చంద్రబాబు, జగన్ మధ్యే ఫైట్: సోదిలో లేని పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీల అధినేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీల అధినేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సీఎం చంద్రబాబు వయసును సైతం లెక్క చేయకుండా మండుటెండల్లో రోజుకు మూడు, నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అటు వైసీపీ చీఫ్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. సీఎంపైనా, టీడీపీ నేతలపైనా వాడివేడి విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు.
పార్టీ పెట్టిన ఐదేళ్లకు ఎన్నికల బరిలో నిలుస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ సమయంలో క్షణం తీరిక లేకుండా కష్టపడాల్సింది పోయి.. పార్టీ ఆఫీస్ దాటడం లేదు. తీరిగ్గా పొత్తుల చర్చలు జరుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. నేటి వరకు రాష్ట్రంలోని లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులనే ఇంకా ఖరారు చేయలేదు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పవన్ ఒకే ఒక్క బహిరంగ సభలో పాల్గొన్నారు అది కూడా పార్టీ ఆవిర్భావ సభ. ఆ బహిరంగ సభలో పార్టీ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను పవన్ జనం ముందుంచారు. ఆ తర్వాత అమరావతిలోని పార్టీ కార్యాలయం దాటి బయటకు రావడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన పేరుని చూసుకోవాలని తాపత్రయ పడతున్న పవన్ కల్యాణ్ అందుకు సంబంధించి సరైన ప్రయత్నాలు చేయడం లేదు. జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం అనేది ఈ పాటికే పూర్తయిపోయి ఉండాలి
తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు బాలకృష్ణ మరికొందరు నేతలు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. అలాగే వైసీపీలో పార్టీ అధినేత వైఎస్ జగన్, రోజాతో పాటు మంచి వాగ్థాటి కలిగిన నేతలున్నారు. అయితే జనసేన విషయంలో మాత్రం పవన్ ఒక్కరే స్టార్ క్యాంపెయినర్.. అధినేతగా పార్టీ వ్యవహారాలు చక్కబెడుతూనే అభ్యర్థుల ఎంపిక, ప్రచారం అన్ని ఆయనే చూసుకోవాలి. ఇది పవన్కు పెద్ద సమస్యగా మారింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీలో చేరినా ఆయనను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై జనసేనానికి అవగాహన లేదు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సరళిపై జాతీయ మీడియా చేస్తున్న సర్వేల్లో టీడీపీ, వైసీపీల గురించే వినిపిస్తుంది తప్పించి జనసేన సోదిలో కూడా లేదు. మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ముందు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పవన్ విఫలమవుతున్నారు. సోషల్ మీడియాతో పాటు మీడియాలో ప్రచారం విషయంలో పవన్ బాగా వెనుకబడిపోయారు