ఫవన్ కల్యాణ్ జనసేన సినిమా అట్టర్ ఫ్లాప్
అమరావతి: టాలీవుడ్ లో తిరుగులేని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి చేరారు. 2009లో అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా ప్రజల్లోకి వెళ్లారు.
అమరావతి: టాలీవుడ్ లో తిరుగులేని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి చేరారు. 2009లో అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా ప్రజల్లోకి వెళ్లారు.
అయితే ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తన సత్తా చాటినప్పటికీ ఊహించినన్ని స్థానాలు గెలవలేకపోయింది. అలాగే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు.
రాష్ట్ర విభజ జరుగుతున్న తరుణంలో మళ్లీ పవన్ కళ్యాణ్ రాజకీయాలవైపు చూశారు. అంతే 2014లో జనసేన పార్టీని స్థాపించారు. 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారు.
హైదరాబాద్ మాదాపూర్ లోని హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్ లో అభిమానుల సమక్షంలో ఆవిర్భావ సభ నిర్వహించి పార్టీ పేరు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ ఆయన పార్టీ స్థాపిస్తున్నట్లు తెలిపారు.
2014 ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించినప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. అటు జాతీయ రాజకీయాల్లో బీజేపీకి మద్దతుగా నిలిచారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.
అనంతరం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తారని అంతా భావించారు. కానీ కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండటం, ఒక్కోసారి బయటకు రావడం ఒక ప్రెస్మీట్ పెట్టి వెళ్లిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో ప్రజలు పవన్ కళ్యాణ్ ను అంతగా విశ్వసించలేకపోయారు.
ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ కీలక సమయాల్లో ప్రజల పక్షాన ఉండకుండా పత్తా లేకుండా పోవడంతో ఆయన పట్ల ప్రజలు విముఖత చూపారు. ఇకపోతే శ్రీకాకుళం జిల్లాలోని ఏళ్ల తరబడి బాధపడుతున్న ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పవన్ అలుపెరగని పోరాటం చేశారు.
అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని గోదావరి ఆక్వాఫుడ్స్ పై ఉప్పెనలా ఉద్యమం చేశారు. ప్రత్యేక హోదాపై తనదైన శైలిలో గళం విప్పారు. ఇవన్నీ కేవలం అప్పుడప్పుడు చేసిన పనులు మాత్రమే. జనసేన పార్టీ టీడీపీతో పొత్తుపెట్టుకుందని టీడీపీ జనసేన ఒక్కటేనంటూ ప్రచారం వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యలోకి వచ్చేశారు.
ప్రజాపోరాట యాత్ర పేరుతో ఆయన రాష్ట్రమంతటా తిరిగేశారు. ఫుల్ టైం పొలిటీషియన్ గా మారిపోయారు. ఎన్నికల ప్రచారంలో తన పంచ్ లతో అధికార తెలుగుదేశం పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపించారు. ఇక ప్రతిపక్ష పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే తిట్టని రోజు లేకుండా తిట్టిపారేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనా, అధినేత జగన్మోహన్ రెడ్డిపైనా నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీపై ఆచితూచి పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడంతో దాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంది. టీడీపీతో జనసేన పొత్తు ఇంకా ఉంది అంటూ ప్రచారం చేసింది.
టీడీపీతో పొత్తు లేదని తమ పొత్తు వామపక్షాలతోనేనని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ టీడీపీ జనసేన పార్టీల మధ్య రహస్య ఒప్పందం నడుస్తోందంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది.
అంతేకాదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పంలోకానీ, మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయకపోవడంతోపాటు తొలుత అభ్యర్థిని పెట్టకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఆ తర్వాత లోకేష్ పై అభ్యర్థిని పెట్టాల్సి వచ్చింది. అలాగే చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం నియోజకవర్గంలో గానీ, గాజువాక నియోజకవర్గంలో గానీ ఎన్నికల ప్రచారం నిర్వహించకపోవడాన్ని జనసేన-టీడీపీల మధ్య రహస్య ఒప్పందంగా వైసీపీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోయింది.
దీంతో ఆ ఇరు పార్టీలమైత్రిపై పెద్దఎత్తున చర్చించుకునేలా చేసింది. ఇకపోతే రాజకీయాల్లో ఎంతో ఓర్పుగా ఉండాల్సిన పవన్ కళ్యాణ్ తాట తీస్తా, నడిరోడ్డుమీద కొడతా అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజలను దూరం చేశాయి.
ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రశ్నించేలా లేకపోవడంతోపాటు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉండటంతో ప్రజలు దూరమయ్యారు. కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్లు జనసేన పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఉభయగోదావరి జిల్లాలో అయితే పవన్ కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు సైతం ఉన్నారు. పవన్ కళ్యాణ్ గట్టిగా కష్టపడితే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సాధించిన 18 సీట్ల కంటే రెట్టింపు పైనే రావొచ్చు.
కానీ ఆయన అనుసరించిన విధానం, రాజకీయాల్లో వ్యహరించిన తీరు ప్రజలను కాస్త గందరగోళానికి గురి చేయడంతో ప్రజలు ఆయనను తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి పాలైనప్పటికీ ఓట్లశాతం చీల్చడంలో కీలక పాత్ర పోషించింది. జనసేన పార్టీ తన సత్తా చాటింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.