వెంట నడిచినవారికి జగన్ కీలక పదవులు?
పాదయాత్రలు చేసిన నేతలు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రులుగా పదవులు స్వీకరించారు. ఆయా పార్టీలకు చెందిన నేతల పాదయాత్రల్లో కీలకంగా వ్యవహరించిన ద్వితీయ శ్రేణి నేతలకు అధికారంలోకి వచ్చిన వెంటనే కీలకమైన పదవులు దక్కాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుధీర్ఘ పాలన చేసిన వైఎస్ జగన్కు వెన్నంటి నిలిచిన వైసీపీ నేతలకు జగన్ ఏ రకమైన పదవులను కట్టబెడతారోననే చర్చ సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడులు పాదయాత్రలు నిర్వహించారు. అవశేష ఆంధ్రప్రదేవ్ రాష్ట్రంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సుధీర్ఘంగా పాదయాత్ర నిర్వహించారు. వైఎస్ఆర్, చంద్రబాబునాయుడుల పాదయాత్రల్లో పనిచేసిన ఆ పార్టీల నేతలు, కార్యకర్తలకు ఆ ఇద్దరు నేతలు కూడ పదవులు కట్టబెట్టారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో సీఎల్పీ నేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్ 9వ తేదీన పాదయాత్రను ప్రారంభించారు. 68 రోజుల పాటు వైఎస్ఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను సాగించారు. రాష్ట్రంలోని 1475 కిలోమీటర్ల మేర వైఎస్ఆర్ పాదయాత్రను సాగించారు. ఈ పాదయాత్ర కారణంగానే 2004 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
ఆనాడు రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్ల నుండి వైఎస్ఆర్ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో తన వెంట నడిచిన నేతలకు అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కీలక పదవులు కట్టబెట్టారు.
ప్రస్తుతం మహేశ్వరం నుండి ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నుండి ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డిలకు వైఎస్ఆర్ మంచి గుర్తింపు ఇచ్చారు. సుధీర్ రెడ్డికి హుడా ఛైర్మెన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఎల్బీనగర్ నుండి టిక్కెట్టు ఇచ్చారు. సబితా ఇంద్రారెడ్డికి హోమ్ మంత్రి, మైన్స్ శాఖను కేటాయించారు. వైఎస్ఆర్ పాదయాత్రలో మొత్తం లగడపాటి రాజగోపాల్ కొనసాగారు.
ఆ పాదయాత్రలో కొనసాగిన రాజగోపాల్కు 2004 లో విజయవాడ ఎంపీ టిక్కెట్టు దక్కింది. 2009 లో విజయవాడ ఎంపీ టిక్కెట్టు ఆయనకే దక్కింది. సంఘీకి రాజ్యసభ పదవి దక్కింది. ఈ రకంగా ఆయా జిల్లాల్లో కీలకంగా వ్యవహరించిన నేతలకు వైఎస్ఆర్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఆదుకొన్నారు.
2004,2009 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైన చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి పాదయాత్రను అస్త్రంగా ఎంచుకొన్నారు. 2012 అక్టోబర్ రెండో తేదీన అనంతపురం జిల్లా హిందూపురం నుండి వస్తున్నా మీ కోసం అంటూ పాదయాత్రను ప్రారంభించారు.ఉమ్మడిఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలలోగుండా 2817కిలోమీటర్లు పాదయాత్ర చేసి రికార్డ్ నెలకొల్పారు.
1253 గ్రామాలను , 162 మండలాలను 16 అసెంబ్లీ నియోజకవర్గాలలోని ప్రజలను చంద్రబాబు కలుసుకున్నారు. చంద్రబాబునాయుడు 2800 కి.మీ పాదయాత్ర నిర్వహించారు.చంద్రబాబు పాదయాత్ర 2013 ఏప్రిల్ 28న విశాఖలోని అగనంపూడి వద్ద ముగిసింది. ఈ పాదయాత్ర సమయంలోనే రైతులకు రుణ మాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణాలను మాఫీ చేస్తానని బాబు హామీఇచ్చారు.
పాదయాత్రలో వెన్నంటి నడిచిన కార్యకర్తలు, నేతలకు చంద్రబాబునాయుడు ఏపీలో పదవులు కట్టబెట్టారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ నేతకు నామినేటేడ్ పదవి ఇచ్చారు. చాలా మంది నేతలకు టిక్కెట్లను ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభం నుండి ముగింపు వరకు ఉన్న కోటేశ్వరరావుకు వికలాంగుల సంస్థ ఛైర్మెన్ పదవిని ఇచ్చారు. చాలా మంది నేతలకు ఆయా స్థాయిల్లో నామినేటేడ్ పదవులు కట్టబెట్టారు. కొందరికి ఎమ్మెల్యేలుగా టిక్కెట్లను కేటాయించారు.మరికొందరికి పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చారు.
అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ 2017 నవంబర్ 6వ తేదీ నుండి 341 రోజుల పాటు ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. 3,648 కి.మీ నడిచి చంద్రబాబు రికార్డును జగన్ బద్దలు కొట్టారు. ఈ పాదయాత్రను జగన్ ఈ ఏడాది జనవరి 10వ తేదీన ముగించారు. జగన్ పాదయాత్ర వెంట జిల్లాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. వీరే కాకుండా పాదయాత్ర ప్రారంభం నుండి ముగింపు వరకు ఉన్న నేతలకు జగన్ కీలక పదవులను కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదని వైసీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.