- Home
- Andhra Pradesh
- Thunderbolt Warning : పిడుగులను ముందుగానే గుర్తించే టెక్నాలజీ... APSDMA సరికొత్త యాప్..?
Thunderbolt Warning : పిడుగులను ముందుగానే గుర్తించే టెక్నాలజీ... APSDMA సరికొత్త యాప్..?
Lightning Alert App : పిడుగుపాటు మరణాలను తగ్గించేందుకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. NRSC తో ఒప్పందాన్ని కుదుర్చుకుని పిడుగులను ముందుగానేే గుర్తించే వ్యవస్థను సిద్దం చేస్తోంది.

ఇక పిడుగులకు చెక్...
Thunderbolt Warning : సాధారణంగా వేసవికాలంలో కురిసే వర్షాలు ప్రమాదకరంగా ఉంటాయి. వర్షపాతం తక్కువే అయినా ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుల కారణంగా ప్రాణ, ఆస్తినష్టం జరిగే అవకాశాలుంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేపట్టే రైతులు, కూలీలు, పశువుల కాపర్లు పిడుగుల బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటాయి. గత కొన్నేళ్లుగా ఈ పిడుగులు అనేకమందిని బలితీసుకున్నాయి. ఈ పిడుగుల వల్ల జరుగుతున్న మారణహోమాన్ని టెక్నాలజీ సాయంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్... ఇందులో భాగంగానే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కీలక ముందడుగు వేసింది.
APSDMA-NRSC ఒప్పందం..
మేఘాల మధ్య ఏర్పడే కోట్ల వోల్టుల విద్యుత్ నే పిడుగు అంటారు... ఇది సూర్యుడి ఉపరితలం కంటే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీన్నిబట్టే పిడుగులు ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పిడుగులను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యమే... టెక్నాలజీ సాయంతో ఈ పని చేయవచ్చు. ఈ క్రమంలోనే పిడుగుపాటు మరణాల నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిడుగుపాటును ముందే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అధికారులను ఆదేశించారు. దీంతో పిడుగుపాటు ప్రమాదాలను తగ్గించేందుకు APSDMA కేంద్ర పరిశోధన సంస్థ NRSC (National Remote Sensing Centre) సహకారం తీసుకోనుంది. ఈ మేరకు ఇరుసంస్థల మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది... ఏపీ విపత్తు సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, NRSC డిప్యూటీ డైరెక్టర్ డా. అపర్ణ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
APSDMA, NRSC ఒప్పందం వల్ల ఉపయోగాలు :
పిడుగుపాటు వల్ల ఇకపై ఏపీలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా APSDMA, NRSC జాగ్రత్తలు తీసుకోనున్నాయి. ఈ సంస్థల ఒప్పందం వల్ల కలిగే ఉపయోగాలివే..
- పిడుగులు పడే హాట్స్పాట్ల గుర్తింపు
- ముందస్తు హెచ్చరికల వ్యవస్థ బలోపేతం.
- గ్రామీణ ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాల నివారణ
పిడుగుల గురించి హెచ్చరించే యాప్...
దామిని లైటింగ్ అలర్ట్.. ఈ యాప్ పిడుగు వంటి విపత్కర పరిస్థితుల గురించి మనకు ముందుగానే సమాచారం ఇస్తుంది. పిడుగు పాటును ముందుగానే గుర్తించి హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేకమైన యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ ఫోన్ లో ఈ యాప్ ఉన్నట్లయితే అర్ధగంట ముందుగానే మీరున్న ప్రాంతంలో పిడుగు పడుతుందా? లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. దీన్ని మనం గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇన్ స్టాల్ చేసుకున్నాక పేరు, మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేసుకోవాలి.
లైటెనింగ్ డిటెక్షన్ నెట్ వర్క్స్ ద్వారా సేకరించిన డేటాను ప్రాసెస్ చేసి.. మీ ప్రాంతంలో 20 కిలోమీటర్ల పరిధిలో పిడుగు పడే అవకాశం ఉన్నపుడు మొబైల్కి నోటిఫికేషన్ పంపిస్తుంది. ఈ యాప్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తదితర భాషల్లో సమాచారం అందించగలదు.
పిడుగుల బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తలు
1. చెట్లు ఎక్కువగా పిడుగులను ఆకర్షిస్తాయి. కాబట్టి వర్ష సమయంలో చెట్లకింద ఉండరాదు.
2. వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు ఎక్కువగా చెట్లమధ్యన ఉంటారు. కాబట్టి వారికి పిడుగులు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్ష సమయంలో చెట్లకింద కాకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
3. ఆరుబయట పనులు చేసుకునేవారికి కూడా పిడుగులబారిన ఎక్కువగా పడుతుంటారు. వీళ్లు వర్ష సమయంలో జాగ్రత్తలు పాటించాలి.
4. వర్ష సమయంలో ఇళ్లు, ఆఫీసుల్లో ఉన్నవారు అక్కడే ఉండాలి... అత్యవసరం అయితేనే వర్షంలో బయటకు రావాలి.
5. విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, కరెంట్ స్తంభాలు, వైర్లు వంటివాటిపై కూడా పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వర్ష సమయంలో వీటికి దూరంగా ఉండాలి.
6. పశువులు, ఇతర మూగజీవులను కూడా వర్షం కురిసే సమయంలో చెట్లకింద ఉంచరాదు.
7. తాత్కాలిక నివాసాల్లో అంటే పూరిగుడిసెలు, రేకుల షెడ్డుల్లో నివాసముండేవారు కూడా వర్ష సమయంలో జాగ్రత్త. వీటిపై పిడుగులు పడితే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది.
8. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు ఉపయోగించరాదు. పిడుగుపాటు సమయంలో వీటిలో విద్యుత్ ప్రవాహం ఎక్కువై ప్రమాదాలు జరగవచ్చు.

