Lunar Eclipse 2026: చంద్ర గ్రహణం వచ్చేస్తోంది.. ఆ రోజు గర్భిణులు ఈ పనులు చేయకూడదట
Lunar Eclipse 2026: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం వచ్చేస్తోంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. గ్రహణ సమయంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పనులు చేయకూడదో తెలుసుకోండి.

చంద్రగ్రహణం ఎప్పుడు?
2026 ఏడాది వచ్చాక మొదటి చంద్రగ్రహణం మార్చి 3న ఏర్పడనుంది. ఇది భారతదేశంలో పాక్షికంగానే కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. మత విశ్వాసాల ప్రకారం, గ్రహణం పట్టాక గర్భిణీలు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని చెబుతారు. పూర్తిగా ఇంట్లోనే ఉండటం సురక్షితం. ఎంతో శుభప్రదం కూడా. ఆ సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం తల్లి, బిడ్డ ఇద్దరికీ మంచిదని అంటారు.
ఈ గ్రహణం మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు పూర్తవుతుంది. అంటే గ్రహణం మూడు గంట 27 నిమిషాల పాటూ ఉంటుంది.
గ్రహణం పట్టాక ఏం చేయాలి?
గ్రహణం పట్టాక దేవుడి నామాన్ని జపించడం ఎంతో మంచిది. 'ఓం నమః శివాయ' లేదా గాయత్రీ మంత్రం వంటివి జపించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఈ సమయంలో కంద షష్ఠి కవచం, లలితా సహస్రనామం పారాయణం చేయడం మంచిదని పండితులు చెబుతారు. చదువురాని వారు ఈమంత్రాలను వినడం వల్ల విశేష ఫలితాలు అందుతాయి.
గర్భిణులు ఏం చేయాలి?
గ్రహణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ గర్భంపై విభూది (పవిత్రమైన బూడిద) రాసుకుంటే మంచిదనే నమ్మకం ఉంది. ఇది గర్భంలోని శిశువును కాపాడుతుందని ఎంతో మంది నమ్మకం. ఇలా చేయడం వల్ల ఎలాంటి హాని ఉండదు. కాబట్టి రాసుకుంటే మంచిదే. ఇది గ్రహణం వల్ల కలిగే దోషాలను తగ్గిస్తుందని కూడా అంటారు. ఇక గ్రహణ కిరణాలు గర్భంపై పడకుండా చూసుకోవాలని కూడా పండితులు చెబుతున్నారు. ఇంట్లో కిటికీలు, తలుపులు మూస ఉండడం మంచిదని వివరిస్తున్నారు.
ఈ వస్తువులు వాడకూడదు
గ్రహణ సమయంలో గర్భిణులు కత్తి, కత్తెర లేదా సూది వంటి పదునైన వస్తువులను తాకకూడదు. ఆరుబయట నిలబడి గ్రహణాన్ని చూడడం కూడా ఏమాత్రం మంచిది కాదు. గ్రహణ సమయంలో నిద్రపోవడం వంటివి చేయకుండా… ఇష్ట దైవాన్ని తలచుకోవాలి. లేదా ధ్యానం చేయడం మంచిది.
ఏం చేయాలి? ఏ చేయకూడదు?
గ్రహణానికి 9 గంటల ముందే సూతక కాలం మొదలైపోతుంది ఆ సమయంలో వంట చేయడం, ఆహారం తినడం వంటివి చేయకూడదనే ఆచారం ఉంది. చాలా మంది గ్రహణానికి ముందు తమ ఆహారంలో తులసి ఆకులు, దర్భ గడ్డిని వేస్తారు. ఇది ఆహారం విషపూరితం కాకుండా నివారిస్తుందని నమ్మకం. గ్రహణ సమయంలో వండిన ఆహారాన్ని తినడం మానేయాలని చెబుతారు. అందుకే ఆహారంలో దర్భ గడ్డి లేదా తులసి ఆకులను వేసి ఉంచుతారు.
గ్రహణం ముగిసిన తర్వాత తలకు స్నానం చేసి, గుడికి వెళ్లడం మంచిది. గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే దీపం వెలిగించి దేవుడిని పూజించాలి. తగినంత నీరు తాగాలి. ప్రశాంతంగా కూర్చుని దైవారాధన చేసుకోవాలి.
