గన్నవరంలో మూడు ముక్కలాట: వల్లభనేని వంశీ ధీమా అదే...
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలోకి రావడాన్ని గన్నవరం నియోజకవర్గ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధీమాగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. టీడీపీ నుంచి గెలిచిన వంశీ తన విధేయతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైపు మళ్లించిన విషయం తెలిసిందే. సాంకేతికంగా ఆయన వైసీపీలో చేరలేదు. కానీ వైసీపీ ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారు. ఆయన చేరికను గన్నవరం నియోజకవర్గంలోని యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు తీవ్రంగా వ్యతిరేకించారు.
వంశీని ఓ వైపు దుట్టా రామచంద్రరావు, మరోవైపు యార్లగడ్డ వెంకట్రావు వ్యతిరేకిస్తున్నారు. బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. తాజాగా యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి, వంశీ వర్గానికి మధ్య ఘర్షణ కూడా చెలరేగింది. ఇరు వర్గాలు వీధిన పడి కొట్టుకున్నాయి.
అయితే, వల్లభనేని వంశీ మాత్రం ధీమాగానే కనిపిస్తున్నారు. తనను నాలుగైదు శాతం మంది వైసీపీ కార్యకర్తలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని ఆయన ఓ ప్రముఖ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులే రోడ్డుకెక్కారని, అలా ఎందుకు చేస్తున్నారో వారినే అడగాలని ఆయన అన్నారు.
తనకు ఏ విధమైన ఇబ్బంది కూడా లేదని వంశీ చెప్పారు. తనతో వైసీపీలోకి వచ్చిన వారెవరు కూడా పదవులు కోరుకోలేదని ఆయన చెప్పారు. పదేళ్లుగా పార్టీ జెండా మోసినవారికే పదవులు ఇవ్వాలని తాను చెప్పానని, అలాగే జరుగుతోందని ఆయన చెప్పారు. తాను ఏమీ కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. అధిష్టానానికి అంతా తెలుసునని ఆయన చెప్పారు.
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించాలనే జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ వంశీ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యుత్తు చార్జీలు పెంచడం వల్లనే టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోల్పోయారని చెప్పారు. ఈ సమయంలోనే ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ తో గన్నవరం నియోజకవర్గంలోని పరిస్థితిపై మాట్లాడారు. (
తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావుతో తనకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, అటువంటి పరిస్థితి ఇప్పుడు తనకు లేదని ఆయన అన్నారు. ప్రస్తుత మంత్రి కొడాలి నాని కూడా దేవినేని ఉమామహేశ్వర రావు వల్లనే టీడీపీ నుంచి బయటకు వచ్చారని ఆయన చెప్పారు. వైసీపీలో తనకు బాగుందని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ అండదండలు తనకు ఉన్నాయని వంశీ విశ్వసిస్తున్నారు. పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా గన్నవరం నియోజకవర్గం సీటును తదుపరి ఎన్నికల్లో కూడా తనకే ఇస్తారనే ధీమా ఆయనకు ఉంది. అందుకే ఓ వైపు యార్లగడ్డ వెంకట్రావు, మరో వైపు దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తున్నా వల్లభనేని వంశీ ధిమాగా కనిపిస్తున్నారు.