TTD కీలక నిర్ణయం.. తిరుమలలో ఇ-టంగ్, ఇ-నోస్ టెక్నాలజీ. వీటి ఉపయోగం ఏంటంటే.?
TTD News: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అడుగు వేసింది. దేశంలోనే ఆలయ వ్యవస్థలో మొదటిసారిగా అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
తిరుమలలో భక్తులకు అందించే ప్రసాదం, తాగునీటి నాణ్యతపై మరింత పర్యవేక్షణ ఉండేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆలయ వ్యవస్థలోనే మొదటిసారిగా అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ హైటెక్ ల్యాబ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. లోకేష్ తనయుడు, చంద్రబాబు మనువడు మేథాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబు కుటుంబం తిరుమల దర్శనానికి వచ్చారు. భక్తుల విశ్వాసం ఏమాత్రం దెబ్బతినకుండా, శ్రీవారి ప్రసాదాల నాణ్యత అత్యున్నత ప్రమాణాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను ఆదేశించారు.
భక్తుల నమ్మకాన్ని కాపాడాలని సీఎం సూచన
తిరుమలకు ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం, తాగునీటి నాణ్యతపై వారికి అపారమైన విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం నిలబెట్టడం టీటీడీ బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రసాదాల తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యతపై ఎలాంటి అనుమానాలు లేకుండా ఉండేలా సాంకేతిక పద్ధతులను వినియోగించాలని సూచించారు. ప్రతి అంశంలో పారదర్శకత ఉండేలా అధికారుల పని విధానం ఉండాలని తెలిపారు.
రూ.25 కోట్లతో హైటెక్ ఫుడ్ – వాటర్ ల్యాబ్
టీటీడీ సహకారంతో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కలిసి ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశాయి. దాదాపు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కేంద్రంలో కెమికల్, మైక్రోబయాలజీ విభాగాలను ఏర్పాటు చేశారు. దేశంలో ఒక ఆలయం కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ స్థాయి ఫుడ్ అనాలసిస్ కేంద్రం ఇదే మొదటిదని అధికారులు తెలిపారు. ల్యాబ్ను పరిశీలించిన సీఎం ప్రతి విభాగం పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇ-టాంగ్, ఇ-నోస్ టెక్నాలజీతో పరీక్షలు
ఈ ల్యాబ్లో అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా e-tongue, e-nose అనే డిజిటల్ టెక్నాలజీల ద్వారా ఆహార పదార్థాల రుచి, వాసనను కచ్చితంగా విశ్లేషించగలరు. ఇవి మానవ ఇంద్రియాలకు సమానంగా పనిచేసే సెన్సార్ ఆధారిత పరికరాలు. ప్రసాదాల తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యతలో ఏవైనా మార్పులు ఉన్నాయా అనే విషయాన్ని ఈ సిస్టమ్ ద్వారా త్వరగా గుర్తించవచ్చు. 1981లో చిన్న స్థాయిలో ప్రారంభమైన నీటి పరీక్షల విభాగం ఇప్పుడు నెలకు సుమారు 1,000 నుంచి 1,500 నమూనాలను పరీక్షించే స్థాయికి చేరినట్లు అధికారులు వివరించారు.
లడ్డూ నెయ్యి నాణ్యతపై కఠిన పరీక్షలు
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై సీఎం ప్రత్యేకంగా ప్రశ్నించారు. కల్తీకి అవకాశం లేకుండా ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలుసుకున్నారు. అధికారుల ప్రకారం NDDB సంస్థ అందించిన ఆధునిక GC, HPLC యంత్రాల సహాయంతో నెయ్యి స్వచ్ఛతను శాస్త్రీయంగా పరీక్షించవచ్చు. 2025 జూలై నుంచి ఈ పరీక్షలను మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ముడి పదార్థాల్లో పురుగుమందుల అవశేషాలు, యాంటీబయోటిక్స్, లెడ్, ఆర్సినిక్ వంటి హెవీ మెటల్స్ ఉన్నాయా అనే విషయాన్ని కూడా ఈ ల్యాబ్ ద్వారా గుర్తించే సామర్థ్యం ఉంది.
దేశానికే ఆదర్శంగా తిరుమల ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ
ల్యాబ్లో బ్యాక్టీరియా పరీక్షల కోసం ప్రత్యేక క్లీన్ రూమ్, ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వంటి భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం అధికారులను అభినందించారు. కేవలం ల్యాబ్ పరీక్షలతోనే కాకుండా అన్నప్రసాద కేంద్రాల్లో వంటశాలల పరిశుభ్రతపై కూడా నిరంతర తనిఖీలు నిర్వహించాలని సూచించారు. భక్తులకు అందించే ప్రతి ఆహార పదార్థం నాణ్యంగా ఉండాలని స్పష్టం చేశారు. తిరుమలలో చేపట్టిన ఈ ఫుడ్ సేఫ్టీ చర్యలు భక్తుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయని, దేశంలోని ఇతర ఆలయాలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, టీటీడీ పాలకమండలి సభ్యులు, ఉన్నతాధికారులు, ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ సిబ్బంది పాల్గొన్నారు.

