- Home
- Andhra Pradesh
- పిల్లలు శోభనం గదిలో కూర్చున్నట్లు కూర్చోవడం ఏంటీ మాస్టారు.? గరికపాటి వివాదం ఏంటి, ఇంతకీ ఆయన ఏమన్నారు.?
పిల్లలు శోభనం గదిలో కూర్చున్నట్లు కూర్చోవడం ఏంటీ మాస్టారు.? గరికపాటి వివాదం ఏంటి, ఇంతకీ ఆయన ఏమన్నారు.?
Garikapati: ప్రముఖ ప్రవచన కర్త గరకపాటి నరసింహారావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తీవ్ర విమర్శలు రావడంతో వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.

మధ్యాహ్న భోజన పథకం వ్యాఖ్యలతో మొదలైన చర్చ
ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి ఆయన మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. పేద విద్యార్థులపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పలువురు విమర్శలు చేస్తుండగా, మరోవైపు ఆయన బృందం మాత్రం ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేసింది.
అసలు గరికపాటి ఏమన్నారు?
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో గరికపాటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై వ్యాఖ్యానించినట్లు కనిపిస్తోంది. పిల్లలకు భోజనం, గుడ్లు, పుస్తకాలు, యూనిఫారాలు అన్నీ ఉచితంగా ఇస్తే చదువుపై దృష్టి తగ్గుతుందని ఆయన చెప్పినట్లు ఆ వీడియోలో వినిపిస్తోంది. అంతేకాకుండా విద్యార్థులు చదువుకోడానికి కాకుండా భోజనం కోసం మాత్రమే వస్తున్నారని వ్యాఖ్యానించినట్లు వీడియోలో ఉంది. పిల్లలకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే వారు చదువుపై శ్రద్ధ పెట్టరని, అలా చేస్తే వారు శోభనం పెళ్లి కొడుకులా మంచమెక్కి కూర్చుంటాడు అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి.
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు
వీడియో వైరల్ అయిన తర్వాత చాలా మంది గరికపాటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని అవమానించారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు కూడా స్పందించి ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. పేద పిల్లల విద్యకు సహాయపడే పథకాలపై ఇలా మాట్లాడటం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం పెద్ద చర్చగా మారింది.
వివాదంపై గరికపాటి బృందం స్పందన
వివాదం తీవ్రంగా మారడంతో గరికపాటి నరసింహారావు బృందం కూడా స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తి ప్రసంగం కాదు, కేవలం ఒక చిన్న క్లిప్ మాత్రమే అని వారు తెలిపారు. ఆయన అసలు ఉద్దేశ్యం మధ్యాహ్న భోజన పథకాన్ని లేదా పేద విద్యార్థులను అవమానించడం కాదని చెప్పారు. ఉపాధ్యాయులు చదువు చెప్పడం కంటే బోధనేతర పనుల్లో ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందనే విషయాన్ని మాత్రమే ఆయన ప్రస్తావించారని వివరించారు. వీడియోను కట్ చేసి వేరే సందర్భంతో కలిపి ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు.
రాజమండ్రి సభ వీడియోపై వివరణ
గరికపాటి బృందం ప్రకారం, రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్న వీడియోను కూడా వక్రీకరించారని తెలిపారు. ఆ సభలో ఆయన అలా మాట్లాడలేదని, వేరే సందర్భంలో చెప్పిన మాటలను కలిపి వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. గరికపాటి ఎప్పుడూ పేదల పక్షాన మాట్లాడే వ్యక్తి అని, గతంలో కూడా ఆయన అనేకసార్లు అదే విషయాన్ని పలు ప్లాట్ ఫామ్ పై టీమ్ పేర్కొంది. కొందరు కావాలనే తప్పుదారి పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నారని కూడా ఆరోపించారు.
వివాదం ముగిసినట్లేనా.?
ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించే వారు ఉండగా, మరోవైపు ఆయన టీమ్ వివరణ ఇచ్చింది. ఈ వివరణతో వివాదం ముగుస్తుందా లేదా ఇంకా కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంది.

