టీడీపీ ఓటమి: చంద్రబాబు చేసిన తప్పులివే....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వంలో టీడీపీ ఓడిపోవడానికి గాను పలు కారణాలను రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబునాయుడు వ్యూహం ఘోరంగా విఫలమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దఫా వైసీపీకే ప్రజలు పట్టం కట్టాలని నిర్ణయం తీసుకొన్నారని ట్రెండ్స్ను చూస్తే స్పష్టంగా కన్పిస్తోంది. చంద్రబాబునాయుడు కేబినెట్లో ఉన్న మంత్రులు చాలా మంది వెనుకంజలో ఉన్నారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ వ్యూహత్మక తప్పిదాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ చీఫ్ చంద్రబాబునాయుడును బూచిగా చూపి సెంటిమెంట్ రగిల్చాడు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కూడ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జగన్, కేసీఆర్తో కుమ్మక్కు కావడం వల్ల ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ, ఈ ప్రచారాన్ని జనం నమ్మలేదని ఈ ట్రెండ్స్ను బట్టి అర్ధమౌతోంది.
ఆంధ్రుల పౌరుషాన్ని చూపాలని చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ప్రజలను కోరారు. కానీ, చంద్రబాబునాయుడు సెంటిమెంట్ను రగిల్చేందుకు చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం సఫలీకృతం కాలేదు.జగన్ను కేసీఆర్ తన సామంతరాజుగా చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడని చంద్రబాబు ప్రచారం చేశారు.ఈ ప్రచారం కూడ బాబుకు పలితం ఇవ్వలేదు. ఆంధ్రుల ఆత్మ గౌరవం అనే నినాదం మాత్రం ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు.
ప్రత్యేక హోదాపై చంద్రబాబునాయుడు యూ టర్న్ తీసుకొన్నాడని వైసీపీ పదే పదే విమర్శలు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్డీఏలో భాగస్వామ్యంతో ఉన్న కాలంలో ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబునాయుడు చేసిన కామెంట్స్ను వైసీపీ పదే పదే ప్రస్తావించింది. ఎన్డీఏ హయాంలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీకి చంద్రబాబునాయుడు ఒప్పుకొన్నాడు.
ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రాన్ని అభినందిస్తూ చంద్రబాబునాయుడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ సమయంలో ప్రత్యేక హోదా అంటూ ఆందోళనలు నిర్వహించిన వారిపై చంద్రబాబునాయుడు ప్రభుత్వం కేసులు పెట్టింది. ఈ సమయంలో వైసీపీ, జనసేనలు ఆందోళనలు నిర్వహించారు. ఈ సమయంలో ఆందోళనకారులపై కేసులు పెట్టడం వివాదాస్పదమైంది.
ప్రత్యేక హోదా విషయమై వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయడం... కేంద్రంపై అవిశ్వాసం అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారు. అయితే ఈ సమయంలో చంద్రబాబునాయుడు ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టారు. టీడీపీ ఎంపీలు మాత్రం రాజీనామాలు చేయలేదు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలను కూడ చంద్రబాబునాయుడు ఉత్తుత్తి రాజీనామాలు అంటూ విమర్శలు చేశారు.
ఎన్డీఏ నుండి చంద్రబాబునాయుడు బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నేతలు కూడ టీడీపీని లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కేంద్రం నుండి వచ్చిన నిధులకు మాత్రం టీడీపీ సర్కార్ లెక్క చెప్పడం లేదని బీజేపీ నేతలు విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర పథకాలకు కేంద్రం నుండి వచ్చిన నిధుల విషయంలో టీడీపీ సర్కార్ లెక్కలు చూపలేదని ఆరోపణలు చేశారు.
పోలవరం ప్రాజెక్టును కేసీఆర్ అడ్డుకొనే ప్రయత్నం చేస్తోంటే ఆయనకు జగన్ సహకరిస్తున్నాడని చంద్రబాబునాయుడు ఆరోపించారు. జగన్ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు నిలిచిపోనుందని చంద్రబాబు చేసిన ప్రచారం కూడ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం కన్పించలేదు. జగన్ సీఎంగా ఎన్నికైతే గుంటూరు నుండి రాజధానిని తరలిస్తారనే ప్రచారం కూడ ఏ మాత్రం ఫలితాలను ఇవ్వలేదని తేలింది.
పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడ పరోక్షంగా టీడీపీకి అనుకూలంగా ఉందనే భావన కూడ ప్రజల్లో వ్యక్తమైంది. జగన్పైనే పవన్ ఎక్కువగా విమర్శలు చేయడాన్ని కూడ వైసీపీ నేతలు పదే పదే ప్రస్తావించారు. అంతేకాదు చంద్రబాబుకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని... చంద్రబాబుకు పవన్ రహస్య మిత్రుడని వైసీపీ విమర్శలు చేసింది. ఈ ప్రభావం కూడ ప్రజల్లో కన్పించిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.