రాయపాటి అలక, కుటుంబసభ్యులతో భేటీ: రంగంలోకి లగడపాటి, సుజనా
నరసరావుపేట లోక్సభ టీడీపీ అభ్యర్థి ఎంపికపై సందిగ్దత నెలకొంది. సీనియర్ నేత అయిన రాయపాటిని పక్కనపెట్టిన అధిష్టానం.. భాష్యం రామకృష్ణ పేరును పరిశీలిస్తోంది
: టిక్కెట్టు కేటాయింపు విషయమై చంద్రబాబునాయుడు ఎటూ తేల్చకపోవడంతో నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై కుటుంబసభ్యులతో చర్చిస్తున్నారు.
వైసీపీలో చేరాలని సన్నిహితులు తనను కోరుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. దీంతో టీడీపీ నాయకత్వం రాయపాటిని బుజ్జగించే ప్రయత్నాలను ప్రారంభించింది.మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో పాటు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్లు రాయపాటితో మంతనాలు జరుపుతున్నారు.
నర్సరావుపేట ఎంపీ స్థానం నుండి తాను పోటీకి సిద్దమని రాయపాటి సాంబశివరావు ప్రకటించినా కూడ చంద్రబాబునాయుడు మరో అభ్యర్ధి కోసం చూస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. భాష్యం సంస్థల అధినేత రామకృష్ణ పేరును ఈ స్థానం నుండి పోటీకి చంద్రబాబు పరిశీలించినట్టుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు నర్సరావుపేట ఎంపీ స్థానంతో పాటు తన కొడుకుకు సత్తెనపల్లి అసెంబ్లీ స్తానాన్ని కూడ కేటాయించాలని చంద్రబాబునాయుడును రాయపాటి కోరుతున్నారు.
అయితే సత్తెనపల్లి నుండి తాను మరోసారి బరిలోకి దిగుతున్నట్టుగా కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. నర్సరావుపేట ఎంపీ స్థానం విషయమై ఇంకా తేల్చలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రాయపాటి అలకబూనారు. కుటుంబసభ్యులతో భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు.
రాయపాటి సాంబశివరావుతో సోదరుడు రాయపాటి శ్రీనివాస్ కూడ భేటీ అయ్యారు.. ఈ విషయం తెలిసిన వెంటే రాయపాటి అనుచరులు, అభిమానులు ఆయన ఇంటికి చేరుకొంటున్నారు. తాజా పరిస్థితులపై ఆయన చర్చిస్తున్నారు.
రాయపాటి అలబూనిన విషయాన్ని తెలుసుకొన్న వెంటనే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాయపాటి ఇంటికి చేరుకొన్నారు. మరో వైపు రాయపాటిని బుజ్జగించేందుకు గాను మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడ రంగంలోకి దిగారు. రాయపాటిని బుజ్జగిస్తున్నారు.