- Home
- Andhra Pradesh
- Success Story : ఆటో డ్రైవర్ భార్యకు స్టేట్ ర్యాంక్... ఇంటర్ లో 1000 కి 991 మార్కులు
Success Story : ఆటో డ్రైవర్ భార్యకు స్టేట్ ర్యాంక్... ఇంటర్ లో 1000 కి 991 మార్కులు
ఆమెది నిరుపేద కుటుంబం… భర్త ఆటో డ్రైవర్. అయితేనేం… తన చదువుకు ఈ పేదరికం అడ్డుకాదని నిరూపించింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో మెరిసిన తెలుగు ఆడబిడ్డ సక్సెస్ స్టోరీ…

ఆదోని ఆడబిడ్డ 991 మార్కులు..
Success Story : మనిషికే పేదరికం... వారి ఆశయాలు, లక్ష్యాలకు కాదు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలమని ఇప్పటికే అనేకమంది నిరూపించారు... ఇప్పుడు ఇదే సక్సెస్ బాటలో నడుస్తోంది ఓ సాధారణ ఆటో డ్రైవర్ భార్య. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కర్నూల్ అమ్మాయి సుజాత ఏకంగా 991/1000 మార్కులతో మెరిసింది.
ఇది కదా సక్సెస్..!
ఆదోనికి చెందిన జయరాం ఆటో డ్రైవర్. అతడు పెద్దగా చదువుకోకపోయినా భార్యను బాగా చదివించాలని అనుకున్నాడు. ఆమె చదువే తమ జీవితాలను మారుస్తుందని నమ్మాడు. అందుకే పదో తరగతి పూర్తిచేసిన భార్య సుజాతను ఇంటర్మీడియట్ లో చేర్చాడు.
ఆదోనిలోని విశ్వ నారాయణ జూనియర్ కాలేజీలో చేరిన సుజాత మెదటినుండి బాగా చదివేది. భర్త కష్టపడి ఆటో నడుపుతూ ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. దీంతో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (MPHS) గ్రూప్ లో చేరిన ఆమె బాగా చదివి ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు సాధించింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫలితాల్లో అయితే దుమ్మురేపింది... ఏకంగా 991 మార్కులు సాధించింది.
సుజాత లక్ష్యమిదేనట...
మంచి మార్కులతో ఇంటర్మీడియట్ పాసయిన సుజాత మంచి ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. తనకోసం ఎంతో కష్టపడతున్న భర్తను, కుటుంబసభ్యులకు గౌరవాన్ని తీసుకువస్తానంటోంది. వారిని సంతోషంగా చూసుకుంటానని ఇంటర్మీడియట్ టాపర్ సుజాత చెబుతున్నారు.
ఇంటర్ లో బాలికలదే పైచేయి..
ఇదిలావుంటే ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ ఏడాది కూడా విద్యార్థినులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే పైచేయి సాధించి, విద్యారంగంలో తమ జోరును కొనసాగించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణత శాతం గణనీయంగా ఉండటం విశేషం.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అమ్మాయిలు 81 శాతం, అబ్బాయిలు 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్ లో కూడా అమ్మాయిలు 85 శాతం, అబ్బాయిలు 76 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఇంటర్ ఫలితాలను చూస్తే అమ్మాయిలతే పైచేయిగా నిలిచింది.
ఇక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 77శాతం, సెకండ్ ఇయర్ లో 81 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షరాసిన 4,46,537 మంది విద్యార్థుల్లో 3,59,816 మంది పాస్ అయ్యారు... అంటే దాదాపు లక్షమంది ఫెయిల్ అయ్యారు. సెకండ్ ఇయర్ లో 4,71,864 మంది ఎగ్జామ్ రాయగా 3,61,526 మంది పాసయ్యారు. అంటే ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ లో ఫెయిల్యూర్ శాతం ఎక్కువగా ఉంది.

