జగన్ కు తలనొప్పి: తారాస్థాయికి వల్లభనేని వంశీ, యార్లగడ్డ మధ్య పోరు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి అనుకూలంగా మారారు.అయితే వైసీపీలోకి వంశీని అహ్వానించడాన్ని అప్పుడే యార్లగడ్డ వెంకట్రావు వ్యతిరేకించారు.
గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీకి, కేడీసీసీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావుకు మధ్య పోరు తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. పరస్పరం దాడులు, పరస్పర ఫిర్యాదులు విభేదాలను రోడ్డు మీదికి తెచ్చాయి. గత కొంత కాలంగా మౌనంగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు వర్గం తాజాగా వంశీని ఢీకొట్టేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి అనుకూలంగా మారారు. వైసీపీలోకి వంశీని అహ్వానించడాన్ని యార్లగడ్డ వెంకట్రావు వ్యతిరేకించారు. అయితే, జగన్ యార్లగడ్డను బుజ్జగించడానికి కేడీసీసీ పదవిని కట్టబెట్టారు. చాలా కాలంగా ఆయన మౌనంగానే ఉన్నట్లు కనిపించారు. తాజాగా వంశీపై పోరుకు సిద్దపడినట్లు కనిపిస్తున్నారు. ఇది వైఎస్ జగన్ కు తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉంది.
ఇటీవల యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి, వంశీ వర్గానికి మధ్య ఘర్షణ చెలరేగింది.తనపై వంశీ వర్గీయులు దాడి చేశారంటూ యార్లగడ్డ వెంకట్రావు ఆత్కూరు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అది అలా ఉండగానే వంశీ వర్గం మరో ఎత్తు వేసినట్లు కనిపిస్తోంది.
తనను కులం పేరుతో దూషించారంటూ రాంబాబు అనే వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావుపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై వంశీ వర్గీయులే దాడి చేశారని యార్లగడ్డ వెంకట్రావు అంటున్నారు.
మరోవైపు, వైసీపీ స్థానిక నాయకుడు దుట్టా రామచంద్రరావు వల్లభనేని వంశీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. గన్నవరం శాసనసభ సీటు తమ వర్గానికే కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. విషయాన్ని తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దనే తేల్చుకుంటానని గతంలో అన్నారు. వంశీకి రెండు వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. దీన్ని జగన్ ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.