చంద్రబాబు తప్పుడు వ్యూహమే జగన్కు వరం
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి చంద్రబాబునాయుడు అనుసరించిన వ్యూహం కూడ కలిసి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఎక్కువ సమయం పాలన కోసం సమయాన్ని కేటాయించడం.... పార్టీని నిర్లక్ష్యం చేయడం వంటివి కూడ వైసీపీకి కలిసొచ్చినట్టుగా ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
2014 ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరమైంది. ఈ ఎన్నికల సమయంలో వైసీపీ అధికారానికి దూరం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల సమయంలో వైసీపీ చీఫ్ జగన్ తీసుకొన్న కొన్ని నిర్ణయాలు కూడ ఆ పార్టీని అధికారానికి దూరం చేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రైతులకు రుణమాఫీతో పాటు బీజేపీ, జనసేనలు టీడీపీకి మద్దతు ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో అమలు చేయలేని హామీలు ఇవ్వలేనని జగన్ ప్రకటించారు. అయితే ఆ సమయంలో అధికారంలోకి వచ్చిన టీడీపీకి, వైసీపీకి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉంది.
2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికైన చంద్రబాబునాయుడు తీసుకొన్న నిర్ణయాలు 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి కూడ కారణమయ్యాయి. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబునాయుడు యూ టర్న్ తీసుకొన్నారని వైసీపీ ఆరోపణలు చేసింది.
ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీకి ఒప్పుకొన్నామని చంద్రబాబునాయుడు తెలిపారు. కానీ, ఆ తర్వాత ప్రత్యేక హోదాపై చంద్రబాబునాయుడు పోరాటాలు నిర్వహించారు. ఈ విషయమై జనసేన, వైసీపీలు బాబుపై ఎదురుదాడికి దిగాయి.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రత్యేక హోదాపై మొదటి నుండి అదే వైఖరితో ఉన్నాడు. ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవి అంటూ ప్రచారం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతు ఇస్తామని జగన్ తేల్చిచెప్పారు.
2014 ఎన్నికల సమయానికి 2019 ఎన్నికల సమయానికి జగన్ తీరులో మార్పులు చోటు చేసుకొన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబునాయుడు ఎప్పుడూ సమీక్షలు, టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్ల పేరుతో పాలనకే ఎక్కువ సమయం కేటాయించారు.పార్టీకి తక్కువ సమయం కేటాయించారని పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
వైసీపీతో పాటు ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకు, మొదటి నుండి టీడీపీలోనే కొనసాగిన నేతల మధ్య సమన్వయ లోపం కూడ కొన్ని జిల్లాల్లో స్పష్టంగా కన్పించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే సమయంలో సంక్షేమ పథకాలపై బాబు కేంద్రీకరించారు.
ఆయా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయలోపం... పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొంటున్నామని చెప్పేవాడు. కానీ, ఆ నివేదికల ఆధారంగా పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోలేకపోయారనేది చంద్రబాబుపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది.
చంద్రబాబునాయుడు చుట్టూ ఉండే కోటరి..... అధికారులు చెప్పే మాటలను మాత్రమే వినేవారని బాబుపై విమర్శలు ఉన్నాయి. పట్టిసీమ, పోలవరంతో పాటు ప్రాజెక్టులు కూడ తమకు ఓట్లను కురిపిస్తాయని చంద్రబాబు ఆశఆలు పెట్టుకొన్నారు. కానీ, ఈ ఆశలు మాత్రం నెరవేరలేదు.
పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చుతోందని టీడీపీ వర్గాలు భావించాయి.కానీ, జనసేన పరోక్షంగా చంద్రబాబుకు సహకరించేందుకు అనే భావనను వైసీపీ ప్రజలు నమ్మించేలా చేసింది.
ఏపీలో సెంటిమెంట్ను రగిల్చేందుకు చంద్రబాబునాయుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత ఎన్నికల సమయంలో జగన్ చేసిన తప్పిదాలు చంద్రబాబుకు కలిసివచ్చాయి. ఈ ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలు వైసీపీకి కలిసొచ్చాయి.