అంతర్వేది రథం దగ్దం... ధర్మ పోరాట ధీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హైదరాబాదులోని తన నివాసంలో ధర్మ పరిరక్షణ దీక్షను చేపట్టారు.
హైదరాబాద్: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం ఘటన నేపథ్యంలో జనసేన-బిజెపి సంయుక్తంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి ధర్మ పరిరక్షణ దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హైదరాబాదులోని తన నివాసంలో ధర్మ పరిరక్షణ దీక్షను చేపట్టారు.
పరిరక్షణ దీక్షకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, శ్రేణులు ఈ దీక్ష చేపట్టడం గురించి ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ దీక్షలకు అన్ని ఏర్పాట్లు జరిగాయని నాయకులకు పవన్ కల్యాణ్ సూచించారు.
అంతర్వేది రథం దగ్దం ఒక సంఘటనో రెండు సంఘటనలో అయితే చిన్న స్థాయిలో స్పందించి వదిలేసేవాడినని... కానీ వరుస క్రమంలో ఇలాంటి ఘటనలే జరుగుతూ ఉంటే మౌనంగా ఉండలేకపోతున్నానని పవన్ కల్యాణ్ ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశారు. ''లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 40 అడుగుల పవిత్ర రథంపైన ఏదో తేనె పట్టు ఉందంట... ఆ తేనె పట్టుని తీయడం కోసం వీళ్లు తగులపెట్టేశారంట. అలాకాకుండా ఇప్పుడు ఒక మతిస్థిమితం లేని వ్యక్తులెవరో చేసిన పనేమో అంటున్నారు. ఇదీ ఆ జాబితాలో చేర్చారు. యాదృచ్చికంగా జరిగినవంటున్నారు. ఎన్ని జరుగుతాయి యాదృచ్చికంగా..? ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం దీని మీద చాలా బలంగా స్పందించాలి'' అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.