కసి కొద్దీ జగన్ కు ఓట్లు, పవన్ కు చుక్కలు: 120 సీట్లలో డిపాజిట్లు గల్లంతు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు కసి కొద్దీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఓట్లు వేసినట్లు కనిపిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చుక్కలు చూపించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు కసి కొద్దీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఓట్లు వేసినట్లు కనిపిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చుక్కలు చూపించారు. జనసేన రాష్ట్రంలోని 136 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తే 120 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది.
రాష్ట్రం మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన పార్టీకి కేవలం 21 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు దక్కిన ఓట్ల కన్నా నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి.
ఉభయ గోదావరి జిల్లాలు తమకే పట్టం కడుతాయని జనసేన నాయకులు ఆశించారు. పవన్ ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీకి కన్నా నోటాకు ఎక్కువ వచ్చిన ఓట్లు ఆరు దాకా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలతో పాటు విజయనగరం జిల్లాలోని సాలూరు, గజపతి నగరం నియోజకవర్గాలు, విశాఖ జిల్లాలోని మాడుగుల, పాడేరు నియోజకవర్గాల్లో జనసేనకు ఆ పరిస్థితి ఎదురైంది. పాడేరులో జనసేన పార్టీ కంటే స్వతంత్ర అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి.
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ విశాఖ జిల్లా పెందుర్తి, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో విజయం సాధించగా, 2019 ఎన్నికల్లో పోటీచేసిన జనసేన ఇక్కడ కనీసం డిపాజిట్లు దక్కించుకోలేదు. ప్రజారాజ్యం పార్టీ 13 జిల్లాల్లోని 16 నియోజకవర్గాల్లో గెలిచి, మరో 34 నియోజకవర్గాల్లో రెండో స్థానం దక్కించుకుంది.
జనసేన తూర్పు గోదావరి జిల్లాలోని ఒక్క రాజోలులో విజయం సాధించింది. కేవలం మూడు చోట్ల మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. గాజువాక, భీమవరంతో పాటు నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు. గాజువాక, భీమవరం స్థానాల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన విషయం తెలిసిందే.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకునేందుకు జూన్ మొదటి వారంలో పార్టీ అభ్యర్థులతో విజయవాడలో సమావేశాలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు.