- Home
- Andhra Pradesh
- Andhra pradesh: ఏపీలో రూ. 1000 కోట్లతో బిట్స్ క్యాంపస్.. దేశంలోనే తొలి ఏఐ విద్యా సంస్థ. ఎక్కడంటే..
Andhra pradesh: ఏపీలో రూ. 1000 కోట్లతో బిట్స్ క్యాంపస్.. దేశంలోనే తొలి ఏఐ విద్యా సంస్థ. ఎక్కడంటే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లో అమరావతి ఒకటి. అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో సరికొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ రానుంది.
- FB
- TW
- Linkdin
Follow Us

అమరావతిలో బిట్స్
బిట్స్ వైస్ ఛాన్సలర్, బిజినెస్మేన్ కుమారమంగళం కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యాధునిక సాంకేతిక విద్యా కేంద్రంగా ‘ఏఐ ప్లస్ క్యాంపస్’ని నిర్మించనున్నట్టు తెలిపారు. ఇది దేశంలోనే మొదటి ప్రత్యేక కృత్రిమ మేధ (Artificial Intelligence) ఆధారిత క్యాంపస్గా మారనుంది. ఈ ప్రాజెక్ట్తో విద్యా రంగం, పరిశ్రమ, పరిశోధనల మధ్య అనుసంధానానికి మార్గం వీలుకాబోతుంది.
రూ.1,000 కోట్లతో రెండుదశల్లో నిర్మాణం
బిర్లా గ్రూప్ రూ.1,000 కోట్ల భారీ పెట్టుబడితో అమరావతిలో ఈ క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. 2027 నాటికి విద్యార్థులకు ప్రవేశాలు ప్రారంభించేలా నిర్మాణాన్ని వేగంగా కొనసాగిస్తామని వెల్లడించారు. మొత్తం ప్రాజెక్ట్ను రెండుదశల్లో అభివృద్ధి చేసి, 7,000 మందికి పైగా విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇది దేశ విద్యా రంగంలో గణనీయమైన మైలురాయిగా నిలుస్తుందని బిర్లా పేర్కొన్నారు.
ఏఐ ఆధారిత కోర్సులకు ప్రత్యేక ప్రాధాన్యం
ఈ క్యాంపస్లో కృత్రిమ మేధ (AI), డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ వంటి ప్రోగ్రాములకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ‘ఏఐ ఫర్ హెల్త్కేర్’, జనరేటివ్ ఏఐ, స్మార్ట్ సిటీస్ వంటి కొత్త సబ్జెక్ట్లపై ప్రత్యేక కోర్సులు అందించనున్నారు. అంతేకాదు, ఈ క్యాంపస్ ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ హబ్గా, పారిశ్రామిక భాగస్వామ్యాల కేంద్రంగా మారబోతుంది.
అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యం
BITS అమరావతి క్యాంపస్ను గ్లోబల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా నిర్మించనున్నట్టు BITS వైస్ ఛాన్సలర్ వి.రామగోపాలరావు వెల్లడించారు. విద్యార్థులు మొదటి రెండేళ్లు అమరావతిలో, తర్వాత రెండు సంవత్సరాలు విదేశీ భాగస్వామ్య విశ్వవిద్యాలయాల్లో చదివేలా డ్యూయల్ డిగ్రీ విధానం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుని, జాయింట్ పీహెచ్డీ కార్యక్రమాలను కూడా ప్రవేశపెడతామని తెలిపారు.
గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ వసతులు
సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద 70 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం BITS కు కేటాయించింది. ఆలయ నమూనాలోనే క్యాంపస్ భవనాల నిర్మాణం జరుగుతుంది. గ్రీన్ బిల్డింగ్స్, పునరుత్పాదక విద్యుత్ ఆధారిత మౌలిక సదుపాయాలతో పాటు IOT, AI ఆధారిత సేవలు ఉండే డిజిటల్ ఫస్ట్ క్యాంపస్గా అభివృద్ధి చేస్తున్నారు. ఇది భారతదేశంలో ఏ ఇతర విద్యా సంస్థకు లేని ప్రత్యేకతగా నిలవనుంది.
అమరావతికి పెట్టుబడుల ప్రవాహం
BITS క్యాంపస్తో పాటు ఇప్పటికే పలు ప్రైవేట్, విదేశీ విద్యా సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ కొత్త కేంద్రంతో ఉద్యోగ అవకాశాలు, స్టార్టప్లు, పరిశోధనలు, పారిశ్రామిక భాగస్వామ్యాలకు మరింత ఊతం లభించనుంది.