ఎపి అసెంబ్లీ ఎన్నికలు: లగడపాటి సర్వే మిస్ ఫైర్ అవుతుందా?
ఆంధ్ర ఆక్టోపస్, మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వే మిస్ ఫైర్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సర్వే నిర్వహించిన తీరే ఈ అనుమానాలకు కారణమని సెఫాలిజిస్టులు అంటున్నారు.
అమరావతి: ఆంధ్ర ఆక్టోపస్, మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వే మిస్ ఫైర్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సర్వే నిర్వహించిన తీరే ఈ అనుమానాలకు కారణమని సెఫాలిజిస్టులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అంచనా వేసిన విషయం తెలిసిందే.
ఆర్ జీ ఫ్లాష్ టీమ్ పేరుతో తాను సర్వే చేసినట్లు లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు. అయితే, ఆ సంస్థ నిర్వాహకుడైన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ తాను ఏ విధమైన సర్వే చేయలేదని ప్రకటించినట్లు ఒక సెక్షన్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆర్ జీ ఫ్లాష్ టీమ్ పేరుతోనే లగడపాటి రాజగోపాల్ సర్వే వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలున్నాయి. అయితే లగడపాటి కేవలం 38 స్థానాల్లోనే సర్వే చేసినట్లు, 50 వేల శాంపిల్స్ తీసుకున్నట్లు, అది కూడా మూడు జిల్లాల్లోనే సర్వే చేసినట్లు చెబుతున్నారు. ఈ పరిమిత శాంపిల్ సర్వే రాష్ట్రం యావత్తూ ఫలితాలను ప్రతిబింబిస్తుందా అనేది ప్రధానమైన ప్రశ్న.
తెలుగుదేశం పార్టీకి 100 స్థానాలకు 10 అటూ ఇటుగా వస్తాయని లగడపాటి చెప్పారు. అంటే తెలుగుదేశం పార్టీకి 90 లేదా 110 స్థానాల మధ్య రావచ్చునని ఆయన తేల్చారు. ఇంత మార్జిన్ తో ఫలితాలను అంచనా వేయడాన్ని బట్టి కూడా ఆయన సర్వేపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.