చంద్రబాబును మట్టి కరిపించిన తండ్రీ కొడుకులు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో 2004 ఎన్నికల్లో, వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ చేతిలో 2019 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓటమి పాలయ్యారు. 2019లో ఏపీ ప్రజలు జగన్ పార్టీకి ఘన విజయాన్ని చేకూర్చారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004 ఎన్నికలకు ముందు సీఎల్పీ లీడర్గా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అప్పటికే సుమారు 9 ఏళ్లకు పైగా చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నారు.విద్యుత్ చార్జీల పెంపు, వరుస కరవు పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో వైఎస్ఆర్ నిర్వహించిన పాదయాత్ర ఆ పార్టీకి కలిసొచ్చింది.
నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే చంద్రబాబునాయుడు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ, సీపీఐఎం, టీఆర్ఎస్లు ఎన్నికల పొత్తు పెట్టుకొన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆ సమయంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
2009 ఎన్నికల్లో కూడ రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టీడీపీ సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్లతో మహాకూటమిగా పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలయ్యారు. రెండోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
2014 ఎన్నికల్లో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓటమి పాలయ్యాడు.
2004 ఎన్నికల్లో వైఎస్ఆర్ చేతిలో, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ చేతిలో చంద్రబాబునాయుడు ఓటమి పాలయ్యాడు. 1999 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు చేతిలో వైఎస్ఆర్, 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు చేతిలో జగన్ ఓటమి పాలయ్యారు.