జగన్ కాబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్, రేసులో వీరే...!
మంత్రివర్గంలో ఖాళీ అయిన రెండు బెర్తులు మోపిదేవి, పిల్లి ఇద్దరు కూడా బీసీ సామాజికవర్గానికి చందినవారే. మోపిదేవి గుంటూరు జిల్లాకు చెందినవారు కాగా, పిల్లి తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. ఇద్దరూ బీసీ నేతలే అవడంతో... మరో ఇద్దరు బీసీలనే కేబినెట్ లోకి తీసుకోవాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నిక లాంఛనం పూర్తయినప్పటినుండి మంత్రివర్గ విస్తరణ గురించిన చర్చలు నడుస్తున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికవడంతో... వారు వారి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు కూడా చేసేసారు. దానితో కాబినెట్ విస్తరణ అనే చర్చ మరింతగా ఊపందుకుంది.
జగన్ సైతం ఇందుకు సానుకూలంగా ఉన్నట్టుగా వార్తలు వినపడుతున్నాయి. అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుత ఆషాఢమాసం తదుపరి శ్రావణ మాసంలో కాబినెట్ విస్తరణ ఉండబోతుందని విశ్వసనీయంగా తెలియవస్తుంది. ఈ నెల 21వ తేదీన శ్రావణ మాసం ఆరంభమవుతుంది. దానితో ఆ తెల్లారి 22వ తేదీన కేబినెట్ ను జగన్ విస్తరించనున్నారు.
మంత్రివర్గంలో ఖాళీ అయిన రెండు బెర్తులు మోపిదేవి, పిల్లి ఇద్దరు కూడా బీసీ సామాజికవర్గానికి చందినవారే. మోపిదేవి గుంటూరు జిల్లాకు చెందినవారు కాగా, పిల్లి తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. ఇద్దరూ బీసీ నేతలే అవడంతో... మరో ఇద్దరు బీసీలనే కేబినెట్ లోకి తీసుకోవాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.
రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ బీసీలను బీసీలతోనే నింపాలనే డిసైడ్ అయ్యారట. దీనికి రెండు కారణాలు కనబడుతున్నాయి. మొదటగా అచ్చెన్నాయుడి అరెస్ట్ వ్యవహారం.
అచ్చెన్నాయుడు అరెస్ట్ వల్ల టీడీపీ జగన్ మీద బీసీ వ్యతిరేకి అనే దాడిని మొదలుపెట్టింది. బీసీలకు అన్యాయం చేయడానికి, బీసీల గొంతుకను నొక్కేయడానికి బీసీ నేత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసారంటూ టీడీపీ గగ్గోలు పెట్టింది. చంద్రబాబు నుండి వర్ల రామయ్య వరకు ప్రతి ఒక్కరు ఇవే ఆరోపణలను గుప్పించారు.
మరో అంశం తాజాగా జగన్ నియమించిన ఇంచార్జిలు. విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి. ముగ్గురు కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు అవడంతో.... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన వర్గానికే ప్రాధాన్యతను ఇస్తున్నారు, మిగిలిన వారందరిని ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారు అనే ఆరోపణ ఎక్కువయింది.
ఈ రెండు విషయాల నేపథ్యంలో... ఆయన ఇప్పుడు బీసీలనే తీసుకోవాలి అనుకుంటున్నారు. దానికి తోడుగా జగన్ సైతం కేబినెట్ విస్తరణలో కుల సమీకరణాలను ఖచ్చితత్వంతోపాటించారు. దాన్ని అలాగే కొనసాగించాలన్నా కూడా బీసీలనే తీసుకోవాలి.
కాబినెట్ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రోజా, పిన్నెల్లి వంటి వారు ఇప్పుడు సామజిక కోణంలో ఈ సీట్లు బీసీలకు ఇస్తుండడంతో ఉసూరుమంటున్నారు. ఇక బీసీ నేతలంతాఅవకాశం తమకంటే తమకు అన్నట్టుగా పరుగులు పెడుతున్నారు.
