ఏపీలో నిప్పుల కుంపటి.. 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్
Heatwave Alert : ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. గురువారం 101 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండల తీవ్రత పెరుగుతోందనీ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

బాబోయ్ ఎండలు.. మాడిపోతారు !
ఆంధ్రప్రదేశ్ లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 275 మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. ఎండలతో పాటు ఉక్కపోత కూడా తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త
గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో గరిష్ఠంగా 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు రాకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
తీవ్ర వడగాల్పులు వీచే మండలాలు ఇవే
గురువారం మొత్తం 34 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 67 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ, హిరమండలం, పాతపట్నం మండలాల్లో ఎండలు మండిపోనున్నాయి. అలాగే విజయనగరం జిల్లాలో బొబ్బిలి, రాజాం సహా 16 మండలాల్లో, పార్వతీపురం మన్యం జిల్లాలో దాదాపు 14 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉండనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 37 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
రికార్డు స్థాయికి పెరిగిన ఉష్ణోగ్రతలు
బుధవారం నమోదైన వివరాల ప్రకారం, నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. పల్నాడు జిల్లా గురజాలలో 44.5 డిగ్రీలు, కడపలో 44.1 డిగ్రీలు, మార్కాపురం అనుమలపల్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తా ఆంధ్రలో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. కర్నూలు, తిరుపతి, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 41 డిగ్రీల వేడి నమోదైంది.
మండిపోతున్న ఎండలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ఏదైనా కప్పుకోవాలని సూచించారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, షుగర్, బీపీ ఉన్న రోగులు ఎండలో తిరగడం ప్రమాదకరం అని హెచ్చరించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉక్కపోత, వడగాల్పుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

