జిగేల్ జిగేల్.. మొదలైన ‘ఆటో’ సంరంభం
ఆటో ఎక్స్ పో 2020 సంరంభం మొదలైంది. దక్షిణ కొరియా మేజర్ కియా మోటార్స్ ‘కార్నివాల్’ను ఆవిష్కరిస్తే, టాటా మోటార్స్ సైర్రా కాన్సెప్ట్ తదితర కార్లను ప్రదర్శించింది. హ్యుండాయ్, మారుతి, మహీంద్రా కార్లు సైతం ప్రదర్శనలో ఉన్నాయి. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్లకు ఈ ఎక్స్ పో ప్రత్యేకతగా నిలువనున్నది.
న్యూఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ప్రదర్శనకు హస్తిన ముస్తాబైంది. దేశ రాజధాని న్యూఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో 2020 సంరంభానికి తెరలేచింది. ఈ వేడుకకు ప్రారంభ సన్నాహకం గా ఫిబ్రవరి 5, 6 తేదీల్లో మీడియాకోసం పలు వాహనాలు కొలువు దీరాయి. ముఖ్యంగా మహీంద్ర, మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుండాయ్తో పాటో, ఫ్రెంచ్ తయారీ దారు రెనాల్ట్ తమ వాహనాలను ఆవిష్కరించాయి. బుధవారం నుంచి పలు కంపెనీలు కార్లను ప్రదర్శనకు పెడుతున్నాయి.
రెండేళ్లకోసారి జరిగే ఈ ఎక్స్పోపై దేశంలోని ఆటోమొబైల్ ప్రేమికుల కళ్లు ఉంటాయి. దీనికి తోడు ఈ ఏడాది ఏప్రిల్లో బీఎస్-6 నిబంధనలు అమల్లోకి రానుండటంతో ఈ ఆటో ఎక్స్పోలో భారీ సంఖ్యలో కొత్త వాహనాలు విడుదల కానున్నాయి. మారుతీ సుజుకీ విటార బ్రెజా, ఈ కాన్సెప్ట్ను ప్రదర్శనకు ఉంచనున్నది. టాటా మోటార్స్ గ్రావిటాస్, విద్యుత్ ఆల్ట్రోజ్-ఈ వెర్షన్ ప్రదర్శనకు వస్తున్నాయి. ఇప్పటికే ఐఈఎం వేదిక వద్దకు సరికొత్త వాహనాలను కంపెనీలు చేరుస్తున్నాయి.
ఆటోఎక్స్పో కార్యక్రమంలో 7వ తేదీ కేవలం వ్యాపార వర్గాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. నాడు ఒక్కో వ్యక్తికి రూ.750 ఫీజు వసూలు చేస్తారు. ఇక 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రూ.350- రూ.475 వసూలు చేస్తారు. ఈ టికెట్లను ఆటోఎక్స్పో వెబ్సైట్ నుంచి కానీ, బుక్మైషో నుంచి కానీ కొనుగోలు చేయవచ్చు.
ఈ సారి ఆటోఎక్స్పో 2020లో టాటా మోటార్స్, వెస్పా, హ్యుండాయ్, హీరో ఎలక్ట్రిక్, కియా, మహీంద్రా, మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, ఎంజీ హెక్టార్, రేనాల్ట్, స్కోడా, ఎస్ఎంఎల్ ఇసుజూ, వోక్స్వ్యాగన్ కంపెనీలతోపాటు డ్రూమ్, ఫేస్బుక్, జియో, జేకే టైర్స్, పిర్లె, రోల్కో టైర్స్, ది ఆటోమోటీవ్ రీసెర్చి అసోసియేషన్లు కొలువుదీరనున్నాయి. మిషన్ గ్రీన్ మిలియన్లో భాగంగా వచ్చే సంవత్సరాల్లో 10 లక్షల గ్రీన్ కార్లను ( సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్) విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మారుతి వెల్లడించింది.
ఈ రోజు మారుతి సుజుకి ఇండియా బుధవారం ఫ్యూటురో-ఇ కాన్సెప్ట్ను ఆవిష్కరించింది. ఇప్పటికే హ్యుండాయ్ ఇండియా లే ఫిల్ రూజ్ కాన్సెప్ట్ను ప్రదర్శించింది. దక్షిణకొరియా దిగ్గజం కియా మోటార్స్ ప్రీమియం సెగ్మెంట్లో మల్టీ పర్పస్ వెహికల్ కార్నివాల్ని లాంచ్ చేసింది. దీంతోపాటు గ్లోబల్ ఎస్యూవీ ‘సోనెట్’ ను కూడా ప్రదర్శించింది.
హ్యుండాయ్ సరికొత్త క్రెటా, ఐ20లను ఆటో ఎక్స్పోలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ రెండు కార్లు బీఎస్-6 ఇంజిన్తో సిద్ధమైనవే. మహీంద్రా అండ్ మహీంద్రా మూడు ఎస్యూవీలను దీనిలో ప్రదర్శనకు ఉంచనుంది. వీటిల్లో థార్, ఎక్స్యూవీ 500, స్కార్పియో వాహనాలు ఉన్నాయి. స్కార్పియో, థార్ వాహనాలు బీఎస్-6 ఇంజిన్తో, ఎక్స్యూవీ500, అప్గ్రేడ్లతో విడుదల కానుంది. ఎంజీ మోటార్స్ ఏడు సీట్ల వాహనాన్ని ప్రదర్శనకు తేనుంది.
టాటామోటార్స్ ఫ్రీడం ఇన్ప్యూచర్ మొబిలిటీ అనే కాన్సెప్ట్తో 13 కార్లను ప్రదర్శించింది. ఢిల్లీ సమీప ప్రాంతాల వారు క్యాబ్లో, కార్పూల్ సౌకర్యాన్ని వినియోగించుకొని వెళ్లవచ్చు. విమాన మార్గంలో వచ్చేవారు తొలుత న్యూఢాల్లీ విమానాశ్రయానికి చేరుకోవాలి. అక్కడి నుంచి వేదిక 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ లైన్లో మెట్రో స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి.. అక్కడి నుంచి బొటానికల్ గార్డెన్ స్టేషన్ చేరుకోవాలి. అక్కడి నుంచి షటిల్ బస్సుల్లో వేదికకు చేరుకోవచ్చు. నేరుగా క్యాబ్ మార్గంలో కూడా వేదిక వద్దకు చేరుకోవచ్చు. భారత్లో ఆటో ఎక్స్పో తొలిసారి 1986 జనవరి మూడో తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ది ఆటోమోటీవ్ కాంపోనెంట్ మ్యానిఫాక్చర్స్ అసోసియేషన్(ఏసీఎంఏ), కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ మ్యానిఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహిస్తాయి.
1998 నుంచి ప్రతి రెండేళ్లకు దీనిని నిర్వహించడం సంప్రదాయంగా మారింది. ఈ సారి ఆటోఎక్స్పోను గ్రేటర్ నోయిడాలో నాలెడ్జి పార్క్2లో ఉన్న ఇండియన్ ఎక్స్పో మార్ట్లోని 2,35,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్వహిస్తున్నారు. అసలు కార్యక్రమాలు ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు జరుగుతాయి. ఈ ఎక్స్పోలో సాధారణ ప్రజలను ఫిబ్రవరి 8 నుంచి 12వ తేదీ వరకు ఉదయం 11 నుంచి రాత్రి 8గంటల వరకు అనుమతిస్తారు.