అంతర్వేది రథం దగ్ధం: కుడి ఎడమైతే జగన్ కు చిక్కులే
రాజకీయంగా, పరిపాలన పరంగా జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో దూసుకుపోతున్నాడు. ఆయన ఆధిక్యతకు వచ్చిన సమస్యే లేకపోవడంతో.... సున్నితమైన మతపరమైన అంశాలను తెర మీదకు తీసుకువచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో అంతర్వేది దేవాలయం రథం అగ్నికి ఆహుతవడం అత్యంత దురదృష్టకరం. స్వామివారి దివ్య రథం తగలబడడంతో భక్తులు కలవరం చెందారు. ఈ విషయం పై ప్రభుత్వం స్పందించి వెంటనే ఈఓ ను బదిలీ చేసి ప్రత్యేకాధికారిని నియమించింది కూడా. ఏ విషయాన్నయినా రాజకీయం చేస్తున్న ప్రస్తుత కాలంలో.... ఈ సంఘటన కూడా రాజకీయ రంగు పులుముకుంది.
హిందుత్వ కార్డును బలంగా ప్రయోగిస్తూ.... హిందుత్వానికి అనధికార పేటెంట్ కలిగిన బీజేపీ రంగప్రవేశం చేయడంతో..... ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం అవడంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనులు ప్రతిపక్షాలు నెత్తికెత్తుకున్నాయి.
దేవుడి రథాన్ని తగలబెట్టే దుస్సాహసం ప్రభుత్వ అండదండలు లేకుండా చేస్తారా అంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. సంఘటన ప్రమాదం వల్ల సంభవించిందా, లేదా కుట్ర కోణం దాగుందా అనే విషయం పై ఎటువంటి స్పష్టత రాకమునుపే అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టె పనులు చేసాయి ప్రతిపక్షాలు. దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని పట్టుబట్టాయి.
రాజకీయంగా, పరిపాలన పరంగా జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో దూసుకుపోతున్నాడు. ఆయన ఆధిక్యతకు వచ్చిన సమస్యే లేకపోవడంతో.... సున్నితమైన మతపరమైన అంశాలను తెర మీదకు తీసుకువచ్చారు. ఈ మధ్యకాలంలో యావత్ దేశంలో కూడా మతం ఆధారంగా రాజకీయాలు చేయడం మనం చూస్తున్న నిత్యకృత్యం.
హిందుత్వ కార్డును జగన్ మోహన్ రెడ్డి మీద బలంగానే ప్రయోగించాయి ప్రతిపక్షాలు. బీజేపీ, జనసేనలు సహా టీడీపీ కూడా ఇదే అంశాన్ని ఎత్తుకొని..... హిందూ మత ప్రతీకలపై జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుండి దాడులు తీవ్రమయ్యాయని ఆరోపణలు చేసాయి.
సున్నితమైన అంశం కావడం, మతం ఆధారంగా చేసే రాజకీయాలను కొన్ని కారణాల వల్ల జగన్ సర్కార్ బలీహనంగా కనబడుతుంది. దాని గురించి వేరుగా చెప్పనవసరం లేదు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఈ విధమైన రాజకీయాలు చేసినప్పటికీ.... ఆయన సంక్షేమ పథకాల జోరు, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండడంతో... రాజశేఖర్ రెడ్డి మీద ఇటువంటి పాచికలు పారలేదు.
ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మీద ఇలాంటి అస్త్రాలను సంధిస్తున్నారు. జగన్ ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన పొలిటికల్ హీట్, వ్యతిరేకతను ఎదుర్కుంటున్న తరుణంలో... ఇలాంటి మతపరమైన రాజకీయాలు ఇబ్బందులు కలిగించవచ్చు.
జగన్ మోహన్ రెడ్డి ఈ కేసును సిబిఐ కి అప్పగించడంతో తన నిజాయితీని, నిబద్ధతను ప్రకటయించి ఉండవచ్చు. విపక్షాలకు పోరాడడానికి అంశం లేకుండా చేసి ఉండవచ్చు. కానీ భవిష్యత్తులో ఇది తీవ్ర ప్రభావం చూపెట్టే ఆస్కారం ఉంది.
ప్రతి చిన్న విషయానికి ప్రతిపక్షాలు సిబిఐ విచారణను డిమాండ్ చేస్తాయి. సిబిఐ విచారణకు గనుక అనుమతిస్తే.... తాము విజయం సాధించాయని చెప్పుకుంటాయి విపక్షాలు. ఒక వేళఅనుమతించకపోతే... ప్రభుత్వం ఏదో దాస్తోంది, ఇది కుట్రపూరిత చర్య అని అనే వీలుంటుంది. ఇప్పటికే అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు ప్రభుత్వం అనుమతించడంతో ఇది తమ విజయం అని చెప్పుకుంటూ బీజేపీ నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. సునీల్ దేవధర్ నుండి మొదలుకొని సోము వీర్రాజు వరకు ఇదే విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ, క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు.
ఇప్పటికే సింహాచలం దేవస్థానం పై కూడా టీడీపీ ఇప్పటికే అవకతవకలు జరుగుతున్నాయని, దానిమీద కూడా సిబిఐ విచారణ జరిపించాలని కోరుతుంది. టీటీడీ మీద కూడా ఇదే రకమైన వైఖరిని తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
గతంలో రమణ దీక్షితులు ఆరోపణలు గుప్పించిన పింక్ డైమండ్ విషయం ఏమైందని గనుక ప్రతిపక్షాలు పట్టుబడితే.... వైసీపీ ఇరకాటంలో పడిపోతుంది. పోనీ సిబిఐ కి అప్పగిస్తే... రాష్ట్ర ప్రభుత్వం తన విశ్వసనీయతకు తానే సమాధి కట్టుకున్నట్టు అవుతుంది.
భవిష్యత్తులో ఈ అంశాలు రాజకీయంగా ఎలా ప్లే అవుట్ అనేది చాలా జాగ్రత్తుగా గమనించాల్సి ఉంటుంది. ఈ సిబిఐ విచారణల డిమాండ్ ఇక్కడితో ఆగుతుందా, లేదా ఇదే రోజు వారి తతంగంగా మారి అధికార పక్షాన్ని ఇబ్బంది పెడుతుందా చూడాలి.