ఆషాఢం తర్వాత జగన్ మంత్రివర్గ విస్తరణ: తెరపైకి వచ్చిన నలుగురి పేర్లు ఇవే...
జగన్ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమయ్యింది. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు ఎన్నికవడంతో వారి స్థానంలో మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలో అన్నదానిపై సీఎం జగన్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. త్వరలో ఇద్దరు కొత్త మంత్రులు రానున్నారు.ఇటీవలే రాజ్యసభ సభ్యులు గా ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానాల్లో జగన్ కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు.
ఈ నెల 20 తర్వాత ఏపీ కేబినేట్ లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇద్దరు కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు మరి కొంతమంది శాఖల్లో జగన్ మార్పు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆషాఢ మాసం తర్వాత మార్పు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు.
రాజ్యసభ కు ఎన్నికైన మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానాల్లో నలుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తుది నిర్ణయం మాత్రం వైఎస్ జగన్ చేతుల్లో ఉంది. శ్రావణ మాసం మొదలైన మొదటి వారంలోనే కాబినెట్ లోకి ఇద్దరు కొత్త మంత్రులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ నెల 21 తర్వాత మార్పులు ఉండే అవకాశం ఉంది.
పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు కూడా. తెరపైకి వచ్చిన నలుగురిలో ఎవరికి అవకాశం ఉంటుంది అనేది చూడాలి. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి పొన్నాడ సతీష్, రామచంద్రపురం నుంచి వేణుగోపాల్ వినిపిస్తున్నాయి.
వీరితో పాటు పలాస నియోజకవర్గం నుంచి సిదిరి అప్పలరాజు, కృష్ణా జిల్లా పెడన నుంచి జోగి రమేష్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే వీరిలో ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్యసభకు ఎన్నికైన ఇద్దరు బిసి సామజిక వర్గానికి సంబంధించిన వారు. మరి వీరి స్థానాల్లో అదే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇద్దరు కొత్తవారికి అవకాశం ఇవ్వడం తో పాటు కొందరి శాఖలు మరే అవకాశం కూడా ఉంది. కొంతమంది మంత్రుల పనితీరుపై సీఎం కొంత అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది.