వరుస ఘటనలు, సోము హిందూ ఎజెండా: ఆ ముద్రతోనే జగన్ కు చిక్కులు
సోము వీర్రాజు బిజెపి రాష్ట్రాధ్యక్షుడిగా నియమితులైన తర్వాత జగన్ మీద అందుకు సంబంధించిన చిక్కులు ఎక్కువగా ఎదురవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఆ దారుణాలకు పాల్పడినవారు ఎవరనే విషయం నిగ్గు తేలడం లేదు. అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నట్లు అర్థమవుతోంది.
తిరుమలలో అన్యమత ప్రచారంతో మొదలైన ఘటనలు సాయిబాబా విగ్రహ ధ్వంసం వరకు పలు సంఘటనలు జరిగాయి. ప్రతిసారీ జగన్ ప్రభుత్వాన్ని బిజెపి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. సోము వీర్రాజు బిజెపి రాష్ట్రాధ్యక్షుడిగా నియమితులైన తర్వాత జగన్ మీద అందుకు సంబంధించిన చిక్కులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. హిందూ ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలాన్ని సంతరించుకోవాలని బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
తన ఎజెండాలో భాగంగా బిజెపి జగన్ ను చిక్కుల్లో పడేయడానికి ప్రయత్నిస్తోంది. బిజెపికి మద్దతుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వస్తున్నారు. అంతర్వేది రథం దగ్ధం కేసులో మూడు పార్టీలు కలిసి జగన్ ను చిక్కుల్లో పడేయడానికి తీవ్రంగానే ప్రయత్నించాయి. అయితే, ప్రతిపక్షాలు అడిగిన మేరకు జగన్ ప్రభుత్వం ఆ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో కాస్తా వివాదం సద్దుమణిగింది.
తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందంటూ వివిధ సంఘటనలను ముందుకు తెచ్చి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. ఆ తర్వాత అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన తీవ్రమైన సంచలనమే సృష్టించింది. తాజాగా దుర్గగుడిలో వెండ రథం సింహాల ప్రతిమల్లో మూడు మాయం కావడం తీవ్ర వివాదానికి దారి తీసింది.
దుర్గగుడి వెండి సింహాల ప్రతిమల మాయమై ఘటనను ఇప్పుడు బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఆయుధంగా ఎంచుకున్నారు. ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దుర్గగుడి ఈవో కూడా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వివాదం మరింత ముదురుతోంది. అవి లాకర్ లో ఉండవచ్చునని ఈవో చెప్పారు. కానీ, దాంతో సోము వీర్రాజు సంతృప్తి చెందడం లేదు. ప్రభుత్వంపై అనుమానాలు ఉన్నాయని కూడా సోము వీర్రాజు అంటున్నారు.
దుర్గగుడికి సంబంధించి వివాదం ఇదే మొదటిది కాదు. ఈ ఆలయంలో క్షుద్రపూజలు జరిగినట్లు గతంలో విమర్శలు వచ్చాయి. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కోసం క్షుద్రపూజలు చేయించారని ఆరోపణలు వచ్చాయి. క్షుద్రపూజల వివాదం ఇప్పటి వరకు కూడా తేలలేదు. తాజాగా వెండి ప్రతిమల మాయం ముందుకు వచ్చింది.
దుర్గగుడి వివాదం చెలరేగుతుండగానే విజయవాడ రూరల్ మండలం నిడమనూరులో సాయిబాబా విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఇది కూడా వివాదానికి దారి తీసే అవకాశం ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకుని వెళ్లాలనే వ్యూహంలో సోము వీర్రాజు ఉన్నట్లు కనిపిస్తున్నారు. జగన్ ను చిక్కుల్లో పడేయడానికి అనివార్యంగా చంద్రబాబు ముందుకు వస్తున్నారు.
వైఎస్ జగన్ మీద పోరాటానికి బిజెపి హిందూ ఎజెండాను ప్రధానం చేసుకోవడానికి కారణం లేకపోలేదు. జగన్ హిందూ వ్యతిరేకి అనే ముద్ర ఎంతో కొంత ఉంది. జగన్ క్రైస్తవుడని, కుటుంబ సభ్యులందరూ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారని అంటారు. ఆ ముద్ర కారణంగా జగన్ మీద హిందూ ఎజెండాను ప్రయోగిస్తే ఫలితం సాధించవచ్చుననే ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది. ఏమైనా, జగన్ ఈ దాడిని ఎలా ఎదుర్కుంటారనేదే ఆసక్తికరమైన విషయం.