అందరికంటే ముందువరసలో కనబడుతుంది విడదల రజని. చిలకలూరిపేట ఎమ్మెల్యే గా ఎన్నికైన విడదల రజిని, ప్రత్తిపాటి పుల్లారావుని ఓడించి జైంట్ కిల్లర్ గానే అసెంబ్లీలోకి అడుగుపెట్టింది.
ఈమె చాలా తెలివిగా ఎప్పటి నుండో పావులు కదుపుతోంది. మహాశివరాత్రి సందర్భంగా అక్కడ ప్రభలను ఏర్పాటు చేసే విషయం తెలిసిందే. ఆ ప్రభల విషయంలో ఆమె టీడీపీ వారిని బలంగా టార్గెట్ చేసారు అని అంటున్నారు. తద్వారా ఆమె జగన్ దృష్టిని ఆకర్షించారు. జగన్ దృష్టిలో బలమైన ముద్రని వేసుకోగలిగారు. మోపిదేవి గుంటూరు జిల్లాకు చెందిన నేత అవడం వల్ల తనకు పదవి ఖాయం అని అంటున్నారు.
పిల్లి సుభాష్ చంద్ర బోస్ ని గనుక తీసుకుంటే... ఆయన రామచంద్రపురం నియోజకవర్గం నుండి గతంలో గెలిచారు. ఈసారి ఆయన పోటీ చేయలేదు. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లానుండి పినిపి విశ్వరూప్, తానేటి వనిత, కురసాల కన్నబాబు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించకపోయినా, జిల్లాకు ఒక మంత్రి బెర్తు పోయినా ఇప్పటికిప్పుడు అక్కడ రాజకీయ సమీకరణాలు ఏమి మారవు.
ఈ నేపథ్యంలో విడదల రజిని కాకుండా ఇంకొన్ని పేర్లు వినబడుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి కొలుసు పార్థసారధి పేరు వినపడుతుంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈయన మంత్రిగా పనిచేసారు కూడా. ఆయన కూడా బీసీ కోటాలో పదవిని ఆశివస్తున్నారు.
మంత్రి పదవి ఆశిస్తున్న మరో నేత జోగి రమేష్. పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే. ఈయన సైతం మాస్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ఎప్పటినుండో ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.
ఆయన సామాజికవర్గం ఆయనకు ఇక్కడ కలిసివచ్చే అంశంగా కనబడుతుంది. ఆయన గౌడ సామాజికవర్గానికి చెందిన నేత. పిల్లి సైతం ఇదే సామాజికవర్గానికి (శెట్టి బలిజ)చెందిన నేత కావడంతో తనకు ఆ కోటాలో మంత్రి పదవి గ్యారంటీ అని లెక్కలు వేసుకుంటున్నారు. చెల్లుబోయిన వేణుగోపాల్ కూడా ఇదే కోటాలో పోటీ పడుతున్నారు.
ఇక తమ్మినేని సీతారాం ని కూడా కాబినెట్ లోకి తీసుకుంటారు అనే ప్రచారం సాగుతుంది. ఆయన అందుకోసమే రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేవారు కూడా లేకపోలేదు. ఆయనతోపాటుగా మోపిదేవి సామాజికవర్గానికే చెందిన పొన్నాడ సతీష్, సీదిరి అప్పలరాజులు కూడా రేసులో పోటీ పడుతున్నారు.
ఇక సీనియర్లు పిన్నెల్లి, అంబటి, రోజా, ఆళ్ల రామకృష్ణ రెడ్డి, నెల్లూరు పెద్దా రెడ్లు అందరూ సైతం ఈసారి మంత్రి వర్గ విస్తరణపై ఆశలు వదిలేసుకున్నట్టు తెలియవస్తుంది. దానికి తోడుగా ఈ మంత్రి పోస్టు ఒకటిన్నర సంవత్సరమే ఉంటుందని కూడా వారే వారి అనుచరులకు చెబుతున్నారట. రెండున్నర సంవత్సరాలతరువాత జగన్ ఎలాగూ కాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేబడుతారు కాబట్టి అప్పుడు చూసుకుందాం అని అనుకుంటున్నారట. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో చూడాలి అమాత్య పదవి ఎవరిని వరిస్తుందో...!