార్, పాస్పోర్ట్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ నియమాల్లో కీలక మార్పులు రానున్నాయి. మీపై నేరుగా ప్రభావం చూపే ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఆధార్ ఫ్రీ అప్డేట్ నుంచి పాస్పోర్ట్ బాదుడు వరకు.. జూలై 1 నుంచి మారే టాప్ 5 రూల్స్ ఇవే
జులై నెల ప్రారంభం కావడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి నెల లాగే ఈసారి కూడా నెల మొదటి తారీఖు అంటే, 1 జూలై నుంచి దేశంలో కొన్ని ముఖ్యమైన ఆర్థిక నియమాలు మారబోతున్నాయి. ఈ మార్పుల ప్రభావం సామాన్య ప్రజల జేబులపై, వారి రోజువారీ ఫైనాన్షియల్ పనులపై నేరుగా పడనుంది.
ఈ కొత్త అప్డేట్స్లో ఐటీఆర్ ఫైలింగ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1 జూలై 2026 నుంచి అమల్లోకి రాబోయే ఆ టాప్ ఫైనాన్షియల్ మార్పులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫైలింగ్ డెడ్లైన్, పెనాల్టీలు రూల్స్
మీరు టాక్స్ పేయర్స్ అయితే ఈ విషయం కచ్చితంగా నోట్ చేసుకోండి. ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫారమ్లను నింపే పన్ను చెల్లింపుదారుల కోసం ఆర్థిక సంవత్సరం 2025-26 రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీగా జూలై 31 ఫిక్స్ చేశారు. ఈ గడువు ముగిసిన తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తే భారీగా లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు జూలై 31 లోపు రిటర్న్స్ దాఖలు చేయకపోతే, డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ, దీని కోసం మీరు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఎవరి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందో, వారు రూ. 5,000 వరకు జరిమానా కట్టాల్సి రావచ్చు. అలాగే రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ జరిమానా రూ. 1,000 వరకు ఉంటుంది.
ఆధార్ కార్డ్ హోల్డర్లకు యుఐడిఎఐ అదిరిపోయే గుడ్ న్యూస్
ఆధార్ కార్డ్ వాడుతున్న వారికి యుఐడిఎఐ ఒక సూపర్ ఆఫర్ ఇచ్చింది. ఆధార్ కార్డులో రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీని అప్డేట్ చేయడానికి వసూలు చేసే ఫీజును తాత్కాలికంగా రద్దు చేశారు. గతంలో ఈ సర్వీస్ కోసం రూ. 75 ఫీజు వసూలు చేసేవారు.
కానీ ఇప్పుడు 1 జూలై 2026 నుంచి 31 డిసెంబర్ 2026 వరకు ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. ఆధార్ కార్డుదారులు ఎటువంటి ఖర్చు లేకుండా తమ ఈమెయిల్ ఐడీని అప్డేట్ చేసుకోవచ్చు. ఈ లక్కీ ఫెసిలిటీ యుఐడిఎఐ అధికారిక మొబైల్ యాప్ ద్వారా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల ప్రోగ్రామ్లో మార్పులు
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడుతున్న యూజర్లకు జూలై 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఫోన్పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్లో ఎస్బీఐ కార్డ్స్ కొన్ని కీలక మార్పులు చేసింది. ఇవి 1 జూలై 2026 నుండి అప్లై అవుతాయి.
ఈ మార్పుల ప్రభావం ఫోన్పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్, సెలెక్ట్ బ్లాక్ రెండు వేరియంట్లపై పడుతుంది. కొత్త నిబంధనల ప్రకారం, రివార్డ్ పాయింట్లను సంపాదించే లిమిట్ లో మార్పులు చేశారు. అంతేకాకుండా, కొన్ని రకాల లావాదేవీలను రివార్డ్ కేటగిరీ నుండి పూర్తిగా మినహాయించారు.
హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ రూల్స్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్ల కోసం కూడా ఒక కొత్త నియమాన్ని తీసుకువస్తున్నారు. 1 జూలై 2026 నుండి ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో కేవలం మూడు సార్లు మాత్రమే ఉచిత ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. అయితే దీనికి ఒక కండిషన్ కూడా ఉంది.
ఈ ఫ్రీ లాంజ్ యాక్సెస్ బెనిఫిట్ పొందాలంటే మునుపటి త్రైమాసికంలో కనీసం రూ. 60,000 ఖర్చు చేసి ఉండాలి. ఉదాహరణకు, మీరు జూలై నుండి సెప్టెంబర్ 2026 త్రైమాసికంలో లాంజ్ సదుపాయాన్ని ఎంజాయ్ చేయాలి అంటే, అంతకుముందు క్వార్టర్ అయిన ఏప్రిల్ నుండి జూన్ 2026 మధ్య కాలంలో మీ కార్డు ద్వారా రూ. 60,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయడం కంపల్సరీ.
పాస్పోర్ట్ ఫీజు పెంచిన విదేశాంగ మంత్రిత్వ శాఖ
విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 1 జూలై 2026 నుండి సాధారణ, తత్కాల్ పాస్పోర్ట్ల ఫీజులను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ పెంచిన ఫీజుల మార్పులు భారతదేశంలో అప్లై చేసుకునే వారితో పాటు విదేశాలలో నివసిస్తున్న భారతీయ దరఖాస్తుదారులకు కూడా వర్తిస్తాయి. ఈ నిర్ణయం వల్ల ఇకపై కొత్త పాస్పోర్ట్ తీసుకోవడం లేదా పాతది రీన్యూ చేయించుకోవడం మునుపటి కంటే చాలా ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది.
బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ మిస్ సెల్లింగ్పై ఆర్బీఐ కొత్త నిబంధనలు
బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మిస్ సెల్లింగ్ అంటే తప్పుదారి పట్టించి ప్రొడక్ట్స్ అమ్మడాన్ని అరికట్టడానికి ఈ రూల్స్ హెల్ప్ అవుతాయి.
1 జూలై 2026 నుండి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, ఏదైనా బ్యాంక్ ఒక కస్టమర్కు తప్పుడు సమాచారం ఇచ్చి లేదా తప్పుడు పద్ధతిలో ఏదైనా ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అమ్మినట్లు రుజువైతే, ఆ కస్టమర్కు పూర్తి రీఫండ్ పొందే హక్కు ఉంటుంది. అంతేకాదు, ఆ మిస్ సెల్లింగ్ వల్ల కస్టమర్కు జరిగిన నష్టానికి బ్యాంక్ నుండి పూర్తి పరిహారం కూడా లభిస్తుంది.

