నారా లోకేష్ ఓటమి: ఓటమిబాట పట్టిన మంత్రులు వీరే....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ మంత్రులు కొట్టుకుపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేబినేట్ లో కీలక శాఖలో పనిచేసిన మంత్రులు ఘోరంగా ఓటమి చవి చూశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ మంత్రులు కొట్టుకుపోయారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేబినేట్ లో కీలక శాఖలో పనిచేసిన మంత్రులు ఘోరంగా ఓటమి చవి చూశారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కళా వెంకట్రావు ఘోరంగా ఓటమి పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కళా వెంకట్రావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధినేతగా ఉంటూ ఆయన ఓటమి పాలవ్వడంతో టీడీపీలో నిరాశ నెలకొంది
ఇకపోతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ అండ్ పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఓటమి పాలయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు అయిన నారా లోకేష్ చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రుల్లో ఒకరు.
తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నారా లోకేష్ పై ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే 5వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.
చంద్రబాబు కేబినెట్ లో మరో కీలక మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. దేవినేని ఉమా మహేశ్వరరావు కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఆయన ఘోరంగా ఓటమి పాలయ్యారు. చంద్రబాబు కేబినెట్ లో దేవినేని ఉమా మహేశ్వరరావు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ కేబినెట్ లో మరో కీలక మంత్రి పి.నారాయణ. చంద్రబాబు కేబినెట్ లో పురపాలక శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయన నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశారు. నారాయణపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. మంత్రి నారాయణపై కేవలం 800 ఓట్ల మెజారిటీతోనే అనిల్ కుమార్ యాదవ్ గెలుపొందారు.
ఏపీ కేబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్న భూమా అఖిలప్రియ సైతం ఓటమి పాలయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమె తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గంగుల బిజేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా అనంతరం మంత్రిగా ప్రమోషన్ పొందారు కాల్వ శ్రీనివాసులు. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ప్రస్తుతం గృహనిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో సాంఘీక సంక్షేమశాఖ మంత్రిగా పనిచేస్తున్న నక్కా ఆనందబాబు సైతం ఓటమిబాట పట్టారు. నక్కా ఆనందబాబు గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరుగ నాగార్జున చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు.
ఇకపోతే మరోమంత్రి కొత్తపల్లి జవహర్. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను ఇరకాటం పెట్టడంలో దిట్ట. గత ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రిపదవికొట్టేసిన ఈయనకు అక్కడ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు విముఖత వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలోని తిరువురు నియోజకవర్గం కేటాయించారు. తిరువూరు నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆయన వైసీపీ అభ్యర్థి కె.రక్షణనిధి చేతిలో ఓటమిపాలయ్యారు.
కొల్లు రవీంద్ర న్యాయశాఖ మరియు క్రీడల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఈయన కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయిన పేర్ని నాని చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇకపోతే చంద్రబాబు నాయుడు కేబినెట్ లో అత్యంత కీలకమైన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏపీ కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయన ఈసారి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆయన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్థన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
2014 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాను తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. దాంతో ఆచం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన పితాని సత్యనారాయణకు మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో కూడా పితాని సత్యనారాయణ ఆచంట నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. అయితే వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగ నాథరాజు చేతిలో ఓటమిపాలయ్యారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి అయిపోయారు ఆదినారాయణరెడ్డి. 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిలెక్కేశారు.
వెంటనే చంద్రబాబు ఆయనకు కేబినెట్ లో అవకాశం కల్పించారు. మార్కెటింగ్ శాఖ కట్టబెట్టారు. ఈసారి ఆదినారాయణ రెడ్డి కడప లోక్ సభకు పోటీ చేశారు. అయితే వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆదినారాయణ రెడ్డిపై అవినాష్ రెడ్డి రెండు లక్షలకు పైగా ఓట్లమెజారిటీతో విజయం సాధించారు.
ఇకపోతే ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత సుజయ్ కృష్ణా రంగారావు. 2014 ఎన్నికల్లో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరి మంత్రి అయిపోయారు
ఏపీ సీఎంచంద్రబాబు ఏకంగా కీలకమైన భూగర్భగనుల శాఖను సుజయ్ కృష్ణారంగరావుకు కట్టబెట్టారు. 2019 ఎన్నికల్లో కూడా బొబ్బిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి శంభంగి వెంకట చిన అప్పలనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు.
అటు చిత్తూరు జిల్లాకు చెందిన మరోమంత్రి అమర్నాథ్ రెడ్డి. 2014లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అనంతరం చంద్రబాబు కేబినెట్ లో ఇండస్ట్రీయల్ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. అయితే 2019 ఎన్నికల్లో కూడా పలమనేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వెంకటయ్య గౌడ్ చేతిలో పరాజయం పాలయ్యారు.
ఇకపోతే మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు చంద్రబాబు కేబినెట్ లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలుపొందిన ఈయన 2019 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విడదల రజనీ చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ప్రత్తిపాటి పుల్లారావుపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల రజనీ 8వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
తెలుగుదేశం పార్టీలో కీలక నేత, మంత్రి అయ్యన్నపాత్రుడు సైతం ఓటమి పాలయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీలో అసమ్మతి, కుటుంబంలో ఆధిపత్యపోరు నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు అపజయం పాలవ్వాల్సి వచ్చింది. మెుత్తానికి 2019 అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలకు చుక్కలు చూపించాయని మాత్రం చెప్పుకోవచ్చు.