సైకిలెక్కిన వైసీపీ ఎమ్మెల్యేలకు గడ్డి పెట్టిన ఓటర్లు
గత ఎన్నికల్లో జగన్ ఫోటో పెట్టుకుని గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వీరిలో ఇద్దరు మరణించారు.. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చిన 21 మందిలో 16 మందికి టీడీపీ టిక్కెట్లు ఇచ్చింది. ప్రజలు వీరిని చిత్తు చిత్తుగా ఓడించారు. ఒక్క గొట్టిపాటి రవి కుమార్ మాత్రమే గెలుపొందారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి శ్రీశైలం అభ్యర్ధిగా గెలుపొందిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. తాజా ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్ధి వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి చేతిలో ఓడిపోయారు.
గతంలో చంద్రబాబుపై తరచుగా విమర్శలు చేసిన విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరడం సంచలనం కలిగించింది. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం టిక్కెట్పై పోటీ చేసిన ఆమె వైసీపీ అభ్యర్ధి భాగ్యలక్ష్మీ చేతిలో 40,930 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
కృష్ణా జిల్లా పామర్రు నియోజక వర్గం టిడిపి నుంచి పోటీ చేసిన ఉప్పులేటి కల్పన వైసిపి అభ్యర్ధి కైలా అనిల్ కుమార్పై 32,961 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది.
విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి వైసిపి నుంచి విజయం సాధించిన జలీల్ ఖాన్ టిడిపిలో చేరారు. ఆయన స్థానంలో పోటీకి దిగిన జలీల్ ఖాన్ కుమార్తె షబానా ముజరాత్ కతూన్ వైసిపి అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో 7,456 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
గూడుర్ నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన ఫిరాయించిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ వైసిపి అభ్యర్ధి వెలగపల్లి వరప్రసాద్ చేతిలో 43,231 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
గిద్దలూరు నుంచి టిడిపి తరఫున పోటీ చేసిన అశోక్ రెడ్డి వైసిపి అభ్యర్థి ముత్తుముల్ల అన్నా రాంబాబు చేతిలో 78,316 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వైసిపి అభ్యర్థి జ్యోతుల విష్ణు సత్య మార్తాండరావు చేతిలో 23,365 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అద్దంకి నుంచి పార్టీ ఫిరాయిందుదారుడు గొట్టిపాటి రవికుమార్ మాత్రమే వైసిపి అభ్యర్ధి బచ్చిన చెంచు గరటయ్యపై 12,986 ఓట్లతో గెలిపొందారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గం నుంచి గెలుపొందిన మంత్రి ఆది నారాయణ రెడ్డి ఈ ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి వైఎస్ అవినాష్పై ఓటమి చెందారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరి.. మంత్రి పదవి పొందిన ఎన్ అమర్ నాధ్ రెడ్డి పలమనేరు నుంచి పోటీ చేసి 30,945 ఓట్లతో ఓటమి చెందారు.
వైసీపీ నుంచి గెలిచి పిన్న వయస్సులోనే మంత్రి పదవి పొందిన భూమా అఖిల ప్రియ.. ఆళ్లగడ్డలో వైసిపి అభ్యర్థి గంగుల బ్రిజేంద్రనాధ్ రెడ్డి చేతిలో 35,207 ఓట్లతో ఓటమి పాలయ్యారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన సీనియర్ నేత భూమా నాగిరెడ్డి ఆ తర్వాత కుమార్తె అఖిలప్రియతో కలిసి టీడీపీలో చేరారు. మంత్రివర్గ విస్తరణకు కొద్దిరోజుల ముందు ఆయన గుండెపోటుతో మరణించారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి పార్టీ ఫిరాయించిన మంత్రి సుజయ కృష్ణ రంగారావు వైసిపి అభ్యర్థి శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు చేతిలో 8042 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి వైసిపిపై గెలిచి అనంతరం టీడీపీలో చేరారు పోతుల రామారావు. తాజా ఎన్నికల్లో మానుగంట మహీధర్ రెడ్డి చేతిలో 11,765 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
విశాఖపట్నం జిల్లా అరకు నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో కిడారి సర్వేశ్వరరావు వైసిపి తరపున గెలిచి టిడిపిలో చేరారు. మావోయిస్టులు అతనిని హత్య చేయడంతో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ ఈ ఎన్నికల్లో పోటీ చేసి వైసిపి అభ్యర్థి చెట్టి ఫాల్గుణ చేతిలో 32,789 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
కర్నూలు జిల్లా కోడుమూరులో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశంలో చేరిన మణిగాంధీకి.. ఆ పార్టీ అధిష్టానం ఈసారి టికెట్ కేటాయించలేదు. గాంధీకి బదులుగా రామాంజనేయులను బరిలోకి దింపింది.
గత ఎన్నికల్లో వైసీపీ టికెట్పై గెలిచిన అత్తార్ చాంద్ బాషా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో తాజా ఎన్నికల్లో బాషాకు బదులుగా కందికుంట వెంకటప్రసాద్కు టికెట్ కేటాయించారు.
గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి వైసీపీ టికెట్పై గెలిచిన కలమట వెంకట రమణ అనంతరం టీడీపీలో చేరారు. తాజా ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్ధి రెడ్డి శాంతి చేతిలో ఓటమి పాలయ్యారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి రంపచోడవరంలో గెలిచిన వంతల రాజేశ్వరి అనంతరకాలంలో టీడీపీలో చేరారు. తాజా ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చే క్రమంలో పలువురు నేతల నుంచి గట్టి వ్యతిరేకత రావడంతో రాజేశ్వరిని చంద్రబాబు పక్కనబెట్టారు. ఆమెకు బదులుగా కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజుకు టికెట్ కేటాయించారు.
గత ఎన్నికల్లో కర్నూలు నుంచి గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి అనంతరం టీడీపీలో చేరారు. అయితే తాజా ఎన్నికల్లో టికెట్ కోసం టీజీ ఫ్యామిలీతో పోరాటం చేశారు. అయినప్పటికి చంద్రబాబు పట్టించుకోకపోవడంతో తిరిగి వైసీపీ గూటికే వెళ్లారు.
2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ అభ్యర్ధిగా గెలిచిన డేవిడ్ రాజు.. తర్వాత టీడీపీలో చేరారు. తాజా ఎన్నికల్లో సంతనూతలపాడు టికెట్ను ఆయన ఆశించారు. అయితే అందుకు చంద్రబాబు నిరాకరించడంతో బాపట్ల నుంచి బీఎస్పీ ఎంపీగా నామినేషన్ వేసి... మరోసారి వైసీపీలో చేరిపోయారు.
కడప జిల్లా బద్వేల్ నియోజక వర్గం నుంచి వైసిపి తరపున గెలిచిన త్రివేది జయరాములు టిడిపిలో చేరారు. ఈ ఎన్నికల్లో టిడిపి సీటు కేటాయించకపోవడంతో బిజెపి తరపున పోటీ చేసి ఓటమి చెందారు.
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి 2014లో వైసీపీ నుంచి గెలిచిన వరుపుల సుబ్బారావు అనంతరం టీడీపీలో చేరారు. అయితే అక్కడ తనకు సరైన ప్రాధాన్యం దక్కలేదనే అభిప్రాయంతో తిరిగి వైసీపీ గూటికి చేరారు.