- Home
- Andhra Pradesh
- Amaravathi: అమెరికాలోని ఆ ప్రాంతం తరహా అమరావతి.. చంద్రబాబు విజన్ మాములుగా లేదుగా
Amaravathi: అమెరికాలోని ఆ ప్రాంతం తరహా అమరావతి.. చంద్రబాబు విజన్ మాములుగా లేదుగా
అమరావతి నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచింది కూటమి ప్రభుత్వం. మూడేళ్లలో రాజధాని ఒక రూపు తీసుకురావాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. ఇందులో భాగంగానే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

క్వాంటమ్ వ్యాలీగా అమరావతి
సిలికాన్ వ్యాలీ మాదిరిగానే, అమరావతిని “క్వాంటమ్ వ్యాలీ”గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర క్వాంటమ్ మిషన్పై ఐటీ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేలా ప్రత్యేక దిశానిర్దేశం చేశారు.
క్వాంటమ్ మిషన్కు ప్రత్యేక కమిటీ
రాష్ట్ర క్వాంటమ్ మిషన్ అమలు, పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ కమిటీకి ఆయన తానే చైర్మన్గా వ్యవహరించనున్నారు. కమిటీలో ఐటీ శాఖ మంత్రి, సీఎస్, ఐటీ, ఆర్థికశాఖల కార్యదర్శులు, మిషన్ డైరెక్టర్తో పాటు, పలువురు టెక్నాలజీ నిపుణులు సభ్యులుగా ఉంటారు.
రెండు దశల్లో మిషన్ అమలు
ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్ను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి దశ (2025-2027): మౌలిక సదుపాయాల నిర్మాణం, విద్యా, పరిశోధనా కేంద్రాల స్థాపన, పైలట్ ప్రాజెక్టుల అమలు. రెండవ దశ (2027-2030): గ్లోబల్ లీడర్షిప్ సాధన, వ్యాపార విస్తరణ, ఎగుమతుల పెంపు. ఈ ప్రణాళికలతో రాష్ట్రం క్వాంటమ్ రంగంలో దేశానికే మార్గదర్శిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
4,000 కోట్లతో భారీ పెట్టుబడి
ఈ మిషన్కు వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ. 4,000 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు IBM సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించనుంది. క్వాంటమ్ ఆధారిత పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్ అడుగులు వేయనుంది. మిషన్ అమలుకు త్వరలోనే ఓ డైరెక్టర్ను నియమించనున్నారు.
నూతన ఐడియాలతో వర్క్షాప్
ఈ నెల 30న క్వాంటమ్ మిషన్పై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఇందులో ఐటీ, ఫార్మా, వ్యవసాయ, హెల్త్సెక్టార్, యూనివర్సిటీలు, కాలేజీలు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, ఇన్నోవేటర్లు పాల్గొననున్నారు. హైదరాబాద్ హైటెక్సిటీ స్థాయిలో అమరావతిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకుంటుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.